23, జనవరి 2012, సోమవారం

అ ఆలు దిద్ది నందుకు మీరూ తలో చెయ్యీ వెయ్యండి ...ఒక విఙ్ఞప్తి.





తెలుగు ప్రపంచానికో విఙ్ఞప్తి - మూడు యాభయిల

మన గురజాడ 1862 - 2012

విజయ నగరం జిల్లా కలెక్టరు శ్రీ ఎం. వీర బ్రహ్మయ్య గారి సౌజన్యంతో తే 21.09.2011 ది నాడు వెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ ప్రారంభించిన ‘‘ మూడు యాభయిల మన గురజాడ’’ వేడుకలలో భాగంగా విజయ నగరం ఆనంద గజపతి ఆడిటోరియంలో స్థానిక కళాకారుల బృందం సమర్పించిన కన్యా శుల్కంనాటక ప్రదర్శనకి విచ్చేసిన వేలాది ప్రేక్షకులకు అంత పెద్ద హాలూ చాలింది కాదు. అదీ గురజాడ అప్పారావు ( 1862 – 1915) సాధించిన విజయం.

చూస్తున్నాం కదా ! మనకిప్పుడు కన్యాశుల్కం సమస్య అయితే లేదు. అయినా కన్యా శుల్కం నాటకం నూరేళ్ళు దాటినా నిత్య నూతనంగా నేటికీ బతికే వుంది.

కారణం ?

గ్రామ గ్రామాన గిరీశాల ఇష్టారాజ్యం ఇంకా చెల్లుబాటుగానే వుందన్న మాట.

తనతో లేచిపోయి రావడానికి బుచ్చమ్మ అంగీకరించక పోతే, ఆనాటి గిరీశం తల కొట్టుకు ఛస్తానన్నాడు. మరిప్పుడో ! మదమెక్కిన గిరీశాలు కత్తులతో వీరనాట్యం చేస్తూ పదిమందీ చూస్తూ వుండగానే మిట్ట మధ్యాహ్నం, నట్ట నడిరోడ్డు మీద బుచ్చమ్మ గొంతులు ప్రేమను అంగీకరించక పోతే తెగ నరుకు తున్నారు

‘‘ Twinkle ! Twinkle ! Little Star ’’ అంటున్న వెంకటేశాలని చూస్తూ నేటికీ ఇంటింటా వెంకమ్మలు తెగ మురిసి పోతున్నారు.

ఏ కోర్టు వరండాలో చూసినా ‘‘ నేను రామప్పంతుల్నిరా అబ్బాయీ ’’ అంటూ పలకరిస్తున్నారు నేటి రామప్పంతుళ్ళు.

ఇలా సమాజం కనిపిస్తున్నంత కాలం ‘‘ కన్యాశుల్కం’’ ఎన్నాళ్ళయినా బతికే వుంటుంది. కన్యా శుల్కం పోయి వరకట్న దురాచారం రాచపుండు లా సమాజాన్ని కుళ్ళబొడుస్తోంది. దాన్ని రూపుమాపడానికి మరో మహానుభావుడు రావల్సే వుంది. తనకనువయిన రచయితని సమాజమే తయారు చేసుకుంటుంది. ‘‘సంభవామి యుగే యుగే’’ అన్నది అందుకే.

తన వ్యాసంగానికి తను వేసుకున్న ప్రణాళికలకూ సహకరించని ఆరోగ్యం అప్పారావు గారిది. తేది 31.03.1895 నాడు డా. బ్రౌనింగ్ , గురజాడ ఆరోగ్యాన్ని సమీక్షిస్తూ ఎండలో తిరగ కూడదనీ, సైకిలు తొక్క కూడదనీ, శారీరక సుఖానికి కూడా దూరంగా వుండాలని హెచ్చరించాడంటే, గురజాడ స్వరూపం అర్ధమవుతుంది. మహారాజా కాలేజీ లెక్చరర్ గా పని చేస్తున్న గురజాడను రాజావారి ఆంతరంగిక కార్యదర్శిగా కుదిర్చారంటే అప్పారావు గారి ఆరోగ్యం పట్ల డాక్టరు ఆందోళన అర్థం చేసుకో వచ్చు.

అంత బక్కజీవీ సంస్థానం పెద్దదావా (1899) భుజాన వేసుకుని వి.యపథాన నడిపించాడు. ఎదటి పక్షం రాజులు 40 వేల రూపాయలు ఇచ్చి, దావా పనులనుండి తప్పు కోవాలని ఆశ పెడితే,

‘‘ అజీర్తి వ్యాధితో పిడికెడు మెతుకులే అరిగించు కోలేని నాకు ఈ డబ్బు ఎలా జీర్ణమవుతుంది ? ’’ అని వారిని సగౌరవంగా సాగనంపాడంటే గురజాడ రుజు మార్గం మనకు సుళువుగానే తెలుస్తుంది. ఆ రోజుల్లో అమల్లో వున్న సంస్థానం పద్ధతి ప్రకారం తను అద్దెకుంటున్న సంస్థానం ఇంటిని కొనుక్కుని తన అవసరాలకు అనుగుణంగా బాగు చేసుకోడానికి తన వద్ద సరిపడా డబ్బు లేదనీ, అందుకని దయతో రెండు వేల రూపాయలు అప్పుగా ఇప్పించాలనీ దివాణం వారికి అర్జీ ( 7.2.1913) పెట్టు కున్నాడంటే 1899 నాటి 40 వేల విలువ సుళువుగానే వూహించు కోవచ్చును. అదీ గురజాడ ఔన్నత్యం.

‘‘ రామతీర్థం’’ అయ్యంగార్ల వారి చేరీకి చెందిన ఓ ఆచార్యుల వారు 15.3.1914 నాటి తన దినచర్యలో ‘‘ రూ.8-4-0 విజయనగరం ఖర్చులకు పట్టకుని వెళ్ళినాను. సాయంకాలమునకు విజయ నగరంలో ప్రవేశించినాను. వెంటనే అప్పారావు పంతులు గారిని చూచినాను. వారు రేపు మద్రాసు వెళుతున్నామనిన్ని, వచ్చిన పిమ్మట దర్శనం ప్రయత్నం చేస్తమని చెప్పి సర్కారులోకి వెళ్ళినారు’’ అని వ్రాసుకున్నారు. తరువాత ద్వారకా వారింటికీ, రంగమ్మ గారింటికీ, శంకర్రావు పంతులుగారింటికీ తిరిగి కోటలోకి వెళ్ళడానికి ఆయన చేసిన ప్రయత్నాలు చూస్తే రాజాస్థానంలో అప్పారావుగారి కున్న హోదా తెలుస్తుంది.

మొక్కలాంటి కన్యాశుల్కం (1892) నాటకాన్ని తిరగరాసి (1909) మహా వృక్షంగా తీర్చి దిద్ది తెలుగు నాటకాన్ని ప్రపంచ స్థాయి నాటకాల సరసన నిలబెట్టిన నేర్పు గొప్పది. దాన్ని ఎరుక పర్చడానికి డా. ఉపాధ్యాయుల అప్పల నరసింహ మూర్తిగారు 722 పేజీల తులనాత్మక పరిశోధనా గ్రంథమే రాయాల్సొచ్చింది.

గిడుగు రామ్మూర్తి పంతులు ( 1863 – 1940) గారితో కలిసి వ్యావహారిక భాషోద్యమం నడిపి తెలుగు భాషను పండిత వర్గంనుండి గుంజి, ప్రజలపరం చేసాడు. వారిద్దరు నడిపిన ఉద్యమమే లేకపోయి వుంటే నేటికీ మన విశ్వ విద్యాలయాల్లో కరటక శాస్త్రి శిష్యుడిలా ‘‘ ప్రియా ముఖం కింపురుషశ్చచుంబతి’’ లాంటి సంస్కృత శ్లోకాలు వల్లె వేసుకుని స్నాతకోత్సవాల ఫొటోలను చూసుకుంటూ మురిసి పోదుం.

అంతెందుకు, ఉత్తరాన హిమాలయాలు, తూర్పున బంగాళాఖాతం లాంటి ఎల్లలేం చెప్పకుండా

‘‘ దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’’ అంటూ మనిషికే పట్ట కట్టడం బహుశా ప్రపంచ సాహిత్యంలోనే అరుదైన ఆణిముత్యంలాంటి వాక్యం.

భావకవిత్వపు జలధారలొచ్చి, గురజాడ అందించిన జీవధారని పక్కకి నెట్టాయి. పుత్తడిబొమ్మ పూర్ణమ్మకీ (1910) చెల్లి చంద్రమ్మకీ (1971) మధ్యన దూరాన్ని కల్పించిన మిడతంభొట్లు, వెతగ్గలిగితే చిక్కక పోడు. గురజాడ మార్గాన్ని తొలితరం కవులు ఏసంకోచం లేకుండా అందుకొనుంటే మన సంస్కారం ఈ తీరునుండకపోను. తెలుగు భాష అంతరించి పోతుందన్న పీకుడూ లేకపోను.

‘‘ My cause is the cause of the people and I have cultured opinion at my back. I do not mind if those who are incapable of understanding the subject array themselves against me. Their conversion can do no good to the language. They are so hopelessly wedded to the old highly artificial literary dialect.’’

మహా మహోపాధ్యాయ వేదం వేంకటరాయ శాస్త్రి ( 1853 -1929) ఆంధ్రనాటక పితామహ శ్రీ ధర్మవరం రామకృష్ణమాచార్యులు ( 1853 – 1912) పండితులు, పరిశోధకులు శ్రీ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు (1877 – 1929) లాంటి అఖండ పండితుల నుద్దేశించి అన్న ఈ మాటలు చూస్తే, శ్రీ.శ్రీ కూడా ఇంత సాహసం ప్రదర్శించ లేదు. అయితే తొలితరం కథక చక్రవర్తులు శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు పంతులు ( 1865 – 1940) , చింతా దీక్షితులు ( 1891 -1960), శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ( 1891 – 1961 ), శ్రీ గుడిపాటి వెంకట చలం (1894 – 1879) లాంటి హేమా హేమీలు కవిత్వానికి పట్టిన గతి పట్టకుండా కథను ప్రజల పరం చేసారు. నాటకం సరే. నేటికీ ‘‘ కన్యాశుల్కం ’’ స్థాయిని అందుకోటానికి ప్రయత్నాలే మొదలవలేదు.

గురజాడ స్థాయిని మనమేం తక్కువగా చూస్తున్నామా అంటే, అదేం లేదు. ఆయన ప్రపంచ స్థాయి సాహితీవేత్తల సరసనే నిలవాలని అంచనాలయితే వేస్తున్నాం కానీ, తెలుగేతర ప్రపంచం గురజాడను చూచి అబ్బురపడే స్థాయిలో ఇంతవరకూ ఏ కార్యక్రమం జరిపించుకో లేకపోయాం. మనకు గురజాడ అభిమానులకైతే కొదవేంలేదు. ‘‘ కన్యాశుల్కం నూరేళ్ళ పండగ’’ (1992) సాలు పొడుగునా అజేయంగా నిర్వహించుకొన్న ధైర్యంతో ‘‘ మూడు యాభయిల మన గురజాడ’’ కార్యక్రమం రవీంద్రుడికి, సుబ్రహ్మణ్య భారతికీ దక్కుతున్న స్థాయిలో జరుపుకోడానికి

డా. పూసపాటి ఆనందగజపతిరాజు గారు ముఖ్య పోషకులుగా కార్యక్రమాలు రూపకల్పన చేసుకున్నాం. అందుకు జాతీయ, అంతర్జాతీయ తెలుగువారైన మీరు గురజాడ ఆత్మీయులుగా ఈ కార్యక్రమానికి చేయూత అందించాలని వేడుకుంటూ శక్తిమేరకు మీ విరాళాలు ‘‘ వెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ – విజయ నగరం ’’ పేరున అందించాలని ప్రార్ధిస్తున్నాం.

21-09-2011 - 21 -09 2012 కార్యక్రమాలు.

· నెలనెలా కీలకోపన్యాసాలు.

· ప్రఖ్యాత నర్తకులచే పూర్ణమ్మ, కన్యక నృత్యరూపక ప్రదర్శనలు.

· మనిషి ప్రపంచ మానవుడిగా రపు దిద్దుకోడానికి దేశభక్తిగీతం చేసిన దిశానిర్దేశం వెలుగు పర్చడం.

· తెలుగేతర ప్రపంచానికి గురజాడని ఎరుక పర్చడం

· చివరి మూడు రోజుల మహా సభలు గురజాడ స్థాయికి తగ్గట్టు రూపకల్పన చేసుకోవడం.

· స్థానిక నటవర్గంచే ‘‘సంపూర్ణ కన్యాశుల్కం ’’ ప్రదర్శన.

· సమగ్ర ప్రత్యేక సంచిక

· బాపు గారి సచిత్ర కన్యాశుల్కం.

· విజయ నగరంలో సర్వాంగసుందరంగా సమస్త సదుపాయాలతో గురజాడ భారతి ఆడిటోరయం.

‘‘ ఏవిట్రా వీడి గోతాలు ! ’’ అనీకండేం.

ఇవన్నీ జరిగితేనే మన ఆబోరు దక్కేది.

*ఇతర వివరాలకు :

కన్వీనర్,

శాసపు రామినాయుడు,

పొనుగుటి వలస

రాజాం – 532127

శ్రీకాకుళం జిల్లా. ఆంధ్ర ప్రదేశ్, ఇండియా.

సెల్ 8985922183

1 కామెంట్‌:

www.apuroopam.blogspot.com చెప్పారు...

ఇది చాలా ముఖ్యమైన విజ్ఞప్తి. వెలుగు రామినీడుగారి కృషి ప్రశంసనీయం.సాహితీ మిత్రులందరూ ఈ విషయంలో వారితో చేతులు కలపగలరని ఆశిస్తున్నాను.ఒక సమస్యను తీసుకుని వ్రాసిన నాటకం ఆ సమస్య కనుమరుగైన వంద సంవత్సరాల తర్వాత కూడా బహుళ జనాదరణకి నోచుకుంటోందంటే దానికికెవ్వరి కితాబులూ అక్కర లేదు.కన్యాశుల్క నాటకం కేవలం ఆ సమస్యను దృష్టిలో పెట్టుకుని మహాకవి వ్రాయలేదని సమాజ సమగ్ర చిత్రణ ఆయన ధ్యేయమనీ తెలపడానికే పేకాటసీను సారాయంగళ్ల సీనులగురించి నా అపురూపం బ్లాగులో వ్రాసేను.కన్యాశుల్కం నాటకం బ్రతికి ఉండడానికి పాత్రల సజీవ చిత్రణే కారణం.ఆ నాటకం చిరంజీవి.
చాలా మంచి వ్యాసాన్ని అందిచినందుకు అభినందనలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి