మంచి మాట లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మంచి మాట లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, ఆగస్టు 2010, గురువారం

ఏ నిముషానికి ఏమి జరుగునో ... ...


మరు నిముషంలో ఏమి జరుగుగుతుందో మనకి తెలియదు. క్షణం మనది కాదు.

శ్లోకం చూడండి:

కాంతం ప్రాహ కపోతికా22కులతయా కాంతాంతకాలో2ధునా

వ్యాధో2ధో ధృతచాప పాణిత శర: శ్యేన: పరిభ్రామ్యతి

ఇత్థం సత్య2హినా స దృష్ట ఇషునా శ్యేనో2పి తేనాహత:

తూర్ణం తౌ తు యమాలయం పరిగతౌ దైవీ విచిత్రాగతి:

ఓ చెట్టు మీద పావురాల జంట కులాసాగా కాపురం చేస్తున్నది. ఇంతలో ఆడు పావురం మగనితో అంది కదా: ‘‘ ఓ ప్రియుడా ! మనకి లోకంలో ఇక నూకలు చెల్లిపోయేలా ఉంది. అంత్య కాలం దగ్గర పడినట్టుగా ఉంది. అదిగో, అలా చూడు ! బోయ ఒకడు బాణాన్ని ఎక్కు పెట్టి మన వేపే గురి చూస్తున్నాడు. పైన డేగ ఎగురు తోంది. ఇవే మనకి చివరి ఘడియలు ’’

ఆ కపోత మిధునం ప్రాణాల మీద ఆశ వదులుకుని ఊపిరి బిగ పట్టి మృత్యువు ఆసన్నమయిందని నిర్ణయించుకుని విషాదంతో క్షణాలు లెక్క పెట్టుకుంటున్నది.

ఇంతలో అనుకోని సంఘటన ఒకటి జరిగింది !

ఒక పాము జరజరా ప్రాకి వచ్చి, వేట గాడిని కరిచింది. వాడి బాణం గురి తప్పింది. తిన్నగా వెళ్ళి పైన ఎగురుతున్న డేగకి తగిలి, అది మరణించింది. పాము కాటుకి వ్యాధుడూ మృతి చెందాడు.

చూసారు కదా? కొద్ది క్షణాల తరవాత దొరక బోయే ఆహారాన్ని తలచుకుంటూ సంతోషంగా ఉన్న డేగ, బోయ ఇద్దరూ అకాలమృత్యు వాత పడ్డారు. చావు తథ్యమనుకున్న పావురాల జంటకి ఆ గండం గడిచింది.

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ .... అని లవకుశ సినిమాలో కవి ఈ తత్వం బాగా వంట పట్టించుకునే ఆ చరణం రాసాడు కదూ.

జీవితం క్షణ భంగురం అనే విషయం విస్మరించి అశాశ్వతాలయిన విషయాలను శాశ్వతాలని అనుకోవడం తగదు.

ఏవీ మన వెంట రావు.

చూడండి:

ధనాని భూమౌ, పశవశ్చ గోష్ఠే , నారీ గృహ ద్వారి, జన:శ్మశానే

దేహాశ్చితాయాం, పర లోక మార్గే కర్మానుగ: గచ్ఛతి జీవ యేక:

మనం జీవిత కాలంలో సంపాదించుకున్న ధనమంతా, మరణానంతరం మన వెంట రాదు.భూమి మీదనే ఉండి పోతుంది పశు సంపద కూడా పశువుల శాలలోనే ఉండి పోతుంది తప్ప కనీసం మన పార్ధివ శరీరాన్ని చూడడానికయినా రాదు. ఎంతో ప్రియమైన భార్యా మణి కూడా ఇంటి ద్వారం వరకూ తప్ప కనీసం శ్మశానం వరకూ కూడా రాదు. బంధు మిత్రులు పరేత నిలయ ప్రాంతం వరకూ మాత్రమే వస్తారు. మన వెంట కడదాకా రారు.

పిచ్చి మమకారంతో , గంధాదులు అలముకుని, ఎంతో జాగ్రత్తగా, మురిపెంగా , అపురూపంగా, చూసుకున్న మన దేహం చితి వరకూ మాత్రమే కదా వచ్చేది?

ఇక, పర లోక మార్గాన మనని వెన్నంటి వచ్చేది ఎవరయ్యా అంటే, మనం చేసిన కర్మ మాత్రమే

పుణ్య కర్మలు చేయడం వలన పుణ్య లోకాలకీ, పాప కర్మలు చేయడం వలన పాప లోకాలకీ పోతాం.

స్వర్గ నరకాల సంగతి ట్రాష్ అనుకున్నా, మంచి పనులను చేయాలనే భావనలో తప్పు లేదు కదూ?

ధర్మాన్ని ఆచరించడం కూడా ఎలాగంటే,

అజరామరవత్ ప్రాఙ్ఞొ విద్యా మర్ధం చ సాధయేత్

గృహీత ఇవ కేశేషు, మృత్యునా ధర్మ మాచరేత్

తెలివైన వాడు ముసలితనం, చావు లేని వాని వలె విద్యను సముపార్జిస్తూ, ధర్మాలను ఆచరిస్తూ ఉండాలి.

మృత్యువు జుత్తు పట్టి లాగుతున్నట్టుగా భావించి ( అంటే, మరు క్షణంలోనే చావు తప్పదనుకుంటూ) ధర్మాన్ని ఆచరించాలి.

అంటే రేపు, మాపు అంటూ వాయిదాలు వేయకుండా తక్షణమే ప్రారంభించి ధర్మ కార్యాలు చేస్తూ ఉండాలి.

చెప్పొచ్చావులే, గొప్ప ! ఇంతకీ, నువ్వు చేస్తున్న ధర్మ కార్యాలేమిటయ్యా, అని, నన్ను ఎవరయినా నిలదీసే ప్రమాదాన్ని శంకించి, చెబుతున్నాను:

తన యెఱిగిన యర్ధంబొరుఁ

డనఘా ! యిది యెట్లు సెప్పు మని యడిగినఁజె

ప్పని వాడును, సత్యము సె

ప్పని వాడును ఘోర నరక పంకమున బడున్ !

(నన్నయ )

తనకి తెలిసిన దానిని గురించి చెప్పమని ఎవరయినా అడిగితే చెప్పని వాడు, నిజం పలుకని వాడు ఘోరమైన నరకకూపంలో పడతాడని భారతం చెబుతోంది. అందుచేత, ఎందుకయినా మంచిదని ( ఎవరూ అడగక పోయినా) నాకు తెలిసినదీ ( ఏదో , సముద్రంలో నీటి బొట్టంత) , విన్నదీ, కన్నదీ, చదివినదీ, తెలిసినదీ, తెలుసుకున్నానని అనుకున్నదీ, అర్ధమయినదీ. అర్ధమయిందనుకున్నదీ చెప్పడం నా ధర్మం కనుక చెబుతున్నాను.

ఇక, ఈ టపా చదివి, పోనిద్దూ, అని ఊరుకోకుండా, బాగుందనో, బాగు లేదనో, కామెంట్ రూపంలో వెల్లడి చేయడం మీ కనీస ధర్మంగా భావించండి. ఆ ధర్మాన్ని ఆచరించి, పుణ్యలోకాలలో ( రంభా, ఊర్వశి, తిలోత్తమ, మేనక, ఘృతాచి ... ) సీటుని అడ్వాన్సుగా బుక్ చేసుకోండి. ఆపైన మీ యిష్టం. మళ్ళీ, చెప్ప లేదంటనక పొయ్యేరు ....

( ఈ రాతని లైట్ తీసుకోండేం?)

18, ఆగస్టు 2010, బుధవారం

వేటి వలన ఏవి శోభిస్తాయి ?



గత టపాలో ఏవి ఉంటే ఏవి ఉన్నట్లే అవుతుందో చూసాం. ( ఇక్కడ చూడండి) ఇవాళ ఏవి ఉండడం వలన వేటికి శోభ కలుగుతుందని పెద్దలు చెప్పారో చూదాం ...

ఐశ్వర్యస్య విభూషణం సుజనతా శౌర్యస్య వాక్సంయమ:
ఙ్ఞానస్యోపశమ: శ్రుతస్య వినయో విత్తస్య పాత్రే వ్యయ:
అక్రోధ స్తపస: క్షమా ప్రభవితు ర్ధర్మస్య నిర్వ్యాజతా
సర్వస్యాపి హి సర్వ కారణ మిదం శీలం పరం భూషణమ్ .

ఐశ్వర్యం వల్ల ఏది శోభిస్తుంది ? మంచితనం. ( సంపదకు మంచి తనమే అలంకారం. )
పరాక్రమం దేని వలన శోభిస్తుంది ? మాట మంచితనం ( ఎంత పరాక్రమం ఉన్నా, మాట కరుకుదనం వల్ల వ్యక్తి శోభించడు.)
ఙ్ఞానం దేని వలన శోభిస్తుంది? శాంతం వలన ( శాంతం లేని వివేకం వృథాయే కదా)
పాండిత్యానికి అలంకారం ఏది ? వినయం
ధనం ఉన్నందుకు ఏది చేయడం వల్ల శోభ కలుగుతుంది ? పాత్రత నెరిగిన దానం
తపస్సునకు ఏది అలంకారంగా భాసిస్తుంది ? సహనం. కోపం లేక పోవడం (క్రోధిగా తపస్వికిఁజన్నే? అని భారతం చెబుతోంది.)
సమర్ధునకి శోభనిచ్చే ముఖ్య లక్షణం ఏది ? క్షమా గుణం
ధర్మమునకు శోభని కలిగించేది ఏది ? నిర్మోహత్వం ( దేనిమీద ఎక్కువ మమకారం లేక పోవడం)
సమత వలన ఏమి కలుగుతుంది ? తేజస్సు.

తక్కిన ఏ గుణాలు ఉండనీ, లేక పోనీ, మంచి నడవడిక మాత్రం సమస్త జనులకూ శోభని ఇస్తుంది.

ఈ విధంగా పెద్దలు శీల వర్తనకి పెద్ద పీట వేసారు.

17, ఆగస్టు 2010, మంగళవారం

ఇవి ఉంటే అవి అక్కర లేదు !!


క్షాంతిశ్చేత్ కవచేన కిం కిమరిభి: క్రోధో2స్తి చేద్దేహినాం,
ఙ్ఞాతిశ్చే దనలేన కిం యది సుహృద్దివ్యౌషధై: కిం ఫలం,
కిం సర్పైర్యది దుర్జనా: కిము ధనైద్విద్యా2నవద్యా
వ్రీడా చేత్ కిము భూషణై: సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్ ?

ఏవి ఉంటే ఏవి అక్కర లేదో ఒక కవి ఈ శ్లోకంలో చక్కగా వివరించాడు. చూడండి ...

ఓర్పు కల వానికి వేరే కవచం అక్కర లేదు.( ఆ సహనమే అతనిని కాపాడుతుంది.)
కోపం కల వానికి వేరే శత్రువులెవరూ ఉండనక్కర లేదు.( ఆ కోపమే అతడిని నాశనం చేస్తుంది.)
దాయాదులు ఉంటే వేరే అగ్ని అక్కర లేదు. ( ఆదాయాదులే మన కొంపకి చిచ్చు పెడతారు.)
మంచి మిత్రులున్న వారికి వేరే గొప్ప ఔషధాలతో పని లేదు( వారే మనని మంచి మార్గంలో నడిపిస్తారు. ఆరోగ్యకరమైన ఆలోచనలు అందిస్తారు)
దుష్టులు ఉండగా వేరే విష సర్పాలతో పనేముంది ? ( వాళ్ళే పాముల వంటి వారు)
మంచి విద్య ఉన్న వారికి వేరే గొప్ప నిధులు ఎందుకు ? ( విద్యా ధనమే తరగని సంపద కదా)
లజ్జ కలిగిన వారికి వేరే ఆ భరణాలు ఎందుకు ? ( సిగ్గే కదా చక్కని సింగారం?)
కవితా శక్తి కల వారికి వేరే రాజ్యమెందుకు ? ( రాజ్యభోగం కన్నా కవితా శక్తి గొప్ప కీర్తిదాయకం కదా)

అదీ సంగతి !

మరో టపాలో ఏవి ఉంటే ఏవి శోభిస్తాయో చూదాం.

13, ఆగస్టు 2010, శుక్రవారం

ఏవి అసలైన పూజా పుష్పాలు?


తెలుగు నాట భక్తి రసం
తెప్పలుగా పారుతోంది
డ్రైనేజీ స్కీము లేక
డేంజరుగా మారుతోంది ...

అని, కవి గజ్జెల మల్లారెడ్డి ఏనాడో హెచ్చరించారు. భక్తి భావం మంచిదే కానీ, భక్తిని ప్రదర్శించు
కోవడం కోసం చేసే చేష్టలు మాత్రం సమర్ధించ దగినవి కావు. వీర భక్తునిగా, లేదా భక్తురాలిగా అందరి దృష్టినీ ఆకర్షించడం కోసం కొందరు వేసే వేషాలూ, పోయే పోకడలూ చిత్రంగా ఉంటాయి.
నిశ్చలమైన భక్తి భావంతో భగవంతుని సేవించే వాడే నిజమైన భక్తుడు. చిత్త శుద్ధి లేని శివ పూజ లెందుకని ప్రజా కవి వేమన నిలదీసినది అందుకే. చిత్తం చెప్పుల మీద ఉన్నంత వరకూ ఎంత గొప్ప పూజలు చేసినా వ్యర్ధమే కదా?
సరే, ప్రస్తుతానికి వస్తే , నేను చెప్ప దలచినది ఏమంటే, భగవంతుడిని ఏ పూలతో పూజించాలి? ఈ ప్రశ్న వచ్చినప్పుడు మన వాళ్ళు కొన్ని పూలను పూజకు అనర్హమైనవిగా ప్రకటించి, నిషేధం విధించారు. ఆ విధంగా పాపం, పుష్ప జాతిలో కొన్ని పూలు ధేవుని పూజకు పనికి రాకుండా పోయాయ్.

ఐతే, నిజానికి భగవంతుడిని మనం ఏ పూలతో పూజ చేయాలో తెలుసా?

క్రింది శ్లోకంలో భగవంతునికి ( శ్రీ మహా విష్ణువుకి) అత్యంత ప్రియమైన పువ్వులు ఎనిమిది రకాలని ఓ కవి చెబుతున్నాడు.

ఆ ఎనిమిది రకాల పువ్వులూ ఏవంటే ...

అహింసా ప్రథమం పుష్పం , పుష్ప మింద్రియ నిగ్రహ:
సర్వభూత దయా పుష్పం , క్షమా పుష్పం విశేషత:

శాంతి: పుష్పం , తప: పుష్పం , ధ్యానం పుష్పం తథైవ చ,
సత్య మష్టవిధం పుష్పం , విష్ణో: ప్రీతికరం భవేత్

విష్ణువుకి ( భగవంతుడికి) మిక్కిలి ప్రతీకరములయిన పువ్వులు ఎనిమిదీ ఏవంటే,
అహింస , ఇంద్రియ నిగ్రహం , జీవ దయ , క్షమ , శాంతి , తపస్సు , ధ్యానం , సత్యం.

ఇవీ ఆ పువ్వులు !!

వేరే ఏ పూలతో పూజించినా, దేవ దేవుడు సంప్రీతుడు కాడు సుమా !

వెర్రి మొర్రి చేష్టల వీర భక్తులు , భక్త నట సామ్రాట్టులు , కుహనా భక్త శిఖామణులు, ఆలోచించ వలసిన విషయమే కదూ, యిది?

11, ఆగస్టు 2010, బుధవారం

ముఠా కవులు


స్వాధీనో రసనాంచల: పరిచితా: శబ్ధా: కియంత: క్వచిత్
క్షోణీంద్రో న నియామక: పరషదశ్శాంతా: స్వతంత్రం జగత్
తద్యూనం కవయో వయం వయమితి ప్రస్తావనాహుంకృతిం
స్వచ్ఛందం ప్రతిసద్మ గర్జత వయం మౌనవ్రతావలంబిన:

(సాహిత్య శేఖరం)

నోటికి తలుపుల లేవు. ఏమైనా వాగ వచ్చును. ఏవో కొద్ది మాటల పరిచయం ఉంది.వద్దనే వాళ్ళు లేరు. శాసించే ప్రభువు లేడు. పండిత పరిషత్తులూ మూలన పడ్డాయ్. అంచేత పండితులైన వారు ఎదురు చెప్ప లేక నోరుమూసుకుని ఉండి పోతున్నారు. ఎవరికి వారు స్వేచ్ఛగా ఉండడానికి యిష్ట పడతారు కదా. అందు చేత మీరంతా మేం కవులం ! మేమే కవులం!!
అంటూ, అడ్డూ ఆపూ లేకుండా నోటికి వచ్చినట్టుగా ఇల్లిల్లూ మారు మ్రోగి పోయేలాగ అరుస్తున్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితులలో మా వంటి వారు ఇక మౌనవ్రతం అవలంబించడం కన్నా వేరే దారి ఏముంది ?

కవి ముఠాలు, లేదా, ముఠా కవులు అన్ని కాలాలలోనూ ఉండేవి / ఉన్నారు కాబోలు. ఈ శ్లోకం చూస్తే అదే అనిపిస్తున్నది. కావు కావుమని కాకులు అరచి ఊదరగొడుతూ ఉంటే, కోకిలలు బిక్కచచ్చిపోయి ఉండి పోక తప్పదేమో.

9, ఆగస్టు 2010, సోమవారం

ఏది సత్యం ? ఏదసత్యం ? ఓ మహాత్మా , ఓ మహర్షీ !


కో లాభో గుణి సంగమ: కిమ సుఖం ప్రాఙ్ఞేతరై స్సంగతి:
కా హాని స్పమయచ్చుతి: నిపుణతా కా ధర్మతత్త్వే రతి:
కశ్శూరో విజితేంద్రియ: ప్రియతమా కా2నువ్రతా కిం ధనం
విద్యా కిం సుఖ మప్రవాసగమనం రాజ్యం కిమాఙ్ఞాఫలమ్

ఈ శ్లోకంలో కొన్ని మంచి ప్రశ్నలూ, వాటికి ప్రత్యుత్తరాలూ ఉన్నాయి. అన్నీ ఆచరించ తగినవే. అనుభవ సిద్ధులు చెప్పినవే. జీవిత సారమంతా కాచి వడ బోసి నిగ్గు తేల్చిన నిజాలే. చూడండి..

ఏది లాభకరం?
మంచి వారితో సాంగత్యం.

ఏది సుఖకరం కాదు?
మూర్ఖులతోడి చెలిమి.

ఏది ఆత్మహాని?
ఇచ్చిన మాట నిలబెట్టుకో లేక పోవడం

ఏది నిపుణత?
ధర్మం తు.చ తప్పక పాటించడం

ఎవడు శూరుడు?
ఇంద్రియాలను జయించిన వాడు

ఎవతె ప్రియమైన చాన ?
అనుకూలవతి అయిన భార్య

ఏది వెలలేని సంపద?
విద్య

ఏది సుఖం?
దేశాలు పట్టి పోకుండా ఉన్న చోటనే ఉండడం

ఏది రాజ్యం?
తన మాట ఎంత వరకు చెల్లుబాటు అవుతుందో, అంత మేర తన రాజ్యమే.

8, ఆగస్టు 2010, ఆదివారం

వాళ్ళంతే, మరి ...





























ప్రియ: ప్రజానాం దాతైవ నపున:ద్రవిణేశ్వర:
అగచ్ఛన్ కాంక్ష్యతే లోకై ర్వారిదో నతు వారిధి:

వారిదము (మేఘము) వారిధి (సముద్రము)
వారిదం ఎప్పుడూ నీటిని ఇస్తుంది. దానికి తీసికోవడం తెలియదు.
వారిధికి ఎప్పుడూ తీసి కోవడమే తెలుసు. దానికి ఇవ్వడం తెలియదు.

కొందరంతే కదా, పుచ్చు కోవడమే తెలుస్తుంది కాని ఇవ్వడం తెలియదు. ఎప్పుడూ ఇతరుల సాయం పొందడమే కాని వారికి ఇతరులకి ఒక్క సారయినా సాయం చేయాలనిపించదు.

7, ఆగస్టు 2010, శనివారం

శేషం కోపేన పూరయేత్ !!


ఫ్రశ్నించడం మానవ నైజం, అది నైజమే కాదు; హక్కు కూడా. నిలబెట్టి అడిగితేనే కదా, నిజాల నిగ్గు తేలేది? ప్రశ్నించడం లోనుండే కదా, ప్రగతి ప్రభాత కిరణాలు పొడసూపేది?

కాదంటే ఎలా ? కోపగిస్తే ఎలా ? ఎందుకు? అనడిగే వారుంటేనే కదా, ఎందుకో తెలిసేది ?

అలా అడిగిన సందర్భాలు కొన్నింటిని ఇక్కడ చూదాం ...

అన్నమయములైన వన్ని జీవమ్ములు
కూడు లేక జీవ కోటి లేదు
కూడు తినెడి కాడ కుల భేద మేలకో?
కాళికాంబ ! హంస ! కాళికాంబ !

(కాళికాంబ శతకం - పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి)

లోకాన జీవ రాసులన్నీ తిండి తిని బతికేవే. తిండి లేక పోతే జీవ కోటి ఉనికే లేదు. మరి, మన మానవులలో తిండి తినేటప్పుడు కుల భేదం ఎందుకు చూపుతారో, తెలియదు.

ఎక్కడి మంత్రతంత్రము లవెక్కడి చక్రము లేడ పాచికల్
ఎక్కడి జ్యోతిషంబులవి యెక్కడి హేతువు లేడ ప్రశ్నముల్ ?
తక్కిడి గాక, పూర్వ కృత ధర్మ సుకర్మమె నిశ్చయంబు పో
పెక్కురు పొట్ట కూటికిది వేషమయా శరభాంక లింగమా !

మంత్రాలంటావు , తంత్రాలంటావు ! అన్నీ ఒట్టి అబద్ధాలు. చక్రాలు వేస్తావు.భవితవ్యాన్ని చెబుతానంటావు. పాచికలతో పరమార్ధం తెలిసి పోతుందంటావు. జ్యోతిషం చెబుతావు, జరిగినదీ, జరగబోయేదీ .. అంతా ట్రాష్. హేతువులంటావు, ప్రశ్నలు అడిగితే కనులు అరమోడ్చి, ఎక్కడికో వెళ్ళి పోయినట్టు అభినయించి, ఠక్కున భూత భవిష్యద్వర్తమానాలకు చెందిన వాటి గురించి జవాబులు చెబుతానంటావు. ఇదంతా మోసం. దగా. కుట్ర. మనం చేసుకున్న ధర్మాల పుణ్యమే సత్యం (?) ఈ మంత్రాలూ, తంత్రాలూ, చక్రాలూ, పాచికలూ, ప్రశ్నలు వేయడాలూ, జ్యోతిషాలు చెప్పడాలూ, అన్నీ కొంత మంది పొట్ట పోసుకోవడం కోసం వేసే వేషాలు తప్ప మరొకటి కాదు. అది నిజం. అంటాడు శరభాంకుడు.

ధూమ కేతువు కేతువనియో
మోము చందురు డలిగి చూడడు
కేతువా యది ? వేల్పు లలనల
కేలి వెలితొగ కాంచుమా !

అరుదుగా మిను చప్పరంబున
చొప్పు తెలియని వింత పొడమగ
చన్న కాలపు చిన్న బుద్ధులు
బెదిరి యెంచిరి కీడుగా ...

అంటూ తోక చుక్క కనిపించడం అనర్ధదాయకంగా భావించడాన్ని గురజాడ నిరసించాడు.
అదంతా కవుల కల్పన అన్నాడు. తోక చుక్క భూమికి దూరపు చుట్టం అని చెప్పాడు. దారిన పోతూ చుట్టపు చూపుగా చూసి పోయే తోక చుక్క గురించి ఆందోళన ఎందుకని అడిగేడు.

తుదకు, వర్ణ భేదాలు చెరిగి పోయి, మతము లన్నీ మాసి పోయి,తెలివి ఒక్కటే నిలిచి వెలుగుతుందనీ, ఎల్ల లోకం ఒక్క ఇల్లవుతుందనీ ఆశించేడు. కవి కామన ఇంకా సుదూర తీరం లోనే ఉన్నట్టుంది. అదలా ఉంచండి ...
ప్రశ్నించే సోక్రటీస్ ను, కందుకూరిని, రాజారామ మోహనుడిని, త్రిపురనేనిని ... ఇలా చాలా మందిని ఒక్క సారి స్మరించుకుని, మరి రెండు మూడు సంధించిన ప్రశ్నాస్త్రాలను కూడా చూదాం,

పశుశ్చే న్నిహిత: స్వర్గం , జ్యోతిష్ఠోమే గమిష్యతి,
స్వపితా యజమానేన, తత్ర కస్మా న్న హింస్యతే

స్వర్గం లభించాలని, యాగ పశువులను బలి చేస్తున్నావు. అవి నేరుగా స్వర్గానికే పోతాయని దబాయిస్తున్నావు. మరయితే, నోరు లేని ఆ జీవాలను బలి పేరిట చంపడం కన్నా, యాగంలో స్వయంగా నీ తండ్రి గారినే బలి ఇవ్వరాదూ ? చక్కా, సరాసరి స్వర్గానికి పోతాడు కదా ? అలా ఎందుకు చేయవయ్యా ?

స్వర్గ: క ర్తృ క్రియా ద్రవ్య , వినాశో యజ్వనాం,
తతో దావాగ్ని దగ్ధానాం , ఫలం స్యాద్భూరి భూరుహామ్

యఙ్ఞం లో సమిధలు, ఆజ్యం లాంటి హోమ ద్రవ్యాలను ఎన్నింటినో వ్రేల్చుతావు. అవి హుతమై, మీది కెగిసి, నీకు స్వర్గాన్ని ఇస్తాయంటావు ? తెలిక అడుగుతానూ , అలా చేయడం వల్ల నీకే స్వర్గం వస్తే, అడవిలో కార్చిచ్చు
చెల రేగినపుడు ఎన్నో చెట్లు అగ్నికి ఆహుతయి పోతూ ఉంటాయి. వాటన్నింటికీ అదే స్వర్గ ఫలం వస్తుందంటావా?

మృతానామపి జంతూనాం , శ్రాద్ధం చే తృప్తి కారణమ్
నిర్వాణస్య ప్రదీపస్య, స్నేహ: సంవర్ధయేచ్ఛిఖామ్

చచ్చిన వారికి పిండాలు పెట్టి, శ్రాద్ధ కర్మలు చేస్తే ఆ మృతులకు తృప్తి కలుగుతుందంటావు. మరయితే, ఆరి పోయిన దీపం నూనె పోయగానే వెలిగించకుండానే వెలగాలి కదా ?

(మీది మూడు శ్లోకాల కర్త కృష్ణ మిశ్రుడు - ప్రబోధ చంద్రోదయం)

ఇది చార్వాకం. వీటికి మన వాళ్ళు ఘూటుగానే జవాబులు చెప్పారనుకోండి ... ఏమయినా, నిలదీసి అడిగితేనే కదా, నిజాల నిగ్గు తేలేది?

జవాబులు చెప్పలేని చిక్కు ప్రశ్నలే అడిగాడనుకో, ఈ సూత్రం ఎలానూ ఉంది:
శేషం కోపేన పూరయేత్ ! ... ... ...




6, ఆగస్టు 2010, శుక్రవారం

మా ఇంటి కొస్తే నాకేం తెస్తావ్ ? మీ ఇంటి కొస్తే నాకేం ఇస్తావ్ ?


పుణ్యస్య ఫల మిచ్ఛంతి , పుణ్యం నేచ్ఛంతి మానవా:
న పాపఫల మిచ్ఛంతి , పాపం కుర్వంతి యత్నత:

మనుషులెంత గడుసరి వారో చూడండి. పుణ్యం చేయడానికి ఎంత మాత్రం ప్రయత్నం చేయరు. కాని పుణ్యం వలన వచ్చే ఫలితం మాత్రం తమకి దక్కాలని తెగ ఆరాట పడి పోతూ ఉంటారు.
నిత్యం అనేక పాపాలు చేస్తూనే ఉంటారు కానీ, ఆ పాప ఫలితం మాత్రం తమకు రాకూడదని కోరుకుంటూ ఉంటారు ! ఎంత విపరీతమో చూడండి

దీనిని గడుసుదనం అనాలో, స్వార్ధం అనాలో మనమే నిర్ణయించుకోవాలి.

మా ఇంటి కొస్తే నాకేం తెస్తావ్ ? మీ ఇంటి కొస్తే నాకేం ఇస్తావ్ ? అనడం లాంటిదే
కదూ ఇది !

దేశం నాకేమిచ్చింది ? అనుకోడం మాని, దేశానికి నేనేమి ఇచ్చాను ? అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలని పెద్దలు ఘోషించేది ఇందుకేనండీ బాబూ ! ...

28, జులై 2010, బుధవారం

కోపం తన్నుకొస్తోందా ; పది లెక్క పెట్టండి ....


సహసా విదధీత న క్రియా, మవివేక: పరమాపదాం పదం
వృణుతేహి విమృశ్యకారిణమ్ , గుణలుబ్ధా: స్వయమేవ సంపద:

ఈ శ్లోకం ఏం చెబుతోందంటే , ఏ పనీ తొందర పడి చేయ కూడదు. తొందర పాటు , అవివేకమే అన్ని అనర్ధాలకూ మూలం. చక్కగా ఆలోచించి చేసిన పనికి
ఏ ఆటంకాలూ రావు. అట్టి వానిని సంపదలు తమంతట తామే వచ్చి చేరుతాయి. లక్ష్మి గుణ లుబ్ధ కదా ? అంటే మంచి గుణాలపట్ల ప్రీతి కలది కదా !

ఈ శ్లోకాన్ని ఆధారం చేసుకుని ఓ కథ ప్రచారంలో ఉంది.
అదేమిటంటే ...
కిరాతార్జునీయమ్ కావ్యం రచించిన భారవి గురించిన కథ. భారవికి ఎంత పేరు ప్రఖ్యాతులు వస్తున్నా, అతని తండ్రి మాత్రం ఎప్పుడూ అతని గొప్పతనాన్ని అతని ఎదుట పొగుడుతూ ఒక్క మంచి మాట కూడా అనే వాడు కాదుట ! దీనితో భారవికి కోపం వచ్చి , తండ్రిని అంతం చేయాలనుకున్నాడుట. ఆలోచించి ఓ రాత్రి ఇంట్లో అటక మీదికి ఎక్కి , ప్రక్కనే ఓ బండ రాయి పెట్టుకుని అదను కోసం చూస్తూ కూర్చున్నాడుట. ఇంతలో తల్లిదండ్రుల సంభాషణ అతని చెవిని పడింది.

తల్లి : ‘‘ మన భారవిని లోకమంతా అంత గొప్ప కవి అని పొగుడుతూ ఉంటే, మీరు మాత్రం ఒక్కసారీ మెచ్చు కోవడం లేదు ! వాడెంత బాధ పడుతున్నాడో తెలుసా ? ...’’

తండ్రి : ‘‘ అమాయకురాలా ! మన భారవి నిజంగా చాలా గొప్ప కవి. అతని కవిత్వం మహాద్భుతం. అందరూ పొగుడుతున్నట్టుగా తండ్రినయిన నేను పొగడ కూడదు. అది వాడికి క్షేమకరం కాదు.అందుకే పొగడడం లేదు. తండ్రి పొగడ్త బిడ్డలకి ఆయుక్షీణం అంటారు. అంతే కానీ వాడన్నా , వాడి కవిత్వమన్నా నాకెంత ఇష్టమో తెలుసా ? ...’’

దీనితో భారవి గుండె బరువెక్కింది. కిందకి దిగి వచ్చి, తన అపరాధాన్ని మన్నించమని తండ్రిని వేడుకుని, తనకి తగిన శిక్ష వేయమని కోరేడు.

పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని తండ్రి ఎంత చెప్పినా విన లేదు. దానితో తండ్రి భారవిని ఒక యేడాది పాటు అత్త వారింటిలో గడపి రమ్మని శాసించాడు.

శిక్ష వేయమంటే తండ్రి వరమిచ్చాడనుకుంటూ పొంగి పోతూ భారవి భార్యా పిల్లలతో పాటు అత్త వారింటికి చేరాడు.

తొలి రోజులు బాగానే గడిచాయి. అత్త వారింట భారవికి మంచి మర్యాదలే జరిగాయి. కాని రోజులు గడిచే కొద్దీ అతనికి ఆ ఇంట గౌరవాదరాలు తగ్గి పోయాయి. అంతా చాలా హేయంగా చూడ సాగారు. భారవికి భరించ లేనంత అవమానంగా ఉంది. కానీ ఏడాది శిక్షాకాలం గడపాలి కనుక, పంటి బిగువున కాలం గడపసాగేడు.

ఇలా ఉండగా అతని భార్య శుక్రవారం వరలక్ష్మి నోము నోచుకుంటాననీ, దానికి ఏర్పాట్ల కోసం కొంత డబ్బు ఇమ్మనీ అడిగింది.

భారవి దగ్గర చిల్లి గవ్వ లేదు. ఆలోచించి, తను వ్రాసిన కిరాతార్జునీయమ్ కావ్యం లోని ఒక శ్లోకం ఉన్న తాటాకును తీసి భార్యకు ఇచ్చి ఏ ధనవంతుని దగ్గరయినా దానిని కుదువ పెట్టి డబ్బు తెచ్చుకో మని చెప్పాడు. ఆమె దానిని ఓ ధనవంతుని ఇంట కుదువ పెట్టి అతడిచ్చిన పైకంతో నోము నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంది.

ఇలా ఉండగా, ఆ ధనవంతుడు ఆమె ఇచ్చిన శ్లోకం వ్రాసి ఉన్న తాటాకుని ఎక్కడ పెడదామా అని ఆలోచించి , చివరకి తన కత్తి ఒరలో దానిని కత్తితో పాటు భద్రంగా ఉంచి , గూట్లో పెట్టాడు. ఆ తర్వాత అతను వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళి పోయి, చాలా ఏళ్ళకి ఇంటికి వచ్చేడు.




వస్తూనే తన రాకతో భార్యకి విభ్రమం కలిగించాలనే చిలిపి ఆలోచనతో ఇంటి వెనుక వేపు ద్వారం లోనుండి ఇంట్లోకి ప్రవేశించాడు.
అక్కడ తమ పడక గదిలో భార్యతో పాటు మరో యువకుడు కూడా సన్నిహితంగా ఉండడం గమనించి, కోపంతో ఊగి పోయాడు. భార్యనీ , ఆ యువకుడినీ చంపెయ్యాలని అనుకుని క్రోధంతో గూటి లోనుండి కత్తిని తీసాడు. సర్రున కత్తి లాగుతూ ఉంటే దానితో పాటు ఓ తాటాకు కూడా బయట పడింది. దాని సంగతే అతను మరిచి పోయాడు. ఏమిటా అని ఆసక్తిగా చదివాడు.

అదే, మీద చెప్పిన శ్లోకం !

ఒక్కక్షణం తటపటాయించేడు. ఇంతలో భార్య లేచి, భర్తని చూసి ఆనందంతో పలకరిస్తూ ఆ యువకుడిని పరిచయం చేసింది. ఆ యువకుడు వారి కుమారుడే. ఆ ధనవంతుడు విదేశాలకు వెళ్ళే సమయంలో అతని భార్య నెల తప్పింది. ఆ తర్వాత ఆ కొడుకు పుట్టాడు. క్రోథావేశంలో ఆ సంగతి కూడా విస్మరించి నందుకు ఆ ధనవంతుడు చాలా సిగ్గు పడ్డాడు.

పెను ప్రమాదం నుండి తన భార్యనీ , కుమారుడినీ కాపాడినందుకు , తను క్రోథావేశంతో నేరం చేయకుండా రక్షించినందుకు అతనికి ఆ శ్లోక రచయిత భారవి పట్ల అపారమయిన గౌరవాదరాలు కలిగి, మరుచటి దినమే ఆ మహా కవిని దర్శించుకుని గొప్ప కానుకలు సమర్పించుకున్నాడు.
భారవి శిక్షా కాలం కూడా ఆ దినంతో ముగియడంతో అతను ఆ అపూర్వ ధన రాసులతో, భార్యా బిడ్డలతో తిరిగి తన తల్లిదండ్రుల చెంతకు ఆనందంగా చేరాడు.

చక్కగా ఆలోచించి చేసే పనికి ఏ ఆటంకమూ రాదు. వేయి విధాలుగా ఆలోచించి కార్యాలు చేయని వాడు గొప్ప ఆపదల పాలవుతాడు. ఆలోచించి చేసే వాడిని లక్ష్మి వరిస్తంది. అని ఈ శ్లోకార్ధం నిత్య సత్యం కదూ !

అందుకే కదా, కోపం తన్నుకొస్తూ ఉంటే , పది అంకెలు లెక్క పెట్టమని మని పెద్దలు చెప్పారు ....
రెడీ ... ఒన్ ... టూ ... త్రీ ... ఫోర్ ....!!

25, జులై 2010, ఆదివారం

వాళ్ళని మరి మార్చ లేం !


దుర్జనేన సమం వైరం , ప్రీతించాపి న కారయేత్
ఉష్ణో దహతి చాంగార: శీత: కృష్ణాయతే కరమ్

దుర్జనులతో విరోధమూ వద్దు.స్నేహమూ వద్దు. బొగ్గులు చల్లగా ఉన్నప్పుడు చేతులను మసి చేస్తాయి. వేడిగా ఉన్నప్పుడు చేతులను కాలుస్తాయి. అది బొగ్గుల నైజం. దుష్టుల స్వభావమూ అంతే. మైత్రి లోనూ విరోధం లోనూ కూడా అపకారమే చేస్తారు సుమా !

27, మే 2010, గురువారం

కదిలేదీ , కదిలించేదీ ....


జ్వలతి చలితేన్ధనోZగ్ని:
విప్రకృత: పన్నగ: ఫణం కురుతే
ప్రాయ: స్వం మహిమానం
క్షోభాత్ ప్రతిపద్యతే హి జన:


ఇది మహా కవి కాళి దాసు రచించిన అభిఙ్ఞాన శాకున్తలమ్ నాటకంలో ఆరవ అంకం లోని శ్లోకం.
దూర్వాస మహా ముని శాపం వలన దుష్యంతుడు శకుంతలను మరచి పోతాడు. తిరిగి అభిఙ్ఞాన దర్శనంతో శకుంతల గుర్తుకు వచ్చి ఖిన్నుడై ఉంటాడు. నిస్తేజుడై ఉంటాడు. పరిపాలనా విముఖుడై ఉంటాడు. అట్టి మహా రాజుని రాక్షస సంహారార్ధం ఇంద్రుని పనుపున ఇంద్రలోకానికి తీసుకుని వెళ్ళడానికి ఇంద్ర రథ సారధి మాతలి వచ్చి, రాజునకు ఆగ్రహం తెప్పించడం కోసం అతని నర్మ సచివుడు మాఢవ్యుని బాధిస్తాడు.
దానితో రాజునకు ఆగ్రహం కలిగి తిరిగి కర్తవ్యోన్ముఖుడవుతాడు....ఆ సందర్భంలో కవి చెప్పిన శ్లోకం యిది ....

చితుకులు కదిలిస్తే అగ్ని మరింతగా జ్వలిస్తుంది. అపకారం చేయబోతే పాము పడగ విప్పుతుంది. మనిషి కూడ క్షోభ కలిగినప్పుడే తన శక్తి సామర్ధ్యాలు ప్రదర్శిస్తాడు.

ప్రతి మనిషిలోను అంతర్గతమైన శక్తులు చాల ఉంటాయి. అయా ప్రత్యేక పరిస్థితులు కలిగినప్పుడు అవి వెలుగు చూస్తాయి. వ్యథ లోనుండే కదా కథలు ఉద్భవిస్తాయి. వాల్మీకి విషయంలో ఏం జరిగిందో తెలిసిందే కదా? శోకమే శ్లోకమై ఒక మహా కావ్య ప్రాదుర్భవానికి నాంది పలకలేదూ!




‘ కదిలేదీ కదలించేదీ కావాలోయ్ నవ కవనానికి ...’ అని శ్రీ.శ్రీ గారనడంలో కూడ అంతరార్ధం యిదే కదా?






కాళి దాసు శ్లోకానికి కందుకూరి వీరేశ లింగం పంతులు గారు చేసిన పద్యానువాదం కూడ చూడండి మరి ....

చితుకులు కదల్చుటను చెలగి మండు
చెడఁగు చేయుటచేఁబాము పడగ విప్పు
మఱియు క్షోభంబు వలననె మానవుడును
దనదు మహిమంబు చూపును తథ్యముగను.

స్వస్తి.



21, మే 2010, శుక్రవారం

పట్టు పట్ట రాదు, పట్టి విడువ రాదు .....

మన పూర్వ కవులు మన వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దు కోడానికి ఎన్ని గొప్ప విషయాలనో మంచి మంచి శ్లోకాలలో చెప్పారు.
మంచి మాట అనే టపాలో వీలున్నప్పుడల్లా మీతో పంచుకోవాలనే ప్రయత్నంతో ...

చూడండి ...








సింహ: శిశురపి మదమలిన కపోల భిత్తిషు గజేషు
ప్రకృతిరియం సత్త్వవతాం న ఖలు వయస్తేజసాం హేతు:

విదిలింప వుఱుకు సింగపుఁ
గొదమయు మద మలిన గండ కుంజరములపై
నిది బలశాలికి నైజము
గద ! తేజోనిధికి వయసు కారణమగునే ?

సింహం పిల్ల కూడ రెచ్చ గొడితే ఊరు కోదు. మద గజం మీదనయినా పడి తన సత్తా చాటుతుంది. ఇది బలవంతునికి నైజ గుణం కదా ! తేజోవంతునికి వయసుతో పని లేదు.

ప్రకృతిలో సకల చరాచరాలూ ఈ లక్షణాన్నే కలిగి ఉంటాయి. చూడండి ...

ఛిన్నోZపి రోహతి తరు: క్షీణోప్యుపచీయతే పునశ్చంద్ర:
ఇతి విమృశన్తస్సన్త: సన్తప్యన్తే నవిప్లుతాలోకే



ఖండితంబయ్యు భూజంబు వెండి మొలచు
క్షీణుఁడయ్యును నభివృద్ధిఁజెందు సోముఁ
డివ్విధమున విచారించి యొడలుఁదెగిన
జనములనుఁదాప మొందరు సాధు జనులు.

చెట్టుని చూడండి. నరికినా తిరిగి చిగురిస్తుంది. చంద్రుడూ అంతే కదా? కృష్ణ పక్షంలో కళలు క్షీణించినా, తిరిగి శుక్ల పక్షంలో పుంజుకుని, పూర్ణిమ నాటికి నిండే జాబిల్లిగా అవతరిస్తాడు. ఇలాగే సాధు జనులు ఓటమిని , ఆపదని, గాయాలను సరకుగొనరు. తిరిగి లేచి తమ ప్రతాపం చూపెడతారు.

ఇదే విషయం ఒక మంచి పోలికతో చెబుతున్నాడు కవి ...

యథా కందుక పాతే నోత్పతత్యార్య: పతన్నపి
తథా త్వనార్య: పతతి మృత్పిండ పతనం యథా



కందుకము వోలె సుజనుడు
గ్రిందంబడి మగుడ మీఁదికిన్నెగయుఁజుమీ !
మందుడు మృత్పిండము వలె
గ్రిందబడి యడగి యుండుఁగృపణత్వమునన్

బంతి నేలకేసి కొడితే ఎలా తిరిగి మీదికి లేస్తుందో, సజ్జనుడు కూడ ఒక వేళ ఓటమి పాలయినా, తిరిగి పుంజుకుని లేస్తాడు.
తెలివి తక్కు వాడు మాత్రం నేల కేసి కొట్టిన మట్టి ముద్ద లాగా మరింక పైకి లేవడు.


ఐతే, మరో విషయం ...దైవానుగ్రహం లేనిదే మనం ఏదీ సాధించ లేం. అలాగే, దైవానుగ్రహం ఉన్నప్పటికీ మానవప్రయత్పం చేయక తప్పదు.

గజేంద్రోపాఖ్యానం కథలో కరి రాజు వేల యేండ్లు మొసలితో పోరాడిన పిదప కానీ హరి కరుణించ లేదు కదా ? మానవ ప్రయత్నం చేయ వలసిన ఆవశ్యకతని ఆ కథ మనకి తెలుపుతోంది ...

నదైవమేవ సంచిత్య త్యజేదుద్యోగమాత్మన:
అనుద్యోగేన తైలాని తిలేభ్యో నాప్తుమర్హతి

దైవం మీద భారం వేసి. మన ప్రయత్నం మనం చేయకుండా ఉండడం తగదు. ప్రయత్నం చేయనిదే తిలలనుండి తైలం రాదు కదా?

ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మీ:
దైవేన దేయమితి కాపురుషా వదంతి
దైవం నిహత్య కురు పౌరుషమాత్మ శక్త్యా
యత్నే కృతే యది న సిద్ధ్యతి కోZత్ర దోష: ?

ప్రయత్నం చేసే వాడికే విజయం వరిస్తుంది. అన్నీ దేవుడే యిస్తాడు కదా అని, ఏ పనీ, ఏ ప్రయత్నమూ చేయకుండా ఉండండం నీచుల లక్షణం. ఒక వేళ నీ ప్రయత్నం నీవు చేసినా, విజయం లభించ లేదనుకో, దాని వలన నీ తప్పేమీ లేదు. దైవానుగ్రహం అంతే అనుకోవాలి.

యథాహ్యేకేన చక్రేణ నరథస్య గతిర్భవేత్
ఏవం పురుష కారేణ వినా దైవం నసిద్ధ్యతి

ఒకే ఒక చక్రంతో రథం నడవదు కదా ? అలాగే, దైవానుగ్రహం లేక పోతే, మానవ ప్రయత్నం సిద్ధించదు.

దైవం అనుకూలించక పోతే, మనం ఏమీ చేయ లేం ...

కాకతాళీయవత్ ప్రాప్తం దృష్ట్వాZపి నిథి మగ్రత:
న స్వయం దైవమాదత్తే పురుషార్ధ మపేక్షతే

దైవానుగ్రహం లేక పోతే, ఎదురుగా ఉన్న నిధి కూడా మన కంట పడదు.

అందు వలన దైవానుగ్రహాన్ని అపేక్షిస్తూ, మానవ ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన ప్రయత్నం మనం చేయనిదే ఏదీ మనలకు తనంతట తాను చేకూరదు.

ఏదీ తనంత తానై నీదరికి రాదూ ... శోధించి సాధించాలి .. అదియే ధీర గుణం ... అని సినిమా కవి చెప్ప లేదూ !





ఉద్యమేనహి సిద్ధ్యంతి కార్యాణి, నమనో రధై:
నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా :

కోరిక ఉంటే చాలదు. అది నెర వేర్చుకునే ప్రయత్నమూ చేయాలి. కేవలం మనోరధంతోటే పనులు చేకూరవు. నిద్రిస్తున్న సింహం నోటి లోకి ఆహారంగా జంతువులు వాటంతట అవి వచ్చి పడవు కదా? ఎంత మృగరాజయినా తన ఆహారసముపార్జనకు వేటాడి తీర వలసినదే కదా !


ఒక్కోసారి మన ప్రయతం ఫలించకకూ పోవచ్చు ...

యదశక్యం న తచ్ఛక్యం, యచ్ఛక్యం శక్యమేవతత్
నోదకే శకటం యాతి నచ నౌర్గచ్ఛతి స్థలే

ఏది చేయడానికి సాధ్య పడదో, అది జరగమన్నా జరగదు. జరిగేది జరుగకా మానదు.
నీటి మీద బండినీ, నేల మీద నౌకనీ నడప లేం కదా !!


ఎట్టుగఁబాటు పడ్డ నొకయించుక ప్రాప్తము లేక వస్తువుల్
పట్టుపడంగ నేరవు, నిబద్ధి; సురావళిఁగూడి రాక్షసుల్
గట్టు పెకల్చి పాల్కడలిఁగవ్వము సేసి మధించిరంతయున్
వెట్టియెఁగాక యే మనుభవించిరి వారమృతంబు భాస్కరా !


ప్రాప్తం అంటూ లేక పోతే, ఎంత చేసినా మనకి ప్రయోజనం సిద్ధించదు. అది నిజం. మంధర పర్వతాన్ని పెకలించి, కవ్వంగా చేసుకుని, వాసుకిని తాడుగా చేసుకుని, రాక్షసులు కూడా దేవతలతో పాటు అమృతం కోసం సాగర మథనం చేయ లేదూ !...పాపం, వారి చాకిరీ అంతా వెట్టి చాకిరీ అయిందే తప్ప వారికి అమృతం దక్క లేదు కదా ?

అలాగని, నిరాశతో ఏ పనీ చేయకుండా ఉండడం తగదు. వేమన చెప్ప లేదూ ? ...

పట్టు పట్ట రాదు, పట్టి విడువ రాదు
పట్టెనేని బిగియ పట్ట వలెను
పట్టి విడుచుకన్నఁబడి చచ్చుటయె మేలు
విశ్వదాభిరామ వినుర వేమ.

ఇది అనంతం. కనుక, ఇప్పటికి స్వస్తి.

7, మే 2010, శుక్రవారం

పలుకే బంగారం !!










సమ్యగ్భాషణం వ్యక్తికి భూషణం. మంచిగా మాట్లాడితే అందరూ మిత్రులే. కఠినోక్తుల వల్ల మనకి అంతా శత్రువులవడం తథ్యం.

ఈ చిన్న కంద పద్యంలో కవి ఆ విషయాన్ని ఎంత చక్కగా వివరించాడో చూడండి ...

కాకేమి తన్నుఁదిట్టెనె ?
కోకిల ధనమేమి తన్నుఁగో కొమ్మనెనే !
లోకము పగయగు బరుసని
వాకున ,జుట్టమగు మధుర వాక్యము కలిమిన్ !

పాపం, కాకి నిన్నేమీ తిట్ట లేదు కదా ? అదంటే అసహ్యించుకుంటావేం ? ఊరికే కాకి గోల ! అంటూ విసుక్కుంటావు. మరి, కాకిలాగా నల్లగానే ఉంటుంది కదా, కోకిల - అది నీకేమీ పెట్టుపోతలు జరిపించడం లేదు కదా ? దాని గొంతువిని మెచ్చుకుంటావు ?

మధురంగా పలకడం చేతనే కదా కోకిలని యిష్ట పడుతున్నావు ?

అందు చేత, మంచిగా మాట్లాడడం వల్ల అందరి ప్రేమనూ పొందవచ్చును. రుస రుసలాడుతూ ఉంటే ఎవరూ హర్షించరు. సరి కదా, చీదరించుకుని, దూరంగా జరిగి పోతారు ....

బద్దె భూపాలుడు సుమతీ శతకంలో ఇతరుల మనసు బాధించకుండా మాటలాడదగునని చెప్పాడు కదా ?

ఎప్పటి కెయ్యది ప్రస్తుత,
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపకఁదానొవ్వక
తప్పించుక తిరుగు వాడు ధన్యుడు సుమతీ !

ఎప్పుడేది మాట్లాడాలో అప్పుడది మాట్లాడాలి. ఇతరులు మనసులు బాధించ కూడదు. అలా లౌక్యంగా వ్వహరించే వాడు ధన్యుడయ్యా అంటాడు కవి.

అలా అని ఇతరుల మెప్పు కోసం వారికి నచ్చుతుందని చెప్పి నానా చెత్తా పలకమని కాదు ...
పరుషంగా కాక, కాస్త సౌమ్యంగా మాట్లాడమని కవి బోధిస్తున్నాడు...

అయితే , కొందరున్నారు ... ఎంత మంచిగా చెప్పు ... వినరు. తల కెక్కించు కోరు. వాళ్ళకి తెలీదు. చెబితే వినరు.


భర్తృహరి ఎలా వాపోయాడో చూడండి ...

బోద్ధారో మత్సరగ్రస్తా: ప్రభవ: స్మయ దూషితా:
అబోధో పహతశ్చాన్యే జీర్ణమంగే సుభాషితమ్

బాగా తెలిసిన వారికి మదం, మాత్సర్యం జాస్తి. చెబితే వినరు. ప్రభువులా - వారసలే గర్విష్ఠులు. వారికి చెప్ప లేం. ఇక ఇతరులంటారా, వారికి చెప్పినా అర్ధం కాదు. అందుల్ల నాలుగు మంచి మాటలు చెబుదామన్నా నోరు దాటి బయటకి రావడం లేదు.

దీనికి ఏనుగు లక్ష్మణ కవి అనువాదం కూడా చూడండి ...

బోద్ధలగు వారు మత్సర పూర్ణమతులు
ప్రబల గర్వ విదూషితుల్ ప్రభువు లెన్న
నితర మనుజులబోధోపహతులు గాన
భావమున జీర్ణమయ్యె సుభాషితంబు.




సనాతన ధర్మం చెప్పినది చూడండి ...

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
నబ్రూయాత్ సత్యమప్రియం
ప్రియం చ నానృతం బ్రూయాత్
ఏష ధర్మస్సనాతన:

సత్యాన్నే పలకాలి.ప్రియ వచనలాలే పలకాలి. సత్యమయినా, అప్రియాన్ని పలకవద్దు. ప్రియమైన దయినప్పటికీ అసత్యం పలక వద్దు. ఇది సనాతన ధర్మం.

అయితే, తనకి తెలిసిన మంచిని చెప్పక పోవడం కూడ పాపహేతువేనని నన్నయ గారు ...

తనయెఱిఁగిన యర్ధంబొరుఁ
డనఘా ! యిది యెట్లు సెప్పు మని యడిగినఁజె
ప్పని వాడును, సత్యము సె
ప్పని వాడును ఘోర నరక కంపమునఁబడున్.

తనకి తెలిసిన విషయాన్ని, నాకది చెప్పవయ్యా, అని ఎవరయినా కోరితే, తనెరిగిన దానిని చెప్పని వాడూ, సత్యము పలుకని వాడూ పెను నరకంలో పడతాడని నన్నయ్య గారు మహా భారతంలో చక్కగా హెచ్చరించారు ...

ప్రియ భాషణముల గురించి ఎలాగూ చెప్పుకుంటున్నాం కనుక ఇది కూడా చూడండి ...

అనుదిన సంతోషణములు,
జనిత శ్రమ తాప దు:ఖ సంశోషణముల్
తనయులు సంభాషణములు,
జనకులకుం గర్ణయుగళ సద్భూషణముల్

పోతన గారు భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో చెప్పిన పద్యమిది.

కొడుకుల ముద్దు మాటలు జనకులకు నిత్యం ఆనందాన్ని కలిగిస్తూ. విచారాలని పోగొడుతూ ఉంటాయి. పిల్లకాయల పలుకులు వారి చెవులకి మంచి అలంకారాలు ...

సభలో సభారంజకంగా మాట్లాడలంటే ఎలాంటివి మాట్లాడాలో కవి చౌడప్ప తన మార్కు పద్యంలో చెప్పాడు. గమనించండి...

పది నీతులు పది బూతులు
పది శృంగారములు కల్గు పద్యములు సభన్
చదివిన వాడే యధికుడు
కదరయ్యా కుంద వరపు కవి చౌడప్పా !

ఆ రోజులలో సభలలో అలాంటి మాటలు గౌరవ ప్రదాలే కాబోలు.

నీతులూ బూతులూ లోకఖ్యాతులని కూడా సెలవిచ్చాడు మరి ...

నీతులకేమి యొకించుక
బూతాడక నవ్వు పుట్టదు ధరలో
నీతులు బూతులు లోక
ఖ్యాతులురా కుంద వరపు కవి చౌడప్పా !

ఐతే, నాకు చక్కగా మాట్లాడడం చాతనవును కదా అని ఎక్కడ పడితే అక్కడ మెప్పించేలా మాట్లాడడం అంత సుళువేమీ కాదు . అదే చెబుతున్నాడు చౌడప్ప ... మరో పద్యంలో ...

నేరుతునని మాట్లాడగ
వారిజు భవునంత వాని వశమా ? తంజా
వూరి రఘు నాధ నాయుని
గారెదెరుగ కుంద వరపు కవి చౌడస్సా .

నాకు బాగా మాట్లాడడం చాతనవునని విర్రవీగుతూ తంజావూరి ప్రభువులు రఘునాథ రాయుని ఎదుట
మాట్లాడడం బ్రహ్మ దేవుడికి కూడా సాధ్యం కాదు సుమీ ! అని కుండ బద్దల కొట్టినట్టుగా చెబుతున్నాడు కవి...

మాట్లాడడం సుళువే కానీ, మాట మీద నిలబడడమే కష్టం పోతన గారు చెప్ప లేదూ ?...

బ్రతు వచ్చు గాక బహు బంధనములైన
వచ్చు గాక లేమి వచ్చుగాక !
జీవ ధనము లైన చెడు గాక పడు గాక
మాట తిరుగ లేరు మాన ధనులు !

కష్టాలు రానీ, దరిద్రం కలగనీ ఏమైనా కానీ మాన ధనులు మాత్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు ....

మంచి వాడు ఎప్పుడూ మంచి మాటలే పలుకుతాడు. కఠినంగా మాట్లాడడు. ఒక వేళ ఎప్పుడినా అతను కఠినంగా పలికినా మేలే జరుగుతుంది తప్ప - కీడు కాదు. చూడండి భాస్కర శతకంలో కవి ...

పలుమరు సజ్జనుండు ప్రియ భాషలె పల్కు , కఠోర వాక్యముల్
పలుకఁడొకానొకప్పుడవి పల్కినఁగీడునుఁగాదు ; నిక్కమే
చలువకు వచ్చి మేఘుఁడొకజాడను దా వడగండ్ల రాల్చినన్
శిలలగునోటు ! వేగిరమె శీతల నీరముఁగాక భాస్కరా !

సజ్జనుడు సదా మంచి మాటలే పలుకుతాడు. ఎప్పుడూ కఠినంగా పలుకడు. ఒక వేళ ఎప్పుడయినా అతని నోటి వెంట కఠినోక్తులు వచ్చినా , దాని వలన మనకి కీడు కలుగదు. మంచే జరుగుతుంది.
ఎలాగంటే, లోకానికి చల్లదనాన్ని ఇవ్వడం కోసం మేఘుడు వచ్చి, వర్షం కురిపిస్తాడు. ఒక్కోసారి వడగళ్ళూ కురిపిస్తాడు. అయితే అవి రాళ్ళలాగా ఉండి పోతాయా ? వెంటే చల్లని నీటిగా కరిగి పోదూ ?

మంచి మాటల గురించి సుమతీ శతకంలోంచి మరో మంచి మాట ...

మాటకుఁబ్రాణము సత్యము
కోటకుఁబ్రాణము సుభట కోటి ధరిత్రిన్
బోటికిఁబ్రాణము మానము
చీటికిఁబ్రాణంబువ్రాలు సిద్ధము సుమతీ !

మాటకి సత్యాన్ని పలకడమే ప్రాణం. కోటకి మంచి భటులు ప్రాణం. శీలమే పడతికి ప్రాణం ( ఆ మాట కొస్తే మగవాడికి కాదా ఏమిటి?) ఇక, సంతకమే చీటీకి ( ఉత్తరం వగైరాలకి ...) అతి ముఖ్యం అంటున్నాడు కవి ...

మాట్లాడకుండా ఉండడం కూడా కొండొకచో శోభిస్తుంది సుమా !

ఎలాగంటే ....

మూర్ఖో2పి శోభతే తావత్సభాయాం వస్త్రవేష్టిత:
తావచ్చ శోభతే మూర్ఖో యావత్కించిన్నభాషతే.


మూర్ఖుడు - అంటే చదువు సంధ్యలు లేని శుంఠ కూడా చక్కని బట్టలు వేసుకుని సభలలో రాణించ గలడు.
ఎంత వరకయ్యా అంటే ..... నోరు విప్పనంత వరకూ !!

మరి ఇప్పటికి స్వస్తి.





28, ఏప్రిల్ 2010, బుధవారం

ఏనుగు ఏనుగే ... పీనుగు పీనుగే !!

























క్షుత్షామో2పి ,జరాకృశో2పి, శిధాలం ప్రాయో2పి, కష్టా ధశా
మాపన్నో2పి, విపన్నదీధితరపి, ప్రాణేషు నశ్యోత్ష్వపి
మత్తేభేంద్ర విభిన్న కుంభ విశిత గ్రాసైక బద్ధసృ్పహ:
కిం జీర్ణం తృణయత్తిమానమహతా మగ్రేసర: కేసరీ

గ్రాసము లేక స్రుక్కిన, జరాకృశమైన విశీర్ణమైన, నా
యాసమునైన, నష్టరుచియూనను ప్రాణభయార్తమైన,ని
నిస్రా సమదేభ కుంభ పిశిత గ్రహ లాలస శీల సాగ్రహా
గ్రేసర భాసమానమగు కసరి జీర్ణ తృణంబు మేయునే?


తిండి లేక చిక్కి పోయినా, ముసలిదయి పోయినా, బాధలలో ఉన్నా సరే, ప్రాణం మీదకి వచ్చినా సరే, ఏనుగు కుంభ స్థలాన్ని చీల్చి అక్కడి మాంసాన్నే తింటుంది తప్ప , సింహం మిగతా చెత్త తినదు. వేరే గడ్డి కరవదు.

మరి, కుక్క సంగతి చూడండి ...


లాంగూల చాలన మధశ్చరణావఘాతం
భూమౌ నిపత్య వదనోదర దర్శనంచ
శ్వాపిండదస్య కురుతే గజపుంగవస్తు
ధీరం విలోకయతి చాటు శతైశ్చ భుక్తే

వాలము ద్రిప్పు, నేలబడ వక్త్రము కుక్షియుఁజూపు క్రిందటం
గాలిడు, ద్రవ్వు పిండదుని కట్టెదుటన్ శునకంబు, భద్ర శుం
డాలము శాలితండులగుడంబులు చాటు వచశ్శతంబు చే
నోలి భుజించు ధైర్య గుణ యుక్తిఁగ జూచు మహోన్నత స్థితిన్


యజమాని పడేసే ఎంగిలి కూడు కోసం కుక్క ఎన్ని వికార చేష్టలయినా చేయడం మనకి తెలిసిందే
కదా ?
యజమాని ఎదుట తోక ఆడిస్తుంది. నేల మీద పడి దొర్లుతూ నోరు, కడుపు చూపిస్తుంది. కాలితో నేల
కెలుకుతుంది. తిండి కోసం ఎన్ని వికార పోకడలయినా, పోతుంది. దాని నైజమే అంత కద !! భద్ర గజం అలా కాదు. మురిపించుకుని, బుజ్జగింపు మాటలు చెబితే కాని తినదు.

సింహం సింహమే ! ఏనుగు ఏనుగే !! కుక్క కుక్కే కదా !!!