బాగుందా ? లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
బాగుందా ? లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, అక్టోబర్ 2015, శనివారం

మనం మేకలం కాదు కదా ?



ఈ శ్లోకం చూడండి:

ఏకస్య కర్మ సంవీక్ష్య, కరోత్యన్యో2పి గర్హితమ్
గతాను గతికో లోక: నలోక: పారమార్ధిక:

ఎవడయినా ఒక పని చేస్తే, వాణ్ణి చూసి, అది గర్హించ తగినిదే అయినా, మరొకడున్నూ అదే పని చేస్తాడు !

లోకం గతానుగతికమైనది. అంతే తప్ప పరమార్ధం ఏమిటా అని, ఆలోచించేది కాదు. ఇదీ శ్లోకార్ధం.

మనలో చాలా మంది ( నాకేమీ మినహాయింపు నిచ్చు కోవడం లేదు) చాలా తరుచుగా తలకాయని ఇంట్లో ఏ చిలక్కొయ్యకో తగిలించి కానీ బయటకి రాం కదా.

అసలు దానితో పని పడుతుందని కూడా ఎంచేతో అనుకోం కూడా. మరీ విరివిగా వాడేస్తే పదును తగ్గి పోతుందని మనకి లోలోపల భయం కాబోలు !

ఒకడు చేసే దానిలో ఔచిత్యం ఉందో లేదో ఆలోచించే తీరికా మనకి ఉండదు. భేషుగ్గా వాడు నడచిన దారిలోనే నడిస్తే ఓ పనై పోతుందని నమ్ముతాం. కొత్తదీ, సమస్యాత్మక మయినదీ, క్లిష్ట మయినదీ, శ్రమతో కూడు కున్నదీ అయిన త్రోవన వెళ్ళడానికి సుతరామూ మనం చాలా వరకు ఇష్ట పడం.
చక్కని రాజ మార్గ ముండగా ... అనుకుంటూ ఆ త్రోవనే గుడ్డిగా పోవడానికే యిష్ట పడతాం.

అనుసరణ తప్పేమీ కాదు. మేలు బంతి లాంటి ఒరవడిని అనుసరిస్తూ పోవడం అభిలషణీయమే.
పెద్దలు చూపిప బాటలో పయనించడం సముచితమే. కాని, అంధానుకరణ, అంధానుసరణ తప్పేమొ కాస్త ఆలోచించాలి.

ఒక మేక పోయి గోతిలో పడితే మిగతా మేకలు కూడా దానినే అనుసరిస్తూ పోయి అదే గోతిలో పడతాయంటారు.

మనం మేకలం కాదు కదా ?

లోకం గతాను గతికం అనడానికి ఎన్నో ఉదాహరణలు చూపించ వచ్చును.

నా వరకు, ఒక ప్రాక్టికల్ జోక్ చెబుతాను.

ఒక పుణ్య క్షేత్రానికి మేము వెళ్ళి నప్పుడు, అక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి. చిన్నవీ, పెద్దవీనూ.

నాకెందుకో చప్పున మీది శ్లోకం గుర్తుకు వచ్చింది. సరే, ప్రాక్టికల్ గా ఆ శ్లోకం లో ఎంత వాస్తవం ఉందో చూదామన్న చిలిపి ఊహ వచ్చింది, (అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటాయి లెండి.)

వెంటనే కిందకి వంగి, ఒక చిన్న పాటి రాయిని ఎంచి, మరీ తీసి, కళ్ళకి అచ్చం మూడు సార్లు అద్దు కున్నాను. తర్వాత, దాన్ని మూడు పర్యాయాలు ముద్దు కూడా పెట్టు కున్నాను. ఆ పిమ్మట దానిని భద్రంగా, భక్తిగా, నా చేతి సంచీలో ఉంచి, ముందుకు సాగేను.

కొంత దూరం వెళ్ళి, వెనక్కి తిరిగి చూసేను.

అంత వరకూ ఆ దారమ్మట మామూలుగా నడుస్తున్న వాళ్ళలో చాలా మంది నాలాగే కిందకి వంగడం, ఓ రాయిని తీయడం, దానిని మూడు సార్లు కళ్ళకి అద్దు కోవడం, మూడు సార్లు ముద్దు
పెట్టు కోవడం, తర్వాత, దానిని వారి జేబులోనో, బేగ్ లోనో, భద్రంగా ఉంచి ముందుకి కదలడం !

(అచ్చం, నేను చేసినట్టుగానే !) ... ఇదీ వరస !

అక్కడ ఆ రోజున నేను తప్ప నా ముందు నడిచిన వారెవరూ అలా చేయ లేదు.

నా తరవాత వచ్చిన వారిలో చాలా మంది మాత్రం నాలాగే చేసారు !

ఇప్పుడు చెప్పండి, గతాను గతికో లోక: కదూ ?




స్వస్తి.

8, అక్టోబర్ 2015, గురువారం

మధ్యలో నన్నెందుకు లాగుతావూ ?! హన్నా !





నీ ముఖ పుస్తకం తగలెయ్యా, మధ్యలో నన్నెందుకు లాగుతావూ ?! హన్నా !


ఒక శ్లోకం చూడండి:


అసంభావ్యం న వక్తవ్యం, ప్రత్యక్ష మపి దృశ్యతే

శాలి తరతి పానీయం, గీతం గాయతి వానర:


నువ్వు ప్రత్యక్షంగా చూసినదే అయినా, అది అసంభవమైన విషయం అయితే మట్టుకు దాని రించి ఎప్పుడూ ఎవరితోనూ చెప్ప వద్దు సుమీ !


ఎందుకంటే, ‘ నీటి మీద రాయి తేలింది. కోతి పాటలు పాడింది’ అని చెబుతే ఎవరయినా నవ్వుతారే కాని నీ మాటలు నమ్మరు సుమా ! అని, ఈ శ్లోక భావం.


అసత్యం వ్యాప్తి చెందేంత త్వరగా సత్యం వ్యాప్తి చెందదు మరి. అసత్యానికి వెయ్యి కాళ్ళు, వినడానికి లక్ష చెవులు. తిరిగి వ్యాపింప చేయడానికి కోటి నోళ్ళు ఉంటాయి.


పాపం సత్యానికి అంత సీను లేదు. అలాగని సత్యం పలక వద్దని కాదు సుమా.


సత్యం వద. సత్యమే పలకాలి. ధర్మం చర . ధర్మాన్ని ఆచరించాలి.


వానర ఉవాచ :


బావుందిరా నాయనా, బావుంది. ఏవో శ్లోకాలూ గట్రా పెట్టుకుని పిచ్చి రాతలేవో రాసుకుంటూ ఉంటే సరే లెమ్మని ఊరు కున్నాను.


ఏం చేస్తాంలే, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం.


కొందరికి సెల్ఫీల పిచ్చి


కొందరికి సింగపూర్ పిచ్చి


కొందరికి ర్యాంకుల పిచ్చి


కొందరికి బ్యాంకుల పిచ్చి


కొందరికి కవితల పిచ్చి


కొందరికి కోకల పిచ్చి


కొందరికి బైకుల పిచ్చి


కొందరికి లైకుల పిచ్చి


కొందరికి తాగుడు పిచ్చి


కొందరికి వాగుడు పిచ్చి


అందు చేత నీ రాతలేవో నువ్వు రాసుకుంటూ, నీ ఏడుపేదో నువ్వుడువ్


కానీ,


మధ్యలో నన్నెందుకు లాగుతావూ !?


హన్నా !

20, సెప్టెంబర్ 2015, ఆదివారం

పొగడ దండలు ! లేదా భజంత్రీలు ! లేదూ, గోకుళ్ళ వ్యవహారం



 పొగడ్తలలో రకాల గురించి చెప్పు కుందాం.

తప్పని పరి పొగడ్తలుమొహ మాటపు పొగడ్తలుబలవంతపు పొగడ్తలుబరి తెగించిన పొగడ్తలు,ముక్తసరి పొగడ్తలు యిలా చాలా రకాలు ఉన్నాయి లెండి. ఇవి పొగిడే వాడి లెవెలుని బట్టీ,పొగిడించు కునే వాడి అర్హతానర్హతలను బట్టీ కూడా మారుతూ ఉంటాయి.

ఇవన్నీ అంతర భేదాలు. పొగడ్తలన్నీ కేవలం పొగడ్తలే కాక పోవచ్చు. అవి తెగడ్తలు కూడా కావచ్చును.

మందీ మార్బలాన్ని వెంట బెట్టుకుని ఓ పత్రిక ఆఫీసులో చెల్లికి ( మళ్ళీ) పెళ్ళి అనిసొంత కవిత్వం వినిపించిన తణికెళ్ళ భరణి గుర్తున్నాడా ? అతను కవిత శీర్షిక చెప్తాడోలేదోచుట్టూ ఉన్న వాళ్ళు వహ్వావహ్వా అంటూ భజంత్రీలు వాయించేస్తారు. భరణి గారు ష్ ! నేనింకా కవిత్వం షురూ చెయ్ నే లేంటూ విసుక్కుంటారు కూడానూ.
ముత్యాల ముగ్గులో రావు గోపాల రావు ప్రక్కన సొంత డబ్బాకి భంజంత్రీలు వాయించే మేళం మీకు గుర్తుండే ఉంటుంది.

ఎవడు కాయిన్ చేసాడోకానీసొంత డబ్బా అనే మాట చాలా విలువైనది.
డబ్బా మనదైనప్పుడు ఎంత సేపయినాఎలాగయినా వాయించు కో వచ్చును కదా.
సొంత డబ్బా సంగతి ఇలా ఉంటేఒకరి జబ్బ ఒకరు చరుచు కోవడం కూడా ఉంటుంది. నువ్వు నా జబ్బ చరిస్తేనీ జబ్బ నేను చరుస్తాను. అదీ మన మధ్య ఒప్పందం.
నువ్వు నా వీపు గోకితేనేను నీ వీపు గోకుతాను. ( నా టపాకి నువ్వు కామెంట్లు పెడితేనే నీ టపాకి నేను కామెంట్లు పెడతాను )

ఈ సూత్రం అనుసరించి భజంత్రీలు మ్రోగుతూ ఉంటాయి. డబ్బాలు వాగుతూ ఉంటాయి. వీపులు గోక బడుతూ ఉంటాయి.

సరేఈ విషయం కాస్త ప్రక్కన పెట్టిపొగడ్తల రకాలు చూదాం.

మన వాళ్ళు వ్యాజ స్తుతివ్యాజ నింద అని రెండు రకాలు చెబుతూ ఉంటారు.

బయటకి పొగుడు తున్నట్టే ఉంటుంది. లోపలి అర్ధం తిట్టడమే.

బయటకి తిడుతున్నట్టుగా ఉంటుంది. కాని నిజానికి అది పొగడడమే.

వ్యాజ స్తుతి అంటేస్తుతి రూపమైన నింద. పొగుడుతున్నట్టే తిట్టడం.

వ్యాజ నింద అంటేనిందా రూపమైన స్తుతి. తిడుతున్నట్టే పొగడడం.

ముందుగా వ్యాజస్తుతికి ఉదాహరణలు చూదాం:
పెద్దా పురం ప్రభువు తిమ్మ రాజు వొట్టి లోభి. ఎంగిలి చేత్తో కాకికిని తోలడు. దాన దరిద్రుడు. ఒక కవి అతని మీద చెప్పిన పద్యం చూడండి:

అద్దిర శ్రీ భూ నీళలు
ముద్దియలా హరికి గలరు ముగురందరిలో
పెద్దమ్మ నాట్య మాడును
దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని యింటన్.

శ్రీహరికి ముద్దు సతులు మువ్వురు. శ్రీభూనీళలు. వారిలో పెద్దమ్మ తిమ్మరాజు ఇంట నాట్యమాడుతూ ఉంటుందిట. పెద్దమ్మ అంటే దరిద్ర దేవత అని ఇక్కడ కవి భావం.
తెనాలి రామ కృష్ణ కవి పేర వినిపించే ఈ చాటువు చూడండి:

అన్నాతి గూడ హరుడగు
నన్నాతిని గూడ కున్న నసుర గురుండౌ
నన్నా తిరుమల రాయుడు
కన్నొక్కటి లేదు కాని కంతుడు గాడే.

కవి ప్రభువును సాక్షాత్తు శివుని తోనుశుక్రాచార్యునితోనుమన్మధుని తోను సరి పోలుస్తున్నాడు.

అయితేఈ పొగడ్తలు కండిషనల్డ్ పొగడ్తలు. ఎలాగంటే,
రాజు గారు తమ రాణీ గారితో కూడి ఉన్నప్పుడు సాక్షాత్తు శివుడే. ఎందు కంటే, పాపంరాజు గారు ఏకాక్షి. ఒంటి కన్ను వాడు. రాణి గారి తో కూడి ఉన్నప్పుడు మొత్తం ఇద్దరివీ కలిపి మూడు కన్నులవుతాయి కనుకప్రభువులవారు ముక్కంటితో సమానం.
రాణి తో కలసి ఉండ నప్పుడు ప్రభువు సాక్షాత్తు అసుర గురుడయిన శుక్రాచార్యడితో సమానం.

శుక్రాచార్యుని వలె రాజు గారికి కూడా ఒకే కన్ను కనుక ఈ పోలిక అన్వర్ధం అంటాడు కవి.

అంతే కాదుఒక కన్ను లేదు కానీప్రభువు సాక్షాత్తు మదనుడేనట.

నగపతి పగతు పగతుని
పగతుండగు మగధ రాజుఁబరి మార్చిన యా
జగ జట్టి యన్న తండ్రికి
దగు వాహన మైన యట్టి ధన్యుండితడే.

ఈ పద్యంలో బాదరాయణ సంబంధం చిక్కు విడ దీస్తే వచ్చే అర్ధం - దున్న పోతు
అని !

నగపతి - ఇంద్రుడు
అతని పగతుడు (శత్రువు) - నరకుడు
అతని పగతుడు - శ్రీ కృష్ణుడు
అతని పగతుడు - జరాసంధుడు ( మగధ రాజు)
అతని పగతుడు - భీముడు
అతని అన్న - ధర్మ రాజు
అతని తండ్రి - యముడు
అతని వాహనం - దున్న పోతు !
ఈ పద్యంలో కవి సభలోని వారిని కసి తీరా ఎలా పొగడ్త రూపంలో తిడుతున్నాడో చూడండి:

కొందరు భైరవాశ్వములుకొందరు పార్ధుని తేరి టెక్కెముల్
కొందరు ప్రాక్కిటీశ్వరులుకొందరు కాలుని యెక్కిరింతలున్
కొందరు కృష్ణ జన్మమున కూసిన వారలు నీ సదస్సులో
నందరు నందరే మఱియునందరు నందరు నందరందరే.

సభలోని వారందరినీ కుక్కలుకోతులు,పందులుదున్న పోతులుగాడిదలు అని కవి వెక్కిరిస్తున్నాడు.

ఈ పద్యం చూడండి:

ఎఱుగుదువు సకల విద్యలు
నెఱుఁగని విఁవ రెండు కలవ వేవే వన్నన్
పిఱికి తనంబును లోభము
గుఱుతెఱుఁగవు జగతి నెన్న గువ్వల చెన్నా

కవి గారు రాజుని పొగుడుతూఇలా అన్నాడు: ఈ ప్రభువుకి అన్నీ తెలుసు. సకల విద్యలూ వచ్చును. మహా వివేకి. కాని రెండే తెలియవు . అవి ఏమంటేపిఱికి తనం అంటే తెలియదు. లోభత్వం అంటే తెలియదు. పొగడ్త అంటే శీతాకాలంలో గోరు వెచ్చని నీటి స్నానం లాగ ఇలా ఉండాలి!

చివరిగా ఓ పద్యం. ( బూతు అని వార్యం)

జూపల్లి ధర్మా రాయుడు అనే రాజు మహా పిసినారి. అర్ధులకు మొండి చెయ్యి చూపిస్తూ ఉంటాడు. ఈరప రాజు అనే బట్టు కవి అతనిని యాచించ డానికి అతని సభకి వెళ్ళి వచ్చేడు. ఆ కవికి సూరప రాజు అనే కవి మిత్రుడు ఒకడు ఉన్నాడు. రాజ దర్శనానికి వెళ్ళి వచ్చిన తన మిత్రుడైన ఈరప రాజుని చూడగానే ఆత్రతతో ప్రభువులు ఏమిచ్చారుఏమిచ్చారు అని అడిగేడు.

సూరప రాజు:

‘‘ జూపల్లె ధరాయం
డేపాటి ధనం బొసంగె నీరప రాజా ?’’
దానికి ఈరప రాజు ఇచ్చిన సమాధానం ఇదీ !
‘‘పాపాత్ముండెవ్వరికిని
చూపనిదే చూపెనయ్యసూరప రాజా !’’

ఆ పాపాత్ముడు ఎవరికీ చూపించనిది కవిగారికి చూపించేడుట.


ఇప్పుడు నిందా రూప స్తుతి చూదాం

బయటకి నిందిస్తున్నట్టే ఉంటుంది. అంతరార్ధం మట్టుకు పొగడడమే. దీనికి కాసుల పురుషోత్తమ కవి రచించిన ఆంధ్రనాయక శతకం గొప్ప ఉదాహరణ. మచ్చునకు ఒక్క పద్యం చూదాం:

ఆలు నిర్వాహకురాలు భూదేవియై
యఖిల భారకు డన్న నాఖ్యఁదెచ్చె
నిష్ట సంపన్నురాలిందిర భార్య యై
కామితార్ధదుఁడన్న ఘనత తెచ్చె
కమల గర్భుఁడు సృష్టి కర్త తనూజుఁడై
బహు కుటుంబికుఁడన్న బలిమి తెచ్చె
కలుష విధ్వంసిని గంగ కుమార్తెయై
పతిత పావనుఁడన్న ప్రతిభ తెచ్చె
అండ్రు బిడ్డలుఁ దెచ్చు ప్రఖ్యాతి కాని
మొదటి నుండియు నీవు దామోదరుఁడవె !
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్య భావ 1
హత విమత జీవ ! శ్రీకాకుళాంధ్ర దేవ !!

శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువుకి అఖిల భారకుడు, కామితార్ధదుడుబహు కుటుంబీకుడుపతిత పావనుడు అనే బిరుద నామాలు ఉన్నాయి. వాటికి వరుసగా సమస్త లోకాల భారాన్ని వహించే వాడుకోరిన కోరికలను తీర్చే వాడుపెద్ద కుటుంబం కల వాడుఅన్ని పాపాలు పోగొట్టే వాడు అని అర్ధాలు. అయితేవిష్ణు దేవునికి ఈ బిరుద నామాలు అన్నీ అతని ఇరువురి భార్యలుకుమారుడుకుమార్తెల వలన వచ్చినవే కాని అతని గొప్ప ఏమీ లేదనిఅతను తొలి నుంచి దరిద్ర దామోదరుడనీ కవి ఇందులో హేళన చేస్తున్నాడు.

నిజానికి ఇదినిందా రూపమైన స్తుతి .

సమస్త భారాన్నీ వహించే భూదేవి అతని భార్య. భర్త అంటేభరించే వాడు. అంటే సమస్త భారాన్నీ వహించే భూ దేవిని భార్యగా పొందిన హరి ఎంత ఘనుడో కదా సర్వ సంపదలనూ ప్రసాదించే లక్ష్మీ దేవినే భార్యగా పొందిన విష్ణువు ఘనత ఎన్నతరమా ?
అదే విధంగాఅన్ని ప్రాణులను సృష్టించే వానిని పుట్టించిన వాడుపాపాలు హరించే గంగను కుమార్తెగా పొందిన వాడు ఎంతటి ఘనుడో కదా.
దామోదరుడు అంటేదామము ( పద్మము) ఉదరము నందు కల వాడు అని అర్ధం.పద్మ గర్భుడు .
చిత్ర విచిత్రమయిన ప్రభావాలు కల వాడుదయా గుణము కల వాడుశత్రువులనే వారిని రూపుమాపిన వాడు శ్రీకాకుళ ఆంధ్ర నాయకుడు.

ఇవీ నిందా రూప స్తుతిస్తుతి రూప నిందలకు కొద్ది పాటి ఉదాహరణలు.
ఇస్తే పొగడడం లేక పోతే నోటి కొచ్చినట్టు తిట్టడం కూడా ఒక కళగా మన కవులు నిర్వహించేరు.

చూడండి. వీర మల్లుడు అనే రాజు ఒక కవికి కొన్ని మాన్యాలు ఇచ్చేడు. తిరిగి ఎందుకో వాటిని లాగేసు కున్నాడు దాంతో కవి గారికి తిక్క రేగి రాజుని ఇలా తిట్టేడు:

తెగి తాఁ బొడువని పోటును
తగ నర్ధుల కీయ నట్టి త్యాగముసభలోఁ
బొగిడించు కొనుచుఁ దిరిగెడి
మగ లంజల మగడు వీర మల్లుడు ధాత్రిన్

వీర మల్లుడు వట్టి పిరికి పంద. దాన గుణం ఇసుమంత లేదు. ఎప్పుడూ చుట్టూరా తనని పొగిడే వాళ్ళని ఉంచుకుని తనివి తీరా పొగడించు కుంటూ ఉంటాడు. ఈ వీర మల్లుడు మొడుడికి మొగుడు.

ఇవీ పొగడ దండలు. స్వస్తి.

14, ఆగస్టు 2015, శుక్రవారం

ఆరు ముఖాలూ ... ఆరు ముద్దులూనూ !



బ్రహ్మకి అయిదు ముఖాలుండేవి. అయితే, ఇప్పుడు నాలుగే ఉన్నాయి. కుమార స్వామికి ఆరు ముఖాలు , ఒక్కో చోట శివుడికి పంచముఖాలు , రావణుడుకి పది ముఖాలు , ఉండడం మనకి తెలుసు. ఇంకా ఎవరెవరికి ఎన్నెన్ని ముఖాలున్నాయో తెలియదు.

మనమయితే, ‘‘ ఎలా ఉందయ్యా ? ’’ అనడిగితే, నచ్చక పోతే , ‘‘ నాముఖంలా ఉంది ’’ అని చెబుతాం. కాని మీద పేర్కొన్న మహానుభావులు మాత్రం అలా అనడానికి వీలు లేదు. బ్రహ్మ ‘‘ ఏడిచినట్టుంది. నాముఖంలా ఉంది ’’ అని నాలుగు సార్లు , కుమార స్వామి ఆరు సార్లు , పంచ ముఖి శివుడు ఐదు సార్లూ , రావణబ్రహ్మ అయితే ఏకంగా పది సార్లూ అనాలి కదూ ? అన్ని ముఖాల వాళ్ళు ఆ పాటి ఆయాస పడక తప్పదు లెండి.

ఈ పరిస్థితిని గమనించి, మన కవులు చమత్కారంగా కొన్ని పద్యాలు చెప్పారు.

చూడండి ...

అంబా కుప్యతి తాతమూర్ధ్ని విలసద్గంగేయ ముత్ సృజ్యతాం ,
విద్వన్ షణ్ముఖ కా గతి: మయి చిరా దస్యా: స్థితాయా వద,
కోపావేశ వశౌ దశేషవదనై: ప్రత్యుత్తరం దత్తవాన్ ,
అంబోధి: జలధి: పయోధి రుదధి ర్వారాన్నిధి ర్వారిధి:

షణ్ముఖుడు తండ్రి శివుడితో ఇలా అన్నాడు: ‘‘ తండ్రీ ! అమ్మ కోపంగా ఉంది. నీ తల మీద ఉన్న ఆ గంగను విడిచి పెట్టు.’’

శివుడు: ‘‘కుమారా ! చిర కాలంగా నన్నే ఆశ్రయించి ఉన్న గంగను ఎలా విడిచి పెట్టేదిరా. నేను కాదు పొమ్మంటే, పాపం ఆవిడకి ఏదిరా గతి ?’’

చిన్నింటిని విడువడం కుదరదని తండ్రి చెప్పే సరికి కుమార స్వామికి కోపం ముంచు కొచ్చింది.

అతనికి ఆరు ముఖాలు కదూ ? అందు చేత ఆరు ముఖాలతోనూ ఇలా అన్నాడు:
‘‘అంబోధి. జలధి , పయోధి , ఉదధి , వారాంనిధి , వారిధి.‘‘

పై పదాలు ఆరింటికీ సముద్రమనే అర్ధం !!

అంటే , ‘ పోయి , సముద్రంలో పడమను !’ అని దీని అర్ధం.

‘వెళ్ళి గంగలో దూకు ’ అంటాం కదా, కోపంలో. అలాంటిదే ఇదీనూ.

నదీనాం సాగరో గతి: అని, నదులు చివరకు చేరేది సాగరం లోనే కదా ?

గంగకు సాగరమే గతి అని కవి ఈ విధంగా చమత్కరించాడు.

మరో పద్యం , ఆరు ముఖాల వాడి మీదే . చూడండి ...

ఓ కవి గారికి ( జంద్యాల పాపయ్య శాస్త్రి గారని గుర్తు ) అష్టావధానంలో ఇచ్చిన సమస్య ఇది:

‘‘నీవును నీవుయున్ మరియు నీవును నీవును నీవు నీవుయున్ !’’

ఇదీ సమస్య. ఇందులో ఆరు నీవులు ఉన్నాయి. కవి గారు కుమార స్వామి పరంగా ఇలా పూరించారు.

నీవు గజాస్యు చంక దిగనీయవు, నన్నసలెత్తు కోవు ,నీ
కా వెనకయ్య ముద్దు కొడుకయ్యె నటంచును పల్కు షణ్ముఖున్
దేవి భవాని కౌగిట గదించి ముఖంబున ముద్దిడున్ యనున్
నీవును నీవుయున్ మరియు నీవును నీవును నీవు నీవుయున్ !!

ఆరు ముఖాలు కలిగిన కుమార స్వామి ( షణ్ముఖుడు ) తల్లి పార్వతీ దేవితో ఇలా అంటున్నాడు:

‘‘ అమ్మా ! నీవు గజాస్యుని ( వినాయకుడిని ) చంక దిగ నీయవు. నన్ను అసలు ఎత్తుకోవు. నీకు ఆ వెనకయ్యే ( వినాయకుడే ) ముద్దు కొడుకయ్యేడు కదమ్మా ...’’
అంటూ ఏడుస్తున్న షణ్ముఖుని దేవి భవాని ( పార్వతీ దేవి) కౌగిలిలో ప్రేమతో బంధించి, ముఖాన్ని ముద్దు పెట్టుకుని ఇలా అంది: ‘‘ లేదయ్యా !! నువ్వన్నా నాకు మద్దేనురా కన్నా ..!’’

ఇక్కడ చమత్కారం ఏమిటంటే, పార్వతి కుమార స్వామిని లాలిస్తూ , అతని ఆరు ముఖాలనీ ముద్దు పెట్టుకుంటూ నువ్వన్నా నాకు ముద్దేనురా అంది. అందుకే, నువ్వు , నువ్వు ... అంటూ ఆరు సార్లు అంది.! అదీ కవి చమత్కారం.

మన చిన్నారులకి ఏదయినా తినిపించాలన్నా, త్రాగించాలన్నా, పాపం, మన తల్లులు ఎంత అవస్థ పడతారో మనకి తెలిసినదే కదా ? ఈ ఆరు ముఖాల వాడికీ , ఆ తొండం గల వాడికీ - వాళ్ళ చిన్నప్పుడు ఏదేనా తినిపించడానికీ, త్రాగించడానికీ జగన్మాత ఎన్ని తంటాలు పడిందో కదూ ?



6, ఆగస్టు 2015, గురువారం

భగవాన్ ! హేఁవిటి మాకీ పరీక్ష ?!




‘‘ ఎప్పుడూ శ్లోకాలూ , పద్యాలూ, కవితలూ కథలేనా ? నీ కథా మంజరిలో మామూలు విషయాలేవీ పెట్టవ్
కదా ! ’’ అని విసుక్కున్నాడు మా తింగరి బుచ్చి.

‘‘ ఏం పెట్టమంటావ్ ? ’’ అడిగేను కొంచెం నీరసంగా.

‘‘ పోనీ నా జీవిత చరిత్ర రాసి పెట్టెయ్ ’’ అని సలహా ఇచ్చేడు. ‘‘తింగరి బుచ్చి జీవిత ప్రస్థానం’’అని దానికి వాడే ఓ పేరు కూడా పెట్టీసేడు.

తన జీవిత చరిత్ర రాయక పోతే కథా మంజరి జన్మ చరితార్థం కానేరదని దబాయించేడు కూడానూ.

నా పుణ్యం పుచ్చి పోయి, నా పాపం పండి, నా మెదడు మొద్దుబారి పోయి, ఏం రాయడానికీ తోచక ఆలోచన గడ్డకట్టి నప్పుడు - అప్పుడు రాస్తాను కాబోలు , మా తింగరి బుచ్చి గాడి జీవిత చరిత్ర.

సరే, వాడి దాడి నుండి తాత్కాలికంగా నయినా తప్పించు కోడానికి ఈ పరీక్షా సమయమ్ -  పెడు తున్నాను.

ఇప్పు డంటే బ్లూ టూత్ లూ, సెల్ ఫోన్లూ లాంటి అత్యాధునిక పరికరాలేవో ( నాకు తెలీనివి) వచ్చేయి కానీ, వెనుకటి రోజులలో పరీక్షలు రాసే పిలకాయలకి పాపం ఇవేమీ అందు బాటులో ఉండేవి కావు.

చిన్న చిన్న కాగితాలు చింపుకొని వాటి మీద జవాబులు ఓపిగ్గా రాసుకొచ్చే వారు. వాటిని స్లిప్పులనీ, చిట్టీలనీ అంటారు.

రహస్యంగా వాటిని తమ శరీరాల మీద బట్టల్లోనో, చెప్పుల్లోనో, చొక్కా మడతల్లోనో - వివిధ రహస్య స్థావరాలలో దాచుకొచ్చే వారు. సంప్రదాయానికి విలువ నిచ్చే విద్యార్ధులు ఇప్పటికీ ఈ ప్రాచీన పద్ధతులనే అవలంబిస్తున్నారనుకోండి ! అలా తెచ్చిన చిట్టీలని దొంగ చాటుగాతీయడం ఓ కళ. పట్టుబడితే కాళ్ళా వ్రేళ్ళా బ్రతిమాలడం . జాలీ దయా లేని దుర్మార్గులైన వాచర్లయితే డిబారయి పోవడం.

చిట్టీలు రాసే విద్యార్ధి కళా కారుల హక్కులను కాపాడడం కోసం ఉద్యమించాలని ఉందని మా తింగరి బుచ్చి గాడు లోగడ ఓ సారి ఎప్పుడో అన్నట్టు గుర్తు.

విద్యార్ధులకు ఈ చిట్టీలు అందించే పనిలో చాలా మంది శ్రమిస్తూ ఉంటారు. పరిగెత్తడం, గోడలు దూకడం, అటెండర్లను మంచి చేసు కోవడం లాంటి చాలా నైఫుణ్యాలు వీరికి ఉండాలి.

ఇక, పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారంటూ మనం పాపం పిలకాయలనే ఆడి పోసుకుంటూ ఉంటాం కానీ, ఈ విషయంలో కాపీయింగ్ చేయించడానికి అత్యుత్సాహం ప్రదర్శించే టీచర్లూ ఎక్కువే.

పరీక్షల్లో విద్యార్ధులకు జవాబులు అందిస్తూ వారికి మంచి మార్కులు వచ్చేలా చూసి, వారి నుండి మంచి మార్కులు కొట్టెయ్యాలనే యావ కొంతమంది టీచర్ల లో ఉంటుంది. వారు పరోపకార పరాయణుల గానూ, మంచి సారు వారుగానూ, పిల్లలంటే దయాపరులుగానూ మన్ననలు అటు విద్యార్ధులనండీ, వారి తల్లి దండ్రలు నుండీ తరుచుగా పొందుతూ ఉంటారు ( అడపా దడపా క్వార్టరో, హాఫో బాటిల్స్ , చిరుకానుకలతోసహా)

ఇలాంటి పరోపకారి పాపన్నలాంటి ఓ టీచరు పరీక్ష హాల్లో ఇంగ్లీషు పరీక్ష నాడు ఇన్విజిలేషను చేస్తున్నాడు.
తన ఉదారతనూ, వివేకాన్నీ, ఇంగ్లీషు భాషా ప్రావీణ్యాన్నీ పరీక్ష గదిలో పిలకాయల ముందు ప్రదర్శించాలని మనసు ఒకటే తొందర పడుతోంది. నోరు మహా దురద పెడుతోంది.

‘‘ ఒరేయ్ ! బిట్ పేపరు ఇచ్చే వేళవుతోంది. రెడీగా ఉండండి. జవాబులు చెబుతాను. మళ్ళీ చెప్పమని అడగకుండా గబగబా రాసెయ్యాలి. ’’ అని హెచ్చరించాడు.

బిట్ పేపరు అందరికీ పంచేడు. గుసగుసల స్వరంతో జవాబులు చకచకా చెబుతున్నాడు. ఆ ఇంగ్లీషు బిట్ పేపరులో ఓ నాలుగు ఖాళీలలో ప్రిపోజిషన్స్ ( Prepositions ) నింపాలి. టీచరు నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని ఆ ఖాళీల్లో వరుసగా
In,TO,IN,TO లు రాయండ్రా అని చెప్పాడు. ఇంకే ముంది, విధేయులైన పిలకాయలు గబగబా రాసి పారేసారు.
చూస్తే అందరి పేపర్ల లోనూ ఆ ఖాళీలలో నాలుగింటి లోనూ X గుర్తులే వేసి ఉన్నాయి !

మరో సారి మరో వాచరు గారు పిల్లలకి మామ్మూలుగా చెప్పే హెచ్చరికలతో పాటూ ఇంకా ఇలా చెప్పాడు.

‘‘ ఒరేయ్ ! బిట్ పేపరు జవాబులు చెబుతాను గానీ బొత్తిగా అందరకీ ఒకేలా 20 కి 20 వస్తే బాగోదు. అంచేత కావాలనే రెండో, మూడో నేను చెప్పినవి కాకుండా తప్పు జవాబులు రాసెయ్యండి. ఏం ?’’ అని చెప్పి అలా చెయ్యని వాళ్ళ తాట వలిచేస్తానని ప్రతి ఙ్ఞ కూడా చేసాడు.

ఆరోజు సోషలు పేపరు. ఖాళీలు పూర్తి చేయవలసిన వాటిలో ఒక ప్రశ్న ఇలా ఉంది : ‘‘ ఒరిస్సాలో ప్రసిద్ధమైన జగన్నాథ స్వామి వారి ఆలయం ----- లో ఉంది.’’

ఆ ఖాళీలో ‘‘ పూరీ’’ అని రాయమని మన మంచి సారు వారు చెప్పడంతో అంతా మహదానందంతో అలాగే రాసేసారు.

కొంత మంది పిల్లలు మాత్రం , టీచరుగారి హెచ్చరికల మీద, మాట మీద గౌరవంతోనో, వారి గుస గుసల స్వరం వినిపించక పోవడంచేతనో, తెలీక పోవడం చేతనో, టీచరు ముందుగా చెప్పిన విధంగా పూరీ అని కాక, దానికి బదులుగా చపాతీ అని రాసేరు.

పేపర్లు దిద్దే స్పాట్ వేల్యుయేషన్ లో వాటిని దిద్దుతున్న టీచరు గారు పూరీ అనే ఆన్సరున్న వాటికి వరసగా రైట్ టిక్కు పెట్టి మార్కులు వేస్తున్నాడు. ఆ పనిలో అతను చాలా బిజీగా ఉన్నాడు. యంత్రంలా పని చేసుకు పోతున్నాడు. కొన్ని పేపర్లో ఆ బిట్ కి కొందరు పూరీ అనీ కొందరు చపాతి అని రాయడంతో జెట్ వేగంతో కదులుతున్న అతని ఎర్ర ఇంకు కలానికి బ్రేకు పడింది. చికాగ్గా దిద్దడం ఆపి, ఛీఫ్ ఎగ్జామినర్ ని అడిగాడు : ‘‘ సారూ ! ఈ బిట్ కి కొందరు పూరీ అనీ, కొందరు చపాతీ అని జవాబులు రాస్తున్నారు. దేనికి మార్కులు వేయమంటారు ?’’ అని.

పరాగ్గానో, చిరాగ్గానో ఉన్న ఆ ఛీఫ్ సారు :

‘‘ రెండూ తయార్యేది ఒకే పిండితో కదా. ఎలా రాసినా మార్కు ఇచ్చెయ్యండీ ’’ అని జవాబిచ్చేరు.

చిట్టీలు చూసి కూడా రాయ లేని మగానుభాగులూ ఉంటారు ! హిందీ  పరీక్ష నాడు హితైషులు ( ? ) అందించిన టిట్టీలను మక్కీకి మక్కీ ఎక్కించీసినా పాసు కాని  కుర్రాడు వొకడుండే వాడుట. ఏరా, చిట్టీలన్నీ అందేయా ? అనడిగితే ఔననే వాడుట.  పేపర్లో అన్నీ రాసేవా ? అనడిగితే బుద్ధిగా తలూపే వాడుట. మరి వీడు హిందీ పరీక్ష ఎప్పటికీ గట్టెక్కడేం ! అని ఆరా తీస్తే అసలు విషయం బోధ నడిందిట ! వాడు తనకి అందిన చిట్టీ లో మేటరు యధాతధంగానే పేపర్లో ఎక్కిస్తూనే ఉన్నాడు. కానయితే చిట్టీలు   తిరగేసి అందు కోవడంలో పొరపాటు వలన ఆ హిందీ అక్షరాలను క్రింద గీతలు పెట్టి  తిరగేసి రాస్తున్నాడుట !


అయ్యా ఇదీ సంగతి.

చివరిగా ఒక కొంటె కవిత:

ముందు వాడు రాసిందంతా
మక్కీకి మక్కీ కాపీ కొట్టేడు పుల్లారావు
అయినా జీరో మార్కుల కన్నా ఎక్కువ రానే రావు !
ఎందుకబ్బా ! అని ఆశ్చర్య పోకండి.
ముందు వాడు రాసిందంతా క్వశ్చెన్ పేపరే కదండి !

3, ఆగస్టు 2015, సోమవారం

రూాపాయి తప్పి పోయింది ! వెతికి పెట్టరూ ?!



రూపాయి .. ... పాయె !

 ఏమయి పోయింది చెప్మా ?!

మా చిన్న తనంలో మా నరసింహం బాబాయి ఈ లెక్క చెప్పి, మమ్మల్ని జవాబు చెప్పమని అడిగాడు. మేం బిక్క ముఖాలు వేసేం.

 మీరు కూడా మీ పిల్లకాయలకి ఈ లెక్క చెప్పి, జవాబు చెప్పమని అడగండి.
ఏం చెబుతారో చూడండి:

ఇదిగో ఆ లెక్క:

రాముడు, భీముడు ఇద్దరూ మంచి స్నేహితులు. వాళ్ళు తమ బెస్ట్ ఫ్రెండ్ సోముడి పుట్టిన రోజు కానుకగా ఏదేనా మంచి కానుక కొని ఇద్దామని బజారుకి వెళ్ళారు.

షాపులో ఒక మంచి బొమ్మని చూసి అదెంత అని, అడిగారు. అప్పుడు షాపు యజమాని లేడు. పని కుర్రాడు ఏభై రూసాయలు అని చెప్పాడు.

సరే అని రాముడు , భీముడు చెరో పాతిక రూపాయలూ ఇచ్చి, బొమ్మను కొన్నారు. వాళ్ళు ఆ బొమ్మను కొని ఇంటికి వెళ్ళాక, ఆ షాపు పని కుర్రాడు వచ్చి, వారికి మూడు రూపాయలు తిరిగి ఇచ్చి వేస్తూ ఇలా అన్నాడు : ‘‘ ఈ బొమ్మ నేను మీకు ఏభై రూపాయలకు అమ్మేను కదా. కానీ, మా యజమాని వచ్చి, దీని ధర ఏభై కాదని, నలభై అయిదు రూపాయలే ననీ, తిరిగి అయిదు రూపాయలు మీకు ఇచ్చి రమ్మన్నాడనీ చెప్పాడు. అయితే వచ్చే దారిలో తను ఆ అయిదు రూపాయలలో రెండు రూపాయి ఎక్కడో పారేసానని, అందు వల్ల వారికి మూడు రూపాయలే ఇస్తున్నాననీ అన్నాడు. అంతే కాక, తాను రెండు రూపాయలు పారేసిన సంగతీ, మూడు రూపాయలు మాత్రమే వారికి ఇచ్చిన సంగతి యజమానికి చెప్ప వద్దని కూడా బ్రతిమాలు కొన్నాడు.

రాముడు, భీముడు భలే, భలే అనుకుంటూ, వచ్చిందే చాలుననుకుని ఆ మూడు రూపాయలూ తీసు కున్నారు. షాపులో బొమ్మ కొనడానికి చెరో పాతికా ఇచ్చేరు కనుక, తిరిగి ముదరాగా వచ్చిన మూడు రూపాయలని కూడా వారిద్దరూ సమానంగా చెరి రూపాయిన్నర చొప్పునా పంచు కున్నారు.

ఇదీ కథ. ఇప్పుడు అసలు ప్రశ్ప ఏమిటంటే,

రాముడు భీముడు కలిసి షాపు పని వాడికి ఇచ్చిన మొత్తం చెరొక పాతిక - అంటే ఏభై రూపాయలు.

బొమ్మ అసలు ఖరీదు నలభై అయిదు.

పని వాడు తెచ్చినది ఐదు రూపాయలు.

వాడు పారేసానని చెప్పినది రెండు రూపాయలు.

రాముడు , భీముడు పంచు కున్నది - చెరొక రూపాయన్నర. మొత్తం మూడు రూపాయలు.

ఇప్పుడు చెప్పండి:

బొమ్మ అసలు ధర నలభై అయిదు . పంచు కొన్నది మూడు. పని వాడు పోగొట్టు కున్నది రెండు . మొత్తం ఏభై.

లెక్క సరి పోయిందే !

ఇప్పుడు ఇదే లెక్కని ఇలా చూడండి:

బొమ్మ కోసం మొదట రాముడు తన వాటాగా ఇచ్చినది : 25 రూపాయలు.
భీముడు తన వాటాగా ఇచ్చినది: 25 రూపాయలు
మొత్తం: 50 రూపాయలు. అయితే వారికి తిరగి పని వాడు తెచ్చి ఇచ్చినది మూడు రూపాయలు.

పని వాడు తెచ్చి ఇచ్చిన దానిలో రాముడి వాటాగా వచ్చినది రూపాయిన్నర. అంటే, రాముడి జేబు లోనుండి తీసి ఖర్చు చేసిన మొత్తం ఎంతన్నమాట ? ఇరవై మూడు న్నర రూపాయలు. అంతే కదా !

అలాగే, భీముడికి తన వాటాగా వచ్చిన రూపాయిన్నర కలిపితే వాడి వాటాగా ఖర్చయినది ఎంతన్నమాటా ?

ఇరవై మూడున్నర రూపాయలు. అంతే కదా ?

ఇప్పుడు రాముడు, భీముడు తమ జేబుల లోనుండి ఖర్చు చేసిన డబ్బు మొత్తం కూడితే ఎంతవుతోందీ ?

ఇరవై మూడున్నర + ఇరవై మూడున్నర = 47 రూపాయలు. కదా !

పని వాడు పారేసినది ఎంతా ? రెండు రూపాయలు. అంతే కదా ?

ఇప్పుడు రాముడు, భీముడుల అసలు నిఖర ఖర్చు 47 రూపాయలు + పని వాడు పారేసిన 2 రూపాయలు = 49 రూపాయలు.

అరే ! ఒక రూపాయి తక్కుఃవ వస్తోందే ? ఏమయి పోయింది చెప్మా ?!

టాఠ్ ! రాముడు ; భీముడుల నిఖర ఖర్చు 47 , పని వాడు పారేసినది 2 మరి వాడు ఇచ్చినది మూడు రూపాయలు కదా. దానిని కలపొద్దూ అంటారా ? సరే, మీ ఇష్టం. నాదేం పోయింది ? అలాగే కలపండి. కానీ అప్పుడు మొత్తం 52 అయి పోవడం లేదూ ? అదనంగా ఈ రెండు రూపాయలూ ఎక్కడి నుండి వచ్చేయి
 చెప్మా ?


18, జులై 2015, శనివారం

కంటి మీద కునుకు లేదు !



సంజయుడు రాయబారిగా పాండవుల వద్దకు వెళ్ళాడు. తిరిగి వచ్చాడు. అక్కడి విషయాలు తెలుసు కోవాలని ధృతరాష్ట్రుడికి మహా తొందరగా ఉంది. ఐతే , తిరిగి వచ్చిన సంజయుడు అతనికి ఏమీ అప్పుడు చెప్ప లేదు. బడలికగా ఉందన్నాడు. మరు నాడు ఉదయమే అందరూ సభదీరే వేళ అక్కడ జరిగిన విశేషాలన్నీ చెబుతానని తన నివాసానికి వెళ్ళి పోయాడు.

అంతే !

మరింక కురు మహారాజుకి కంటి మీద కునుకు పట్ట లేదు. అశాంతితో అటూ ఇటూ దొర్లు తున్నాడే కానీ నిద్ర వస్తేనా ?
విదురుడిని తన దగ్గరకి పిలిపించు కున్నాడు. నాలుగు మంచి మాటలు చెప్పి తన అశాంతిని దూరం చేయమన్నాడు.

విదురుడు రాజుకి చాలా నీతులు బోధించాడు. అక్కడక్కడా చురకలు కూడా వేసాడు.

బలవంతుఁడు పై నెత్తిన
బలహీనుఁడు ధనము గోలు పడిన యతఁడు మ్రు
చ్చిల వేచు వాఁడు, గామా
కుల చిత్తుఁడు నిద్ర లేక కుందుదు రధిపా !


బలవంతుడు మీద పడిన బలహీనుడూ, డబ్బు పోగొట్టు కొన్న వాడూ, ఎప్పుడు ఎవడి సొమ్ము కాజేదామా అని కాచుకుని కూర్చునే వాడూ, కామం చేత మనస్సు కలత చెందిన వాడూ నిద్ర పట్టక అవస్థ పడతారు సుమీ ! అని
హిత బోధ చేసాడు విదురుడు.

ఈ సందర్భం లోనే గొప్ప తాత్త్వికార్ధాలతో కూడిన తిక్కన గారి మహా భారతం ఉద్యోగ పర్వం లోని ఒక చిన్న పద్యం చూడండి:

ఒకటిఁ గొని, రెంటి నిశ్చలయుక్తిఁ జేర్చి
మూఁటి నాల్గింటఁ గడు వశ్యములుగఁ జేసి
యేనిటిని గెల్చి యాఱింటి నెఱిఁగి యేడు
విడిచి వర్తించు వాఁడు వివేక ధనుడు !

అధికారాన్ని చేపట్టి, మంత్రమూ ఉత్సాహమూ అనే రెండింటినీ నిశ్చలంగా ఉండేలా జత చేయాలి, మిత్రులూ, అమిత్రులూ , తటస్థులూ అనే మూడు వర్గాల వారినీ, సామ, దాన, భేద, దండములు అనే నాలుగు ఉపాయాల చేతా పూర్తిగా వశ పరచు కోవాలి. త్వక్కు ( చర్మం) ,చక్షువు ( కన్ను ) , శ్రోత్రము ( చెవి ), జిహ్వ ( నాలుక), ఘ్రాణం
( వాసన) అనే సంచేంద్రియానూ జయించాలి. సంధి , విగ్రహం, యానం , ఆసనం, ద్వైదీభావాలు(2) అనే ఆరింటినీ తెలుసు కోవాలి. వేట ,జూదం, పానం, స్ర్తీ , వాక్పారుష్యం ( కఠినంగా మాటలాడడం, ) దండపారుష్యం ( హింప చేయడం), అర్ధ దూషణం ( దుబారా చేయడం) అనే సప్త ( 7) వ్యసనాలనూ విడిచి పెట్టి ఎవడయితే ఉంటాడో వాడే వివేకవంతుడు.


స్థూలంగా ఈ పద్యానికి ఇదీ భావం. కానీ పెద్దలు ఈ చిన్న పద్యానికి వేరే తాత్త్విక పరమయిన అర్ధాలు చెబుతారు. వాటిని కూడా చూదామా ?

ఒకటి బుద్ధి. దీనికి వాక్కు , క్రియ, అనే రెండింటినీ నిశ్చలంగా ఉండేలా చేర్చాలి. అంటే ఏది చెబుతాడో అదే చేయాలి.
ఇక, ధర్మార్థ కామాలను మూడింటినీ బ్రహ్మచర్యం, గార్హస్థం, వానప్రస్థం, సన్యాసం అనే నాలుగు ఆవ్రమవిధులతో వశం చేసు కోవాలి. కర్మేంద్రియాలు ( వాక్కు, పాణి, పాదం, వాయువు, గుహ్యం ) ఐదింటినీ గెలవాలి. యజన, యాజన, ఆద్యయన, దాన, ప్రతిగ్రహాలు అనే స్మార్త కర్మలను తెలుసుకొని, ఆవరణం ( పంచభూతాలు పృధ్వి, అప్,తేజస్సు, వాయువు, ఆకాశం) బుద్ధి, అహంకారం ఈ మొత్తం ఏటింటినీ విడిచి వర్తించే వాడు వివేకధనుడు.

పెద్దలు చెప్పే మరో తాత్త్వికార్ధం:

ఒకటి - సత్త్వం , రెండు -రజస్తమస్సులూ , మూడు -ధన, దార ( భార్య) పుత్రుల పట్ల మమకారం, నాలుగు - ధ్యానం, ధారణ, యోగం, సమాధి. తక్కినవి మీద చెప్పినవే.

మూల భారతంలో దీని శ్లోకం ఇలా ఉంది:

ఏకయా ద్వౌ వినిశ్చిత్య త్రీం శ్చతుర్భి ర్వశే కురు
పంచ జిత్వా విదాత్వా షట్ సప్త హిత్వా సుఖీ భవ !


ఈ టపా రాస్తున్నప్పుడు వచ్చేడు మా తింగరి బుచ్చిగాడు. ( వాడి తొలి పరిచయం ఇక్కడ చూడండి ) ఏఁవిటి రాస్తున్నావని ఆరా తీసాడు.

అంతా చదివి వినిపించేను. నా ఖర్మ కాలి, ఏ కొంచెమైనా అర్ధమయిందా అనడిగేను.

భలే వాడివే , అర్ధం కాక పోవడమేం ! గుడ్డి రాజుకి పాపం నిద్ర పట్ట లేదు. అంతే కదా ! అన్నాడు. నా బుర్ర తిరిగి పోయింది.

ఓ నిద్ర మాత్ర వేసుకుంటే పోలా ! అని ముక్తాయించేడు.

నాకు బ్లాగు రాయడం మీద చెప్ప లేనంత విరక్తి కలిగింది. కథా మంజరిని మూసేద్దామని నిర్ణయాని కొచ్చేను.


13, జులై 2015, సోమవారం

హా ! దొరికెన్ !



హమ్మయ్య ! దొరికిందండీ, ఇన్నాళ్లకి !

పఠాభి ‘ ఫిడేలు రాగాల డజన్ ’ పుస్తకం ఓ మిత్రుని ఇంట దొరికింది. మద్రాసు రామరాయ ముద్రణాలయం వారు వేసిన ఈ పుస్తకం ఏ సంవత్సరంలో ప్రచురించ బడిందో వివరాలు ప్రచురణ కర్తలు ఇవ్వ లేదు. శ్రీ. శ్రీ ధర్మమా అనీ, ఇది ప్రమాది అధిక శ్రావణ మాసంలోనో, కాస్త అటూ ఇటూ గానో వెలువడి నట్టుగా భావించ వచ్చు. దానికి సరిపోయిన ఇంగ్లీషు సంవత్సరం చూసుకుంటే సరి. వెల మాత్రం‘‘ డజన్ అర్ధణాలు’’ అని ఉంది. అంటే ఆరు అణాలని తాత్పర్యం ! అనగా పావలా బేడ. అనగా అర్ధ రూపాయికి రెండణాలు తక్కువ. అనగా, నలుబది ఎనిమిది కానులు. అనగా ... అనగా .... అనగా ....

పాత ఎక్కాల బుక్కు మీరే చూసుకోండి.

కవి ఈ పుస్తకాన్ని వచన పద్యములు అని పేర్కొన్నాడు. నేను తెలుగులో పీ.జీ

చేసి నప్పుడు ఫిడేలు రాగాల డజన్ కోసం చాలా వెతికాను, ఎక్కడా కాపీలు నాకయితే దొరక లేదు. ఇందులోని కవితలను ( వచన పద్యములను ? ) అక్కడా ఇక్కడా చూసి, ఎత్తి రాసుకొని బండి లాగించీసేను. ఇప్పుడు దొరికింది, ఈ చిన్న పుస్తకం. ఎలా ఉందో చూసారూ ? పఠాభి రచన మీద చెదలు తమ అభిప్రాయం చెప్పాలని అనుకుని, మధ్య లోనే విరమించు కున్నట్టున్నాయి. మహా భారతంతో పాటూ, మహా ప్రస్థానం వరకూ అవి ఇలాగే తమ అభిప్రాయాలు నిక్కచ్చిగా తెలియ జేస్తూ ఉంటాయి, మన జాగ్రత్తలో మనం ఉండక పోతే !

పుస్తకం అట్ట మీద - ‘‘చదవండి ఫిడేలు రాగాల డజన్ ’’ అని ఉంది. కింద చిన్న ఫిడేలు బొమ్మ చూసారు కదూ. ఇక్కడ కొంత కొంటె దనం. అప్పట్లో కొత్త దనం- కన బరిచారు. ఫిడేలు బొమ్మ కింద రాగాల డజన్ అని ముద్రించారు. కింద చలం గారి మాటలు ... వెనుక అట్ట మీద విద్వాన్ విశ్వం గారివీ, వేదుల (సత్య నారాయణ శర్మ) వారివీ , మాటలు ఉన్నాయి. తర్వాత,

ఆంధ్ర పత్రిక వారివీ, కథాంజలి వారివీ అభిప్రాయాలు కూడా వేశారు.

ఆ కింద చివరాఖరిగా ఎర్రక్షరాలతో రాగాల డజన్ కాదు, దీన్ని రోగాల డజన్ అనాలి. అని B.R.R గారు అభిప్రాయ పడ్డారు. ( వీరెవరు చెప్మా ? )



పుస్తకములు దొరుకు స్థలము : నమ్మాళ్వారు, పోస్టు బాక్సు 251, మద్రాసు అని ఉంది.

అంకితము మృణాళినికి, కాదు కల్యాణికి ; కాదు ఇరువురికి అని ఉంది.

కవి గారే రాసారో, ముద్రాపకులే రాసారో కానీ అంకితం తరువాతి పేజీలో ఇలా ఉంది:

‘‘అక్కడక్కడ ఈ పద్యాలలో వచ్చునట్టి పఠాభి అనే పేరు గల పాత్రకు, గ్రంథ కర్తకు

ఏ మాత్రం సంబంధం లేదని గమనింపు ; ‘‘ కృష్ణ పక్షం’’ లోని ‘‘ కృష్ణ’’ కును, దాని గ్రంథ కర్త నామం లోని ‘‘కృష్ణ’’ కును ఏలా సంబంధం లేదో అలాగే. ’’



ఇక, ఇంట్రో శ్రీ.శ్రీ రాసేరు. శ్రీ.శ్రీ నవ కవుల తిరుగు బాటుని గురించి రాస్తూ ఫిడేలు రాగాల డజన్ చదవమని సలహా ఇచ్చాడు. 38 పేజీలున్న ఈ చిన్ని పుస్తకంలో పుటల సంఖ్య లన్నీ తెలుగు అంకెలే వేసారు.

ఫిడేలు రాగం పద్యం ఇదీ .....

చూడండి.



ఫిడేలు రాగమ్ ఫిడేలురాగమ్

ఫిడేలు రాగమ్బులు

వినూతన పదప్ రేమికులు , మహా కాముకులు ;

అన్ యోన్ యమగు దమ్ పతులు కూడ;

ఫిడేలన్ నది,, ‘‘ మయ్డియ రాగ్రా

మీ వారన్దరు సనాతనాచార్ యుల్

ముఖమ్విరిచి, ఇన్ గ్ లీష్టానిని

నన్ ను న్జేపట్ టవద్ దని

గద్ దిన్చినా కూడ నీవు

మహా సాహసన్తో, రుమాన్ టిక్ గా

మ్ యారేజ్జేసుకొన్ నావు గదా ! స్ వీట్ హార్ ట్ ! ’’

రాగమ్ అనినాడు

‘‘థ్ యాన్ క్ స్ టు పఠాభి

నా కతడు ధయ్రిన్గా

సహాయమ్ జేయ పట్ టి మనకు

వివాహమయిన్ ది డార్ లిన్ గ్ !’’



ఫిడేలు రాగమ్బులు ఆదర్ శమగు జమృతులు

తటాల్ మని కలకన్ ఠ మున, ఫిడీలీలా

స్ ర శ్ ని న్ చినది. ‘‘ రాగా డియర్నన్ ను

నిజన్గా ప్ రేమిస్ తావా నీవు ?

ఏమ్ మాటన్టున్నావు ఫిడేలీ జీవితేశ్ వరీ!

నా జన్ మనీలో లీనమయి పోయిన్ది,

సన్ ఘమ్ నన్ వినా గూడా

నిన్ను చేపట్టినన్ దుక్నాకు , వచిమ్ప రాని

సవుఖ్ యమ్’’ ఫిడీలు చిత్ తతస్త్రులు

ఆపనందంతో మ్ రోగినవి.



రాగమ్ అంత ఫిడీలీని గాఢమ్ గా

కన్గిలించాడు. తర్వాత వారి

దేహాలు న్నే కమయినాయి సరళ శయ్యన్.

అపూర్ వమ్ బగు అన్దంబగు సన్తానమ్ వారికి

జనిన్చి అసన్ ఖ్ యాకముగ ; --- వారన్తా

పఠాభిని గని ‘‘ తాతా తాతా ’’ అనే వారు.



----------



దీనికి టీకా టిప్పణులు చెప్పడానికి శ్రీ. శ్రీ లేడు. ఆరుద్రా లేడు. రోణంకీ లేడు.

తెలిస్తే ఎవరయినా చెబుదురూ .......



అప్పుడు .... హా దొరికెన్ ! అని ఊరుకోకుండా, హా ! తెలిసెన్ ! అని కూడా అనుకుంటాను.

బాబ్బాబు ! ఎవరయినా పుణ్యం కట్టుకుందురూ !


ఎందుకయ్యా వెక్కి వెక్కీ ఏడ్చినావూ ?!




యే నామ కేచిదిహ న: ప్రథయం త్యవఙ్ఞాం
జానంతి తే కిమపి తాన్ర్పతి నైష యత్న:
ఉత్పత్స్యతే మమ తు కో2పి సమాన ధర్మా
కాలో హ్యయం నిరవధి ర్విపులాచ పృధ్వీ

నా రచన చదివి, దాని మీద ఆదరం లేని వారికి ఒక్క మాట చెబుతున్నాను. ఈ రచన మీ కోసం చేసినది కాదు. కాలం అనంతమయినది. నేల తల్లి చాల విశాలమైనది. నా కావ్య గుణ ధర్మాలను వెల కట్ట గల రసికుడు ఎక్కడయినా ,ఎప్పుడయినా పుట్టక పోడు సుమా !

మంచి కవిత్వాన్ని ఆదరించ లేని కొందరు సమ కాలికుల గురించి మన కవులు ఈ విధంగా వాపోవడం జరిగింది.

చేమకూర వేంకట కవి ఏ గతి రచియించి రేని సమ కాలము వారలు మెచ్చరే గదా ? అని రవంత బాధ పడిన సంగతి తెలిసినదే కదా.

అరసికేషు కవిత్వ నివేదనమ్ మాలిఖ మాలిఖ మాలిఖ అని ఓ కవి ఓ బ్రహ్మ దేవుడా, రసికులు కాని వారికి నా కవిత్వాన్ని వినిపించే దౌర్భాగ్యం నాకు ముమ్మాటికీ కలిగింకయ్యా. నా నుదుటున అలాంటి రాత రాయకయ్యా అని వాపోయేడు.

గురజాడ కూడా,
కొత్త పాతల మేలు కలయిక
క్రొమ్మెఱుంగులు చిమ్మగా
మెచ్చనంటావీవు నీవిక
మెచ్చకుంటే మించి పాయెను ...

అని ఊరుకోకుండా,
కొయ్య బొమ్మలు మెచ్చు కళ్ళకు
కోమలులు సౌరెక్కునా ?
అని ఓ చురక కూడా వేసాడు.

కవితా మాధురి సంగ్రహించి, ‘‘ యిది శ్లాఘ్యంబిద్ది శ్లాఘ్యంబు గా
దు, విశేషంబిట, నిర్విశేషమిట, మాధుర్యంబిటన్ , వహ్వరే !
కవిరాజా !’’ యని మెచ్చి యిచ్చు నృపుఁడొక్కండైనఁగర్వైనచో
కవియై పుట్టుట కన్నఁబాప పరిపాకంబుండునే భూవరా !

ఈ విధంగా తిరుపతి కవులు అరసికులయిన ప్రభు వులున్న లోకంలో కవిగా పుట్టడం కన్నా దౌర్భాగ్యం మరొకటి లేదని బాధ పడిన సందర్భమూ లేక పో లేదు.

శ్రీనాధుడు కూడ, భీమేశ్వర పురాణంలో ఇలాంటి వారి గురించే కుకవి నింద చేసాడు ...

బోధమల్పంబు గర్వ మభ్యున్నతంబు,
శాంతి నిప్పచ్చరము మచ్చరము ఘనము
కూప మండూకములఁబోలె కొంచెమెఱిఁగి
పండితమ్మన్యులైన వైపండితులకు

తెలిసింది తక్కువా, గర్వమా, ఎక్కువా. . నిదానం లేదు. మాత్సర్యమా, జాస్తి. నూతిలో కప్పల్లాంటి
వారు ఈ పండితమ్మన్యులు.

ఎందుకయ్యా ఏడుస్తున్నావు ? అంటే, ఎదుటి వాడు గొప్పోడైపోతున్నడ్రోయ్ బాబోయ్ ... అని ఏడిచే మగానుబావులు అన్ని కాలాల లోనూ ఉంటారని చెప్పడానికి మచ్చుకి రెండు మూడు ఉదాహరణలివి.


12, జులై 2015, ఆదివారం

తిరగబడు ! ( విప్లవం ఎంత మాత్రమూ కాదు ! )




ఈ శ్లోకంలో చమత్కారాన్ని చూడండి ...

సాక్షరా విపరీతాశ్చేత్ , రాక్షసా ఏవ కేవలం
సరసో విపరీతో2పి , సరసత్వం న ముంచతి.

అక్షరాస్యులు విపరీతులయితే , అంటే దుర్మార్గపు వర్తనులయితే , రాక్షసులవుతారు. వారి చదువు చట్టుబండలై , మహా దూకుడుకుగా తయారవుతారు.

అంతే కదా, సాక్షరులు అంటే అక్షరాస్యులు. శ్లోకంలో సాక్షరా అనే పదాన్ని తిరగేసి చదవండి రాక్షసా
( రాక్షసులు) అని రావడం లేదూ !

అయితే, సరసుల (పండితులు ) తలక్రిందులయినా , అంటే , ఎట్టి పరిస్థితిలోను కూడా , తమ సరసత్వాన్ని వీడరు.

శ్లోకంలో రెండో పాదం మొదటి పదం చూడండి. దానిని సరస: , విపరీత: అపి అని చదువుకోవాలి.

ఇప్పుడు చూడండి ... సరస అనే పదం వెనుక నుండి చదివినా మారడం లేదు. కదూ ?

చదవేస్తే ఉన్న మతి పోతుంది కొందరికి. చదువుకున్న మూర్ఖులుగా తయారవుతారు. కొందరు మాత్రం ఎదిగిన కొద్దీ ఒదిగే లక్షణాన్ని కలిగి ఉంటారు. అదన్న మాట సంగతి.

10, జులై 2015, శుక్రవారం

మీకెప్పుడయినా ఇలాంటి ( పీడ ) కల వచ్చిందాండీ ? !


కింవాససైవం న విచారణీయం ,
వాస: ప్రధానం ఖలు యోగ్యతాయా:
పీతాంబరం వీక్ష్య దదౌ తనూజాం
దిగంబరం వీక్ష్య విషం సముద్ర:

‘నాకు బట్టల మీద అంత శ్రద్ధ లేదండీ, అయామ్ వెరీ సింపుల్. ’ అంటారు కొందరు కించిద్గర్వంగా. మేచింగుల కోసం , బట్టల సెలక్షన్ కోసం ఆడవాళ్ళు వెచ్చించే సమయం అంతా యింతా కాదు. గణితం వేస్తే గుండె

తరుక్కు పోతుంది. కొందరు మగవాళ్ళూ దీనికి మినహాయింపు కాదు. ఈ శ్లోకం గురించి చెప్పుకునే ముందు ఆ మధ్య నా కొచ్చిన గమ్మత్తయిన కల గురించి చెబుతాను వినండి. ఆ కల రావడం నిఝ్ఝంగా నిఝం సుమండీ ...
ఏదో ఓ మహా పట్టణంలో రోడ్డు మీద నడుస్తున్నాను. ఓ బట్టల షాపు ముందు పేద్ధ బోర్డొకటి కనిపించింది. దానిమీద ఏం రాసుందో నాకు మెళకువ వచ్చేక కూడా అక్షరం పొల్లు పోకుండా గుర్తుంది. చూడండి ...

రండి ! రండి !
యువకులారా ! యువతుల్లారా !

దయ చేయండి. మా వద్ద చిరిగినవీ, లెక్క లేనన్ని మాసికలు వేసినవీ, అట్ట కట్టి అలుగ్గుడ్డలా ఉన్నవీ, వెలిసి పోయినవీ, చీకి పోయినవీ, మీరే లెక్క పెట్టడానికి విసుక్కునేటన్ని జేబులు కలవీ అయిన రక రకాల కొత్త జీన్ ఫేంట్లు సరి కొత్త స్టాక్ వచ్చింది. త్వర పడండి. జీబురు గడ్డం వాళ్ళకీ, తల మాసిన వాళ్ళకీ , నిక్క బొడుచుకున్న తల వెండ్రుకలు కలవారికీ ప్రత్యేక డిస్కౌంటు కలదు. ఆలసించిన ఆశా భంగం ...

మరో క్షణంలో అక్కడ చేరిన వేలాది మంది కుర్రాళ్ళని కంట్రోలు చేయ లేక పోలీసులు లాఠీ చార్జి చేయడం జరిగింది. బాష్పవాయు ప్రయోగం కూడా జరిగింది. కుమ్ములాటలో అంతా కకావికలై పోయేరు. చాలా మందికి గాయాలయ్యాయి. నానా  గలాభా  జరిగిందక్కడ. ఆ వింత చూస్తున్న నా నుదుటి మీద కూడా ఓ దెబ్బపడడంతో మెళకువ వచ్చింది. ( మెలకువ వచ్చేక తెలిసింది. తలకి మంచం కోడు తగిలిందని )

ఇది సరదాకి రాసింది కాదు. నమ్మక పోతే నేనేం చేయను ? త్వరలో ఇలాంటి (పీడ) కలలు
మీకూ రావాలని ఉడుకుమోతుతనంతో శపించడం తప్ప ?

ఇక, శ్లోకం చూదాం ...

ఎలాంటి బట్టలు కట్టుకుంటేనేం అని అనుకోడం తగదు సుమా అని కవి హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే, లోకం లో ఒక మనిషి యోగ్యతను అతను వేసుకున్న బట్టలను బట్టే నిర్ణయించడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది.

క్షీర సాగర మథనం జరిగేటప్పుడు శ్రీ మహా లక్ప్మితో పాటు, కాలకూట విషం కూడా పుట్టిందని తెలిసిన విషయమే కదా ? అయితే, సముద్రుడేం చేసాడో చూడండి ...
పీతాంబరధారికి ( మహా విష్ణువుకి ) తన కూతురు రమని ఇచ్చేడు. దిగంబరుని (శివుడిని ) చూసి ఈ మొఖానికిది చాలునులే అన్నట్టుగా కాలకూట విషాన్ని ఇచ్చేడు.

లోకం ఇలా ఉందండీ బాబూ , ఏం చేస్తాం !

మహాత్మా గాంధీ ఓ సారి రౌండ్ టేబిలు సమావేశానికి గావంచా కట్టుకుని పై మీది కండువాతో వెళ్తే అక్కడ వాళ్ళతనిని పోల్చుకో లేక లోపలకి పోనివ్వకుండా తరిమేసారుట.
అప్పుడు గాంధీజీ మంచి సూటు బూటు వేసుకుని వస్తే ఆదరంగా లోపలికి పంపించేరుట. సరే, లోపలికి వెళ్ళాక, విందు మొదలయితే, గాంధీజీ ఆహార పదార్ధాలను తినడం మానేసి తొడుక్కున్న ఖరీదయిన కోటు మీద వేసుకోడం మొదలెట్టారుట. ఇదేం పిచ్చి పని అని అందరూ విస్తుపోతే  ఇక్కడికి రమ్మని ఆహ్వానం పంపింది నా కోటుకే కాని, నాకు కాదు కదా ! దాని విందు నేనెలా తింటాను ? అనడిగారట. అక్కడి అధికారులకి కొంచెం ఆలస్యంగా ట్యూబు లైటు వెలిగి, మహాత్ముని క్షమాపణలు వేడుకున్నారుట. ఈ కథ నిజమో కాదో కాని, చిన్నప్పుడు మా డ్రిల్లు మాష్టరు (ఆటలాడించడం మానీసి మరీ ) కథలు కాకరకాయలు చెప్పేటప్పుడు దీనిని మాకు చెప్పారు. 

ఈ కథలో గాంధీకి బదులు ఈశ్వర చంద్ర విద్యా సాగర్ అని సరిచేసుకోవాలని మిత్రులు  శ్రీ ఫణీంద్ర రామ కుమార్ వ్యాఖ్యలో చెబుతున్నారు. వారికి నా ధన్యవాదాలు !
  శ్లోక సందర్భానికి సరి పోతుందనిపించి చెప్పానంతే ...
(ఇక్కడ పొందుపరచిన కార్టూన్ గీసిన  వ్యంగ్య చిత్రకారునికి వందనాలు. పాపం, అతనికీ ఇలాంటి పీడ కల ఏదో వచ్చి ఉంటుంది ! )