29, జనవరి 2011, శనివారం

కష్ట చతుష్టయమ్


ఎంతటి ధీరుడైనా నాలుగు రకాలయిన కష్టాలను మాత్రం ఓర్చుకో జాలడని పెద్దలు చెబుతున్నారు.

అవేమిటో చూద్దాం ...

సహస్ర దు:ఖాని సహంతి ధీరా : చత్వారి దు:ఖా న్యతి దుస్సహాని
కృషీ చ నష్టా గృహిణీ చ దుష్టా, పుత్రో2స్యవిద్వాన్ , ఉదరే వ్యథా చ.

ధీరులు వేయి దు:ఖాలనయినా ఓర్చుకో గలరు. అంటే, ఎన్ని కష్టాల నయినా సహించ గలరు. కానీ, నాలుగు రకాలయిన కష్టాలు మాత్రం వారికి అత్యంత దుస్సహమైనవి.

అవి యేమంటే ...

కృషి వినష్టమైతే ఆ కష్టాన్ని ఎంతటి ధీరుడూ ఓర్చుకో లేడు. కృషి అంటే వ్యవసాయం. వ్యవసాయం చెడిపోతే అ దు:ఖం ఎంతటి ధీరుడినీ భీరువుగా చేస్తుంది.

ఇక రెండవది - భార్య దుష్టు రాలైతే ధీరుడు ఓర్చుకో లేడు.

పుత్రుడు విద్యా గంధ శూన్యుడయితే ఎంతటి ధీరుడూ సహించ లేడు.

ఇక, నాలుగవది - ఉదర బాధ. కడుపు నొప్పికి ఎంతటి ధైర్యవంతుడయినా తాళ లేడు.

ఈ రకంగా ఈ శ్లోకంలో ధీరుడు వేయి కష్టాలను సహించ గలడు కానీ, వ్యవసాయం నష్టమైనా, భార్య గయ్యాళిదైనా, కుమారుడు చదువు రాని దద్దమ్మ అయినా, కడుపులో నెప్పి కలిగినా ఓర్చుకో జాలడని కవి చెబుతున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి