3, ఫిబ్రవరి 2011, గురువారం

మాయ మైపోయానోచ్ !


ఎవరయినా సంపదలనిచ్చే లక్ష్మీ దేవిని నుతిస్తారే తప్ప, దరిద్ర దేవతను పొగడరు కదా ?

కాని, ఈ శ్లోకంలో కవి దరిద్ర దేవతను ఎలా నుతిస్తున్నాడో చూడండి:

దరిద్రాయ నమస్తుభ్యం, సిద్ధో2హం త్వత్ప్రసాదత:
సర్వం పశ్యామి దేవేశ, న మాం పశ్యతి కశ్చన.

దీని అర్ధం ఏమిటంటే,

ఓ దరిద్ర దేవతా ! నీకు వందనాలు. ఎందువల్లనంటే, నీ అనుగ్రహం వల్లనే కదా, నేను సిద్ధుడనైనాను. నాకు మహిమాన్వితమైన గొప్ప సిద్ధులు చేకూరాయి.

ఎలా అంటావా?

నేను అన్నింటినీ చూడ గలుగు తున్నాను. కాని ఒక్కరు కూడా నన్ను చూడ లేక పోతున్నారు.

ఈ కామరూప విద్య నాకు ప్రసాదించింది నువ్వే కదా, తల్లీ !

ఇదీ కవిగారు దరిద్ర దేవతను నుతించిన వైనం.

ఇందులో చమత్కారం సులభ గ్రాహ్యమే. అష్ట దరిద్రుడైన వాడికి అందరూ కనిపిస్తారు. కానీ వాడి మీద ఒక్కరి చూపు కూడా పడదు. దరిద్రుడిని ఎవరు మాత్రం చూస్తారు చెప్పండి? వాడి ఉనికిని ఎవరు మాత్రం గుర్తిస్తారు చెప్పండి?

‘దరిద్రుడనయినందు వలన నన్ను ఎవరూ పట్టించు కోవడం లేదు’ అని వాపోతున్నాడన్నమాట.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి