21, ఫిబ్రవరి 2012, మంగళవారం

హా ! దొరికెన్ !






హమ్మయ్య ! దొరికిందండీ, ఇన్నాళ్లకి !

పఠాభి ‘ ఫిడేలు రాగాల డజన్ ’ పుస్తకం ఓ మిత్రుని ఇంట దొరికింది. మద్రాసు రామరాయ ముద్రణాలయం వారు వేసిన ఈ పుస్తకం ఏ సంవత్సరంలో ప్రచురించ బడిందో వివరాలు ప్రచురణ కర్తలు ఇవ్వ లేదు. శ్రీ. శ్రీ ధర్మమా అనీ, ఇది ప్రమాది అధిక శ్రావణ మాసంలోనో, కాస్త అటూ ఇటూ గానో వెలువడి నట్టుగా భావించ వచ్చు. దానికి సరిపోయిన ఇంగ్లీషు సంవత్సరం చూసుకుంటే సరి. వెల మాత్రం‘‘ డజన్ అర్ధణాలు’’ అని ఉంది. అంటే ఆరు అణాలని తాత్పర్యం ! అనగా పావలా బేడ. అనగా అర్ధ రూపాయికి రెండణాలు తక్కువ. అనగా, నలుబది ఎనిమిది కానులు. అనగా ... అనగా .... అనగా ....

పాత ఎక్కాల బుక్కు మీరే చూసుకోండి.

కవి ఈ పుస్తకాన్ని వచన పద్యములు అని పేర్కొన్నాడు. నేను తెలుగులో పీ.జీ

చేసి నప్పుడు ఫిడేలు రాగాల డజన్ కోసం చాలా వెతికాను, ఎక్కడా కాపీలు నాకయితే దొరక లేదు. ఇందులోని కవితలను ( వచన పద్యములను ? ) అక్కడా ఇక్కడా చూసి, ఎత్తి రాసుకొని బండి లాగించీసేను. ఇప్పుడు దొరికింది, ఈ చిన్న పుస్తకం. ఎలా ఉందో చూసారూ ? పఠాభి రచన మీద చెదలు తమ అభిప్రాయం చెప్పాలని అనుకుని, మధ్య లోనే విరమించు కున్నట్టున్నాయి. మహా భారతంతో పాటూ, మహా ప్రస్థానం వరకూ అవి ఇలాగే తమ అభిప్రాయాలు నిక్కచ్చిగా తెలియ జేస్తూ ఉంటాయి, మన జాగ్రత్తలో మనం ఉండక పోతే !

పుస్తకం అట్ట మీద - ‘‘చదవండి ఫిడేలు రాగాల డజన్ ’’ అని ఉంది. కింద చిన్న ఫిడేలు బొమ్మ చూసారు కదూ. ఇక్కడ కొంత కొంటె దనం. అప్పట్లో కొత్త దనం- కన బరిచారు. ఫిడేలు బొమ్మ కింద రాగాల డజన్ అని ముద్రించారు. కింద చలం గారి మాటలు ... వెనుక అట్ట మీద విద్వాన్ విశ్వం గారివీ, వేదుల (సత్య నారాయణ శర్మ) వారివీ , మాటలు ఉన్నాయి. తర్వాత,

ఆంధ్ర పత్రిక వారివీ, కథాంజలి వారివీ అభిప్రాయాలు కూడా వేశారు.

ఆ కింద చివరాఖరిగా ఎర్రక్షరాలతో రాగాల డజన్ కాదు, దీన్ని రోగాల డజన్ అనాలి. అని B.R.R గారు అభిప్రాయ పడ్డారు. ( వీరెవరు చెప్మా ? )



పుస్తకములు దొరుకు స్థలము : నమ్మాళ్వారు, పోస్టు బాక్సు 251, మద్రాసు అని ఉంది.

అంకితము మృణాళినికి, కాదు కల్యాణికి ; కాదు ఇరువురికి అని ఉంది.

కవి గారే రాసారో, ముద్రాపకులే రాసారో కానీ అంకితం తరువాతి పేజీలో ఇలా ఉంది:

‘‘అక్కడక్కడ ఈ పద్యాలలో వచ్చునట్టి పఠాభి అనే పేరు గల పాత్రకు, గ్రంథ కర్తకు

ఏ మాత్రం సంబంధం లేదని గమనింపు ; ‘‘ కృష్ణ పక్షం’’ లోని ‘‘ కృష్ణ’’ కును, దాని గ్రంథ కర్త నామం లోని ‘‘కృష్ణ’’ కును ఏలా సంబంధం లేదో అలాగే. ’’



ఇక, ఇంట్రో శ్రీ.శ్రీ రాసేరు. శ్రీ.శ్రీ నవ కవుల తిరుగు బాటుని గురించి రాస్తూ ఫిడేలు రాగాల డజన్ చదవమని సలహా ఇచ్చాడు. 38 పేజీలున్న ఈ చిన్ని పుస్తకంలో పుటల సంఖ్య లన్నీ తెలుగు అంకెలే వేసారు.

ఫిడేలు రాగం పద్యం ఇదీ .....

చూడండి.



ఫిడేలు రాగమ్ ఫిడేలురాగమ్

ఫిడేలు రాగమ్బులు

వినూతన పదప్ రేమికులు , మహా కాముకులు ;

అన్ యోన్ యమగు దమ్ పతులు కూడ;

ఫిడేలన్ నది,, ‘‘ మయ్డియ రాగ్రా

మీ వారన్దరు సనాతనాచార్ యుల్

ముఖమ్విరిచి, ఇన్ గ్ లీష్టానిని

నన్ ను న్జేపట్ టవద్ దని

గద్ దిన్చినా కూడ నీవు

మహా సాహసన్తో, రుమాన్ టిక్ గా

మ్ యారేజ్జేసుకొన్ నావు గదా ! స్ వీట్ హార్ ట్ ! ’’

రాగమ్ అనినాడు

‘‘థ్ యాన్ క్ స్ టు పఠాభి

నా కతడు ధయ్రిన్గా

సహాయమ్ జేయ పట్ టి మనకు

వివాహమయిన్ ది డార్ లిన్ గ్ !’’



ఫిడేలు రాగమ్బులు ఆదర్ శమగు జమృతులు

తటాల్ మని కలకన్ ఠ మున, ఫిడీలీలా

స్ ర శ్ ని న్ చినది. ‘‘ రాగా డియర్నన్ ను

నిజన్గా ప్ రేమిస్ తావా నీవు ?

ఏమ్ మాటన్టున్నావు ఫిడేలీ జీవితేశ్ వరీ!

నా జన్ మనీలో లీనమయి పోయిన్ది,

సన్ ఘమ్ నన్ వినా గూడా

నిన్ను చేపట్టినన్ దుక్నాకు , వచిమ్ప రాని

సవుఖ్ యమ్’’ ఫిడీలు చిత్ తతస్త్రులు

ఆపనందంతో మ్ రోగినవి.



రాగమ్ అంత ఫిడీలీని గాఢమ్ గా

కన్గిలించాడు. తర్వాత వారి

దేహాలు న్నే కమయినాయి సరళ శయ్యన్.

అపూర్ వమ్ బగు అన్దంబగు సన్తానమ్ వారికి

జనిన్చి అసన్ ఖ్ యాకముగ ; --- వారన్తా

పఠాభిని గని ‘‘ తాతా తాతా ’’ అనే వారు.



----------



దీనికి టీకా టిప్పణులు చెప్పడానికి శ్రీ. శ్రీ లేడు. ఆరుద్రా లేడు. రోణంకీ లేడు.

తెలిస్తే ఎవరయినా చెబుదురూ .......



అప్పుడు .... హా దొరికెన్ ! అని ఊరుకోకుండా, హా ! తెలిసెన్ ! అని కూడా అనుకుంటాను.

బాబ్బాబు ! ఎవరయినా పుణ్యం కట్టుకుందురూ !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి