నివాళి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నివాళి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, ఏప్రిల్ 2015, మంగళవారం

డా. ఉపాధ్యాయుల అప్పల నరసింహ మూర్తి ఇక లేరు ...


డా. ఉపాధ్యాయుల అప్పల నరసింహ మూర్తి ఇక లేరు !

విజ నగరానికి చెందిన ప్రముఖ సాహితీ వేత్త, విమర్శకుడు, వక్త, బహు గ్రంధ కర్త డా. ఉపాధ్యాయుల అప్పల నరసింహ మూర్తి ఇక లేదు.

బహు ముఖీన మయిన వారి ప్రతిభ సాహితీ లోకం ఎరిగినదే. కన్యా శుల్కం - 19 వ శతాబ్దపు ఆధునిక భారతీయ నాటకాలు  - తులనాత్మక పరిశీలన అనే వీరి బృహత్ గ్రంథం  వీరి ప్రతిభకు గీటురాయి. చర్వణ సాహిత్య సమాలోచన, చా.సో స్ఫూర్తి మొదలయిన సాహిత్య విమర్శనా గ్రంధాలు దాదాపు 25కి పైగా రచించారు.

విజయనగరం పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ ఉపాధ్యాయుల అప్పల నరసింహ మూర్తి (యూఏ నరసింహమూర్తి)కి ప్రతిష్ఠాత్మకమైన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జాతీయ ఫెలోషిప్‌ లభించింది. ఈ ఫెలోషిప్‌ను అందుకున్న తొలి తెలుగు వ్యక్తి ఈయనే కావడం విశేషం. ఈ ఫెలోషిప్‌ను కేంద్ర సాహిత్య అకాడమీ ద్వారా భారత ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖనుంచి పొందారు. ఫెలోషిప్‌కింద నెలకు రూ. 50 వేలు ఇస్తారు. ఉన్నత సాహిత్య ప్రమాణాలు గల రచయితలకు మాత్రమే ఈ అత్యున్నత ఫెలోషిప్‌ లభిస్తుంది. రెండు సంవత్సరాల వ్యవధిలో ఆసియా ఖండపు ఇతిహాసాలు- సాంస్కృతిక అంశాలపై తులనాత్మక పరిశోధన చేసి పుస్తకంగా సమర్పించాల్సి ఉంటుంది.

నవ్య వార పత్రికలో ‘‘ మా గురువులు బోధిస్తే  గోడలకు కూడా పాఠాలు వస్తాయి !’’ అనే శీర్షికతో నేను చేసిన  ఇంటర్వ్యూ ఈ లింక్ లో లో చూడ వచ్చును.  
http://kathamanjari.blogspot.in/2013/03/blog-post_15.html
మేం యూైఏ ఎన్ గా పిలుచుకునే ఈ సాహితీ స్రష్ఠ మరి లేరనే వార్త తలచు కుంటేనే గుండె బరువెక్కి పోతోంది. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం .

16, జనవరి 2015, శుక్రవారం

చాసో కథల్లో వెంటాడే వాక్యాలు !





తెలుగు కథకి తూర్పు దిక్కు చాసో ( చాగంటి సోమయాజులు) శత జయంతి వేడుకల సందర్భంగా... వారి కథల నుండి వెంటాడే వాక్యాలు  ....
 ‘పిల్లల హృదయాలు నిష్కల్మషంగా ఉంటాయి.స్వభావ సిద్ధంగా సంగీతం సమ్మోహన పరుస్తుంది. చిన్న వయసు నుంచి కాస్తంత రాగ తాళ ఙ్ఞానం కలిగిస్తే జీవితంలో సంగీతం ప్రవేశించి ఆజన్మాంతం ఆనంద హేతువు అవుతుంది.’

 ‘ కాని  ( పెళ్ళి చూపులకు  )వచ్చిన పెద్దలు పాటకు సెబాస్ అన్నారు. తెలుగు పెద్దలకి శృతీ, అపశృతీ తెలియవని,  రాగ తాళ ఙ్ఞానం వాళ్ళకుండదని, వాళ్ళ జీవితాలలో సంగీతం లేనే లేదని, అమాయకపు పెళ్ళి కూతుళ్ళకి ఏమి తెలుసు !’

‘నిత్య జీవితంలో ఆనందానికి, ఆరోగ్యానికి సంగీతం అవసమే. తాను పాడ లేక పోయినా అర్ధం చేసుకోగలిగితే ఉత్తమ సంగీతం మంచిని చేస్తుంది.’

‘వాతావరణంలో సంగీతం ఉంటే వాసాలు కూడా పాడతాయి.’

‘సరస్వతీ కటాక్షం నాకంతే ఉంది.   (ఫిడేలు) తల్లి వెళ్ళి పోయింది. వెళ్ళి పోతూ తల్లి గుణాన్ని చూపించు కుంది. నాకు ప్రాణం పోసింది. వెళ్ళి పోతూ నాకో చీరా రవికెల గుడ్డా పెట్టింది.’

                                                                                                        (వాయులీనం)
‘నాదారులు చిన్న దొంగ తనం చేస్తేపెద్ద నేరాలవుతాయి. ఉన్న వాళ్ళుచేస్తే కమ్ముకు పోతాయి. ’(కుంకుడాకు)

‘పెళ్ళాం మంచం మీద కళ్థళు మూసుకుని పరిమళిస్తూ పడుకున్నాది .దాని గుండెల మీంచి కిందకి వేళ్ళాడుతూ పడి వుంది మూడు మూళ్ళ జడ. ఏ పురుఫషుణ్ణయినా ఉరిపొయ్యడానికది చాలు. ’
( లేడీకరుణాకరం)

‘ఆరుగురు పిల్లలను పరాయి దేవతలకు కన్న తుంతీ దేవి పతివ్రతే అన్నారు.భర్త అనుమతిస్తే తప్పు లేదన్నారు శాస్త్రఙ్ఞులు. కుంతి పతివ్రత అయితే శారదా పతివ్రతే ’        ( లేడీ కరుణాకరం)

‘పాండిత్యం ఎక్కువయితే బుద్ధికి పడిశం పడుతుంది. ఎందుకొచ్చిన పాండిత్యాలు ?కూటికొస్తాయా ? గుడ్డకొస్తాయా ?’    ( (పరబ్రహ్మము)

‘అన్నం పరభ్రహ్మ స్వరూపం. అందుకు అన్వేషణ తప్పదు ! పరబ్రభ్మాన్ని అన్వేషించడమే జీవిత లక్ష్యమని అన్ని మతాలూ అంగీకరిస్తాయి.’    (పరబ్రహ్మము)
‘పదండి భడవ్లారా ! నేనే దొంగ మార్కెట్టులో  ( బియ్యం) అమ్ముకుని మేడలు కడుతున్నాను. నాకు ఉరిశిక్షకు తక్కువ వెయ్యకండి. నా పొగ కుక్కుటేశ్వరుడికి ధూపం వెయ్యండి’.     ( కుక్కుటేశ్వరము)

‘ఆనాటి దుమ్మలగొండె అనుభవం జీవితంలో ఘనమైన భ్రాంతిమదలంకారం.’   (దుమ్మలగొండె)

‘కూకుంటే ఎలతాదా?బూమిని బద్దలు సేసుకు బతకమన్నాడురా నిన్నూ నన్నూ బెమ్మ దేవుడు.’

‘మా గనమైన ఆలోశన తట్టింది. దెబ్బతో బుద్ధి మారి పోయింది.ఎళ్ళండ్రా అంతా ఎళ్ళండి.కూర్మిగాణ్ణి నానే పట్నం అంపుతన్నాను.మరి జట్టీ నేదు.’      ( వెలం వెంకడు)

‘కళ్ళు లేనివాడికి కడియాల రవలూ. గాజుల మోతలే కాబోలు కామాన్ని కదుపుతాయి’     ( ఎంపు)

‘కూడెట్టింది కాదు.  డబ్బు  సెడ్డ పాపిస్టి. తల్లీ పిల్లల ఆశలు సంపుతాది. రేత్రి జీతమంతా  (కూతురి) సేతిలెట్టినాను. పట్టెడన్నం పెట్టింది.ఇంక దినం తుతాది.’     ( బొండు మల్లెలు)

‘లేమి ఎంతటి వాళ్ళలోనయినా మానవత్వాన్ని చంపి అమానుషత్వాన్ని పెంచుతుంది. వృద్ధులకి పెన్షనులైనా ప్రభుత్వం ఇస్తే బావుణ్ణు. జీవిత భీమా ఉన్నా బావుణ్ణు.’      (బొండు మల్లెలు)

‘రాకరాక చిన్నాజీ వొచ్చింది.కథా వొద్దు. కావ్యం వొద్దు. చిన్నాజీతో ఐదు నిమిషాలు షేక్స్పియర్ కామిడీలో రసవంతమయిన ఐదంకాలపాటి చెయ్యవూ ? ’       (చిన్నాజీ)

‘ప..ప్స..పారెయ్య లేదు ఎందుకు పారేస్తాను నాన్నా.’        (ఎందుకు పారేస్తాను నాన్నా)

ఉపసంహారం :


చాసో కథల్లో వెంటాడే వాక్యాలంటూ ఏ కొన్నింటినో ఎత్తి రాయడ మేఁవిటి, వెర్రి కాక పోతే !

చాసో కథలన్నీ వెంటాడి వేధించేవే కదా ...


3, జనవరి 2012, మంగళవారం

వన్స్ మోర్ !! మా రాముడు వలస బుగత గారూ !



ఉద్యోగ విజయాలు నాటక ప్రదర్శన ముగిసింది. కొంత మంది ప్రేక్షకులు శ్రీకృష్ణ పాత్రధారిని చూడాలని ఉవ్వళ్ళూరారు.గ్రీన్ రూమ్ లోకి వచ్చేరు. అక్కడ మేకప్ తీసేసి, తన సహజమైన వస్త్రధారణలో - అంటే, చిన్న చిలక్కట్టు, భుజం మీద చిన్న తుండు గుడ్డ, నల్లని శరీరంతో బల్ల మీద కూర్చుని, చుట్ట కాల్చుకుంటూ నాటకాల గురించీ, మహాభారత భాగవత, రామాయణాల గురించీ, వివిధ పురాణాల గురించీ అనర్గళంగా మాట్లాడుతున్నారు వారు. ఆయనే శ్రీకృష్ణ వేషధారి పీసపాటి నరసింహ మూర్తి గారు అంటే ఎవరూ ఒక పట్టాన నమ్మ లేక పోయేరు. ఆయన నాటకం ముగిసిన తరువాత దాదాపు ప్రతీ ఊళ్ళోనూ జరిగే తంతే యిది !

వారి స్వగ్రామం రాముడు వలస . ఆ ఊరికి నేను చాలాసార్లు వెళ్ళడం జరిగింది. మా పార్వతీపురానికి దగ్గరే వారి ఊరు. విజయ నగరం సంస్కృత కళాశాలలో నాతో పాటు చదువుకున్న మంగిపూడి వేంకట రమణ మూర్తి ( ప్రముఖ హరి కథకులు) గారి తండ్రి గారూ, పీసపాటి వారూ దగ్గరి బంధువులు. అంచేత, నేను రాముడు వలస వెళ్ళి నప్పుడల్లా వారు నన్ను మా రమణ మూర్తితో పాటు ఎంతో ఆదరంగా పలకరించే వారు. సంస్కృత కళాశాల విద్యార్థులం అనే అపేక్ష వల్ల కూడానేమో ! ఎప్పుడు రాముడు వలస వెళ్ళినా, నాయనా ! అని ఆదరంగా పిలిచే వారు . ‘‘ ఎప్పుడు వచ్చితీవు ? ...’’ అంటూ రాగయుక్తంగా పలకరించే వారు. వారితో సహపంక్తి భోజనం చేసే అదృష్టం నాకు చాలా సార్లు కలిగింది. వారి భోజన కార్యక్రమం దైవ పూజ చేస్తున్నంత నిష్ఠగా సాగేది. చిన్న కావి రంగు ముతక గావంచా కట్టకొని, పై మీద నాగుల తువ్వాలుతో వారి రూపం చూస్తే - రంగ స్థలం మీద అపూర్వ తేజస్సుతో వెలిగి పోతూ, కమ్మగా పద్యాలు చదివే మహా నటుడు వారే నంటే ఎవరికీ నమ్మ బుద్ధి కాదు.

రాగాన్ని అర్ధ రహితంగా సాగదీసి, పద్యం పాడడమే నటన అని అటు నటులలోనూ, ఇటు ప్రేక్షకుల లోనూ ఉండే భావనకి అడ్డ కట్ట వేసిన ఘనత వారిదే. కాంట్రాక్టు నాటకాలు కాంబినేషన్ పద్ధతికి అలవాటు పడడంతో ఒకే నాటకంలో ముగ్గురు నలుగురు శ్రీకృష్ణులు వగైరా పాత్రధారులు కనిపించే వారు. అంతమంది కృష్ణులలో పీసపాటి వారే అపురూపంగా మెరిసి పోయే వారు. ఆయనకు పద్యమే గద్యం. గద్యమే పద్యం. ఆయన పాండితీ వైభవం అబ్బుర పరుస్తుంది. ఇంతటి ప్రఙ్ఞావంతుడి ఎడ్యు కేషనల్ క్వాలిఫి కేషన్ అయిదో తరగతి ఫెయిల్ కావడం !

1920 జులై 10 వ తేదీన బొబ్బిలి తాలూకా, జలిజి పేట మండలం వంతరాం అనే గ్రామంలో పీసపాటి వారి జననం. చిన్న తనంల లోనే తల్లి దండ్రుల వియోగంతో కాకినాడలో వారి పిన తండ్రి గారింట పెరిగారు. కొంత కాలం పౌరోహిత్యం చేసారు. 1939 లో సామర్ల కోటకు చెందిన వాణీ నాట్య మండలి లో చేరి వశాంబి కృష్ణ మూర్తి గారి వద్ద నటనను అభ్యసించారు. ఆ సంవత్సరమే పాపమ్మ గారితో వారి వివాహం జరిగింది. 1945 లో శ్రీకాకుళం జిల్లా పొందూరు కి నివాసం మార్చారు. అక్కడ శ్రీరామ నాట్య మండలిని స్థాపించారు. 1949 లో గుంటూరులో తిరుపతి కవులలో ఒకరైన చెళ్ళపిల్ల వేంకట శాస్త్రి గారి ఆస్థాన కవి పట్ట ప్రదానోత్సవంలో జరిగిన పాండవోద్యోగ విజయాలు నాటక ప్రదర్శనలో శ్రీకృష్ణ పాత్రను అద్వితీయంగా ప్రదర్శించి కవిగారి చేతుల మీదుగా బంగారు కిరీటిన్ని బహుమతిగా అందు కున్నారు.

వారికి జరిగిన సన్మానాలకు, వారు పొందిన బిరుదులకు లెక్క లేదు.

1993 లో ఆంధ్ర విశ్వ విద్యాలయం వారు కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారి ఫెలోషిప్, తెలుగు విశ్వ విద్యాలయం వారి విశిష్ఠ పురస్కారం, రాజా లక్ష్మీ ఫౌండేషన్ వారి సత్కారం, 1949 లో టంగుటూరి ప్రకాశంపంతులు గారి చేతుల మీదుగా సువర్ణ నటరాజ విగ్రహం స్వీకరణ. నరసరావు పేటలో సువర్ణ ఘంటా కంకణం, 1950 లో విజయ నగరంలో బంగారు కిరీటం, సుదర్శన చక్రం , 1958 లో గుంటూరులో సుదర్శన చక్రం, సాలూరులో బంగారు సింహతలాటాలు. 1958 లో తెనాలిలో సువర్ణ పుష్పాభిఫేకం. స్థానం వారి చేతుల మీదుగా గండ పెండేరం బహూకరణ, 1972లో బాపట్లలో గజారోహణ, నటశేఖర బిరుదు ప్రదానం 1975 లో విశాఖ పట్నంలో తెన్నేటి విశ్వ నాథం గారి చేతుల మీదుగా గండపెండేరం, నటసమ్రాట్ బిరుదు ప్రదానం, 1976 లో ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాట్య కళా అకాడమీ వారి నుండి నాటక కళా ప్రపూర్ణ బిరుదు స్వీకరణ, .... ఇలా లెక్కకు మించిన బిరుదులు. సత్కారాలు వారిని వరించాయి.

198లో రంగూన్ రౌడీ అనే సాంఘిక నాటకంలో కృష్ణ మూర్తి పాత్ర పోషణతో వీరి రంగస్థల విజయ విహారం మొదలయింది.
ఎన్నో నాటక సంస్థలతో మమేకమై నాటక కళా పురోభి వృద్ధికి వీరు చేసిన సేవ అసామాన్యమైనది.

1979 లో విశాఖ పట్నంలో అక్టోబరు 12, 13, 14 తేదీలలో సాంబ మూర్తి కళామందిరంలో వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖ జన సంద్రం ఉప్పొంగి పోయింది !

పద్య భావం పూర్తిగా అవగతం కానప్పుడు మాత్రమే నటుడు రాగాన్ని పట్టుకొని వేళ్ళాడతాడు ! అని కుండ బద్దలు కొట్టి నట్టుగా చెప్పిన పీసపాటి వారిని శ్రీ కృష్ణ పాత్రలో రంగస్థలం మీద చూడ లేక పోయిన వారిదే దురదృష్టమంతానూ !

ప్రేక్షక జన సందోహం నుండి నిరంతర ఘోషగా వెల్లువెత్తే ‘‘ వన్స్ మోర్ !’’ లతో నాటకంలోని కథ కించిత్తు కూడా ముందుకుజరగేది కాదనేది వీరి మీద వీరిని , వీరి పద్య పఠనాన్ని అమితంగా అభిమానించే వారు ముద్దుగా చేసే ఫిర్యాదు.

2007 సెస్టెంబరు 28 న ఈ మహా నటుడు శివైక్యం చెందారు. ఆంధ్ర నాటక రంగం ఆనాడు శోక సముద్రమే అయి రోదించింది. ఆంధ్ర జ్యోతి దిన పత్రిక సంపాదకీయమే ప్రచురించింది.

వన్స్ మోర్ ! పీసపాటి వారూ, మళ్ళీ మా కోసం పుట్టరూ ? ‘‘ నాయనా !’’ అని నన్ను ఆదరంగా పిలవరూ ?
‘‘ ఎప్పుడు వచ్చితీవు ’’ అంటూ చిలిపితనంతో, ముద్దుగా రాగయుక్తంగా పలకరించరూ ?

ముఖాన రంగేసుకొని పద్యాలు వినిపించరూ ? మీరు సరేనంటే వన్స్ మోర్ !! లు పలకడానికి వేలాది గొంతుకలు సిద్ధంగా ఉన్నాయి .

రంగ స్థల పద్య పఠనానికి రంగూ , రుచీ, వాసనా అద్దిన మీరు మళ్ళీ రావొచ్చు కదా ?

పోనీ,‘‘ మా బుగతేడీ ? ’’ అని బిత్తర పోయి అడిగే మీ రాముడు వలస రైతువారీ జనం కోసమయినా
రాకూడదూ ?


15, జూన్ 2010, మంగళవారం

శ్రీ. శ్రీ వర్ధంతి

నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నే నెగిరి పోతే
నిబిడాశ్చర్యంతో వీరు.

నెత్తురు కక్కు కుంటూ
నేలకు నే రాలి పోతే
నిర్దాక్షిణ్యంగా వీరె !



26, నవంబర్ 2009, గురువారం

పతంజలికి నివాళి

మిత్రుడు పతంజలి యిక లేరు అనే దుర్మార్గపు వార్తని ప్రసార మాధ్యమాల వలన తెలుసుకుని, నిర్ఘాంత పోయేను. ఒక శూన్యం ఆవరించింది. పతంజలితో నా పరిచయం గురించి , కన్నీళ్ళతో ...

పతంజలి - ప్యారిస్ కార్నర్ - నేను !!
కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి ఇక లేరు. రాయాల్సిందేదో రాసేసి, చెప్పాల్సిందేదో చెప్పేసి, నిరాడంబరంగా,నిశ్శబ్దంగా, ఒకింత నిర్లక్ష్యంగా, వెళ్ళి పోయేరు. రచయితగా రావలసినంత పేరు తన ఖాతాలో జమ అయిందో లేదో చూసుకునే ఓపికా, ఆసక్తీ కూడా లేని పతంజలి ‘ అవుతే నాకేటి’ అని నవ్వేసి, వెళ్ళి పోయేరు. ప్రపంచ సాహిత్య ప్రమాణాలతో సరితూగే గొప్ప రచనలను చేసి, వెళ్ళి పోయేరు. కన్యాశుల్కం తర్వాత, అంత వాటంగా హాస్య బీభత్స రసాలను ప్రదర్శించ గలిగిన తెలుగు రచయితలు లేరనే చెప్పాలి.
సన్నగా , రివటలా పొడుగ్గా, కొనదేరిన రాచ ముక్కుతో , సూటిగా, దయగా చూసే చూపులతో, అవతలి వాడి వివేకాన్నీ, వెకిలి తనాన్నీ కూడా సరిగానే అంచనా వెయ్య గలిగిన ధీమాతో కూడిన చిరునవ్వు - యిదీ స్థూలంగా పతంజలి రూపం ! తెలిసిన వాళ్ళకి, అత్యంత వైవిధ్య భరితమూ, అద్భుతమైన హాస్య వ్యంగ్య శైలీ, విభిన్న మానవ మనస్తత్వాలను ఆవిష్కరించే కథనాలతో - ఇంత సాహిత్యాన్ని యీ బక్క మనిషి ఒక్కడూ అందించేడా ! అని, ఆశ్చర్యం కలుగుతుంది.
తెలుగు చిన్న కథ తొలి ఊపిరులు పోసుకున్న విజయ నగరానికి అతి చేరువలో అలమండ గ్రామంలో పుట్టిన పతంజలి డిగ్రీ చదువు విజయ నగరంలోనే సాగింది. పాత్రికేయునిగా విశాఖ పట్నం, విజయ వాడ, తిరుపతి, హైదరాబాద్ లలో శాఖా చంక్రమణం చేసారు. బతుకు బాటలో ఎన్నో ఉత్థాన పతనాల్ని చవి చూసేరు. ఒక అపూర్వమైన స్వీయ వ్యక్తిత్వంతో నిబ్బరాన్ని కోల్పో లేదు. బెదిరి పోలేదు. ఈనాడు, ఉదయం, ఆంధ్ర భూమి, సాక్షిలలో సంపాదకునిగా బాధ్యతలు ... మధ్యలో అవి వదులుకున్న సంధి కాలంలో సొంత పత్రిక పేరుతో చేతులు కాల్చకోవడం ... పచ్చళ్ళు, ఆయుర్వేద మందులు అమ్ముకోవడం, వైద్యం ... ఏవీ ఆయన ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయ లేదు. ఆ యోగ పతంజలి యిక లేరు అనే నిజాన్ని జీర్ణించుకో లేక, యీ కొద్ది పాటి మాటలూ ...
మొలకెత్తిన మైత్రీ బంధం

పతంజలితో నా తొలి పరిచయం చిత్రంగా జరిగిందనే చెప్పాలి. ఆ రోజులూ, అప్పటి ఉద్వేగాలూ, దుందుడుకుతనాలూ వేరు. పతంజలి, ఆయన తమ్ముడు కలిసి, విజయ నగరంలో ఓ గదిలో ఉండి, మహా రాజా వారి కళాశాలలో చదివే వారు. పతంజలి డిగ్రీ మొదటి సంవత్సరం. అదే రోజుల్లో, అంటే, డెబ్భయ్యవ దశకం తొలి రోజులలో, నేను అక్కడే, మహా రాజా ప్రాచ్య కశాశాలలో భాషా ప్రవీణ చదివే వాడిని. కథా రచయితలుగానే తప్ప , పతంజలితో నాకు అప్పటికి ముఖ పరిచయం లేదు. పతంజలి మహా దూకుడుగా ఉండే వాడు. మా వూరి వాడే, ఓ అబ్బాయి, నా గురించి పతంజలితో చెడ్డగా చెప్పాడు. నాకు రచయితనని పొగరనీ, ఎవరితోనూ మాట్లాడననీ... యిలా ఏవో చెప్పాడు. దాంతో పతంజలి ‘‘ అలాగా ! ఆ పొగరేదో అణిచేస్తాను ... నా దెబ్బ రుచి చూపిస్తాను ...’’ లాంటి శపథాలేవో చేసాడుట. తీరా, సాయంత్రం అలాంటి ఉద్దేశంతో నన్ను ప్యారిస్ కార్నర్ దగ్గర కలిసేడు. కలిసేక సీను మారి పోయింది ! విజయనగరం కోట దగ్గర, బొంకుల దిబ్బ సమీపంలో,రోజూ సాయంత్రాల వేళ. ఊళ్ళోని రచయితలూ, కవులూ గుంపులుగా చేరి, కాళ్ళు పీకేలా , నిలబడి - సాహిత్య చర్చల్లాంటివి చేసే స్థలానికే ముద్దు పేరు ‘ ప్యారిస్ కార్నర్’ ! అక్కడ తొలి సారిగా కలిసేం - నేనూ, పతంజలీ. కాస్సేపు నన్ను దెబ్బ తీసే కార్యక్రమాన్ని వాయిదా వేసి, నా అభిరుచులూ, అభిమాన రచయితలూ, రచనలూ గట్రా యింటర్వ్యూ చేస్తున్నట్టుగా ఏవేవో అడిగేడు. నేను భయ పడుతూనే .వాబులు చెప్పేను. ఎంతయినా అతను రాజా కాలేజీ స్టూడెంటూ, నేను ప్రాచ్య కళాశాల విద్యార్ధినీ కదా !

అంతే ! పతంజలి నన్ను వాటేసుకుని, ‘ మిమ్మల్ని దెబ్బతీయాలనే వచ్చేను. కానీ యిక నుండీ మనం నేస్తాలం ... ఏం . ’’ అనడిగేడు. మొన్న ఆగష్టు నెలలో కలిసినప్పుడు ఆ ముచ్చట్లు చెప్పుకుని యిద్దరమూ ఎంత నవ్వుకున్నామో !
అలమండ రాజు గారి అబ్బాయి ఆ వయసులోనే అందించిన స్నేహానుభవం - నిత్య హరితమై ఏళ్ళు గడుస్తున్నా, మధురంగా మనసులో మెదులుతూనే ఉంది.

మా రహస్య అజెండా

మా స్నేహం, కలిసేక విజయనగరంలో ఉన్నన్ని రోజుల్లోనూ వొకరిని విడిచి వొకరం ఉండ లేదు. అప్పుడప్పుడు మాతో కవి సీర పాణీ, రచయిత దాట్ల నారాయణ మూర్తి రాజూ వొచ్చి కలిసే వారు.
రోజూ నియమం తప్పకుండా మహా రచయిత చాసో గారిని కలవడానికి పోయే వాళ్ళం.చిన్ని పల్లి వారి వీధిలో చాగంటి వారి హవేలీ లోనో, కస్పా బజారులోనో కలిసే వాళ్ళం.ఆయన వెంట మహా శ్రద్ధా భక్తులతో వ్యాస నారాయణ మెట్ట వరకూ వెళ్ళే వాళ్ళం. ఆ కథా శిల్పి ఎన్ని గొప్ప విషయాలు చెప్పే వారో ! నోట్లో చుట్ట ఎర్రగా కాలుస్తూ, చురుకయిన చూపులతో , మా వేపే చూస్తూ సాహితీ ప్రసంగం చేస్తున్నట్టుగా ఉండేది వారి ధోరణి. మా కథలు ఆయనకిచ్చి అభిప్రాయం అడిగే వాళ్ళం. అంత పెద్దాయనా, ఏ మాత్రం విసుక్కోకుండా, మా కథల్లో మంచి చెడ్డలు విపులంగా చర్చించే వారు. మంచేఁవిటి ! నా ముఖం ! ... మా కథల్లో లోపాలు ఎత్తి చూపిస్తూ ఎండ గట్టే వారు. ఉడుక్కునే వాళ్ళం.

‘‘ ఈ ముసిలాయనతో మనం పడలేం బ్రదరూ ! ... అంచేత మన కథలింక ఈయనకి చూపించొద్దు ...ఎప్పటికయినా చాసో రాసిందానికన్నా గొప్ప కథ రాసి చూపిస్తాను ... ’’ అనే వాడు. అంత లోనే , గొంతు తగ్గించి, ‘‘ అబ్బే, అది వీలయ్యే పని కాదు . ఆ స్థాయిని మనం జీవిత కాలంలో అందుకో లేం . .. పోనీ ...ఆయన తన చుట్ట నోటొతో ఒక్క సారయినా , ‘ బాగుందయ్యా ! ’ అనే అనే కథ రాయాలి ... అందాక ... రోజుకో కథయినా చదవమని మన చుట్టల తాత గారిని కందిరీగల్లా కుడదాం ... ఏం . ’’ అని మా మధ్య ఓ రహస్య ఒప్పందం ఖరారు చేసాడు.

ఆ తర్వాత, నా సంగతి అటుంచండి కానీ ... మా పతంజలి మాత్రం చా.సోనీ, అలాంటి ప్రసిద్ధ రచయితలనీ మెప్పించే రచనలు అనేకం చేసాడు. చా.సో గురించీ , అతని కథల గొప్పదనం గురించీ ఎంత విశ్లేషిస్తూ చెప్పే వాడో ! ఆ కథా శిల్పి చెక్కిన అపురూప కథకుడు - ఆ మధ్య చా.సో స్ఫూర్తి అవార్డుని సొంతం చేసుకున్నాడు ... అదీ పతంజలి !

పూర్వీకుని పరిచయం
పతంజలితో సాగిన నా స్నేహ ప్రస్థానంలో మరో అబ్బుర పరిచే ముచ్చట. ఆయన విశాఖలో ఈనాడులో పని చేసే రోజులలో తరుచుగా కలిసే వాడిని. ‘ రాజుగోరు’ రాసిందప్పుడే.

విజయ వాడలో ఉండేటప్పుడు ఓ సారి ఆఫీసులో కలిసాను. ఎప్పటిలాగే ఆత్మీయంగా పలకరించేడు. ఎన్నో కబుర్లు కలబోసుకున్నాం. ఆ రోజు నాకు ఆయన యింట్లోనే ఆతిధ్యం. ‘‘ మా యింటికి రండి... మా పూర్వీకుడ్ని ఒకరిని పరిచయం చేస్తాను ...’’ అని తీసికెళ్ళాడు.

ఏ శతాధిక ముది వగ్గో అనుకున్నాను. చిత్రం ! అయన చూపించింది ఓ కోతిని. బజార్లో కోతులాడించే మనిషి దగ్గర కొని పెంచుతున్నాడుట ! ఆ చమత్కారం అతనికే చెల్లింది ! చేపల్ని పెంచిన పతంజలీ, పిట్టల్ని పెంచిన పతంజలీ చాలా మందికి తెలిసుండ వచ్చు. కోతుల్ని పెంచిన పతంజలి తెలీక పోవచ్చు. కదూ?
అమ్మ దొంగా !

ఆ తర్వాత ఫోన్లూ, అప్పటప్పట ఉత్తరాలూ తప్ప మేం కలుసుకున్న సందర్భాలు తక్కువే. కథా, నవలా సాహిత్యంలో మా పతంజలి విరాడ్రూపాన్ని చూసి, మురిసి పోతూనూ ఉన్నాను.

మళ్ళీ ఎప్పుడు చెప్మా కలుసుకున్నాం ? ఆఁ! ... ఓ సారి విశాఖ పట్నంలో కలిసేం. నేను మా సాలూరు ( నేను ఉద్యోగ రీత్యా ఉండే వూరు) వెళ్ళడానికని బయలు దేరాను. దార్లో ఓ పుస్తకాల షాపులో దూరేను. పుస్తకాలు చూస్తున్నాను.

వెనక నుండి బలమైన ఓ రెండు చేతులు నన్ను బలంగా వాటేసుకుని , ఉక్కిరి బిక్కి రి చేసాయి.
చూద్దును కదా ... మా పతంజలి !
‘‘ రాత్రికి ఉండి పోండి ... మన చిన్నప్పటి కబుర్లతో రాత్రిని కరిగిద్దాం ... ఏం ? ...’’ అనడిగేడు. అక్కడే, అమ్మకానికి ఉంచిన పుస్తకాలలోనుండి తనపుస్తకాన్ని ఒక దానిని తీసి, దాని మీద ‘ నాకెంతో ప్రియమైన మా పంతుల జోగారావు గారికి’ అని రాసి నాకిచ్చేడు.తీయని గుర్తుగా అది నా దగ్గరింకా పదిలమే. ‘పతంజలి భాష్యం’ దాని పేరు.
ఆ రాత్రి ఎన్ని విశ్వ సాహివత్య వీధుల్లో పచార్లు చేయించేడో! ఆ విషయ సంపదకీ, సాధికారతకీ చకితుడినయి పోయేను.
దగ్గర్లోనే ఉండి ఒక్క సారి కూడా కలవ లేదని నిష్ఠరమాడేడు. ‘ ఇప్పుడయినా, దొంగ ని పట్టుకున్నాను కనుక సరి పోయింది! సరే ... ఇక్కడ ఓ పత్రిక పెట్టాను ... తెలుసా ? ...’’ అనడిగేడు.
‘‘ తెలీదు.’’ అన్నాను నిజాయితీగా.
‘‘సరే లెండి! ... దాని గురించి నాకే తెలీదు ! ’’ అని నవ్వేసాడు. ఆ హాస్య ప్రియత్వమే అతని పుస్తకాలనిండా వెన్నెలలా పరుచుకుని ఉంది మరి !

ఆ సౌజన్యం అపురూపం

పతంజలిని కలిసింది నా ‘ అపురూపం’ కథల సంపుటి ఆవిష్కరణ సభలోనే. నాకుగా నేను కోరక పోయినా , నా ప్రచురణ కర్త మాట మేరకు, నామీద గల అభిమానంతో నా పుస్తకానికి ముందు మాట రాయడమే కాక, ఆ రోజు సభకి వచ్చి పలకరించి వెళ్ళాడు నా గురించి అతను రాసిన నాలుగు ముక్కలూ ఎప్పటికీ నాకు నా కథలకంటే కూడా ప్రీతి పాత్రం.

అవీ, యివీ ... మరి కొన్ని ...


దు:ఖోద్వేగంలో గుర్తుకు రావడం లేదు... గుర్తున్నంత వరకూ మరి కొన్ని ...
చదువుకునే రోజులలో అలమండ నుండి వచ్చే కేరియర్లలోంచి వంటకాలను బలవంతంగా రుచి చూపించడం ... ‘దిక్కుమాలిన కాలేజీ’ కథ రాసి, తను చదువుకునే కాలేజీ రాజకీయాలను ఎండ గట్టి కూడా ... ధైర్యంగా బోర విరుచుకుని నడవడం, నవ్వడం ...చతురలో నవలకి వెయ్యి రూసాయలొస్తున్నాయని ఎడాపెడా అప్పులు చేస్తున్నానని చెప్పడమూ ...


కడసారి కలిసింది


మొన్న ఆగష్టు పన్నెండవ తేదీన చివరి సారిగా పతంజలిని కలిసేను.
అతని ఆరోగ్యం గురించి నేనూ అడగ లేదు... పతంజలీ చెప్ప లేదు ... కబుర్లు కలబోసుకున్నాం. విజయ నగరం కబుర్లు ...
పతంజలికి అలమండ అన్నా, విజయ నగరం అన్నా అవధుల్లేని అభిమానం ! అక్కడి మిత్రులు ఎవరు పలకరించినా పులుకరించి పోతాడు.
అప్పుడెప్పుడో వో సారి కలిసినప్పుడు విజయ నగరం గురించి చెబుతూ అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి ...

‘‘ ఆ ఊరి కోట, కందకం,కస్పా బజారు, బొంకుల దిబ్బ,మూడు మూడు లాంతర్లు, మూడు కోవెళ్ళు, మచ్చ కొండ, గంట స్థంబం, పెద్ద చెరువు ... చివరికి పెద్ద చెరువులో దోమలు కూడా నాకు మంచి నేస్తాలే ! ... ఎందుకంటే ...రాత్రి పూట నన్ను తెగ కుట్టి మేలుకుని ఉండేలా చేసి, కథలూ గట్రా రాసుకునేలా ప్రోత్సహించినవి , పాపం, అవే కదా ! ...’’
మరింక రాయ లేను ...



అయ్యో, ఇప్పుడా ...


రక్తం ఉత్సాహంతో ఉరకలేసే వయసులో నన్ను దెబ్బ తీయాలని వచ్చి స్నేహ లతలా అల్లుకు పోయేడు - మా పతంజలి ! ... ప్రసార మాధ్యమాలలో పతంజలి ఇక లేరని విని , చూసి , అవాక్కయాను.

అయ్యో మిత్రమా ! ఇప్పుడీ వయసులో ఎంత కోలుకో లేని దెబ్బ తీసావయ్యా ....


౦ ౦ ౦


పతంజలి( ౧౯౫౨ మార్చి ౨౯ - ౧౧ మార్చి ౨౦౦౯) కి నివాళిగా నవ్య వీక్లీలో తే ౨౫-౩-౨౦౦౯ దీ సంచికలు ప్రచురణ.



పతంజలి రచనలు


ఖాకీ వనం

పెంపుడు జంతువులు
రాజు గోరు

వీర బొబ్బిలి

గోపాత్రుడు

పిలక తిరుగుడు పువ్వు

అప్పన్న సర్దార్

ఒక దెయ్యం ఆత్మ కథ

నువ్వే కాదు

వేట కథలు


ఈ నవలికలను కె.యన్.వై. పతంజలి రచనలు పేరిట పతంజలి మిత్ర మండలి ( హైదరా బాద్ ) వారు ప్రచురించారు.


ఇవి కాక - రాజులు లోగిళ్ళు, చూపున్న పాట, పతంజలి భాష్యం, దిక్కు మాలిన కాలేజీ కథల సంపుటి ...

డా. కె.వి.నరసింహా రావు వీరి ఖాకీ వనం నవలని హిందీ లోకి అనువదించేరు.


రాజకీయ,పోలీస్, న్యాయ, పత్రికా వ్యవస్థల మీద కొరడా ఝళిపిస్తూ శక్తి వంతంగా తెలుగులో రాసిన ఒకే ఒక్క రచయిత పతంజలి గారు.