మీ కోసం ఓ చమత్కార శ్లోకం ... లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మీ కోసం ఓ చమత్కార శ్లోకం ... లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, ఏప్రిల్ 2012, ఆదివారం

తగునా ఇది నీకూ ? ( పెద్దలకు మాత్రమే )


యుక్తం కిం తవ శర్వరీశ ముఖ  మద్వేణీసమాకర్షణమ్ ?
వధ్యాయా  వంహరత్తవ కుచ ద్వంద్వం మదేయం మన:
వ్యత్యస్తం నను శిక్షితం జహి జహి స్వామిన్ వచ: సాధు తే ?
ఆశోయత్కురుతే తదేవ భవతాం దండస్య యోగ్యం ఖలు.

భావం:
‘‘ఓ అందగాడా  నా జడను లాగుతావేం ? నీకిది తగునా ? ’’
‘‘ నీ ఉన్నతమైన వక్ష స్థలం నాచేత ఆ పని చేయించింది మరి. ’’
‘‘చిత్రం ! తప్పు చేసిన వారిని విడిచి, నిరపరాథిని ( జడను) దండిస్తారా ’’


21, ఏప్రిల్ 2012, శనివారం

పన్నగ ధారీ ! నగ ధారీ !!


ఈ శ్లోకం చూడండి:

పన్నగధారి కరాగ్ర: గంగోమా లక్ష్మితో గదాగ్ర భుజ:
శశి ఖండ శేఖర ఉమా పరిగ్రహో ముహురనాది రవతు త్వామ్.

ఈశ్లోకంలో కవి శివ పరమయిన అర్ధమూ, విష్ణు పరమయిన అర్ధమూ  వచ్చేలా రచించాడు.
ముందుగా శివ పరమయిన అర్ధం చూదాం.


శివ పరంగా అర్ధం చెప్పు కునేటప్పుడు శ్లోకం లో పదచ్ఛేదం ఇలా ఉంటుంది:

పన్నగధారి,  కరాగ్ర:,  గంగా, ఉమా లక్షిత:,   గదా, అగ్ర భుజ:,  శశి ఖండ శేఖర:,   ఉమా పరిగ్రహ:,  అనాది:, ముహు:, త్వామ్ , అవతు.

అన్వయ క్రమం ఇలా ఉంటుంది:

పన్నగధారి:, గంగా ఉమా లక్షిత:, అగదోగ్ర భుజ:, శశిఖండ శేఖర:, ఉమా పరిగ్రహ:, అనాది: , మహు:, త్వామ్ అవతు !

భావం: చేతలో పామును ధరించిన వాడూ, గంగా, పార్వతులు ప్రియ నాథుడూ, భుజాల మీద చక్కని బాహుపురులూ, బంగారు ఆభరణాలూ ధరించిన వాడూ, చంద్ర రేఖను తల మీద అలంకారంగా ధరించిన వాడూ , పార్వతీ దేవిని తన అర్ధాంగిగా పొందిన వాడూ, పుట్టుకే లేని అభవుడూ అమిన పరమేశ్వరుడు ఎల్లప్పుడూ మిమ్ములను కాపాడు గాక !

కవి ఈ శ్లోకంలో శివుడికి  ఈ విశేషాణాలు వేసాడు.
 పన్నగధారి                                     =    పామును ధరించిన వాడు
గంగో మా లక్ష్మిత: = గంగా = ఉమా లక్షిత:    =    గంగా పార్వతులచే కోరబడిన వాడు
అగదోగ్ర భుజ:                                  =    భుజాల మీద బాహుపురులు,                                         
                                                        స్వర్ణాభరణాలు ధరించిన వాడు
శశిఖండ శేఖర:                                  =    చంద్ర రేఖను అలంకారంగా ధరించిన వాడు.
ఉమా పరిగ్రహ:                                  =     పార్వతిని భార్యగా స్వీకరించిన వాడు
అనాది:                                           =     పుట్టుక లేని వాడు
మహు:, త్వామ్ అవతు                        =      సదా   మిమ్ము కాపాడు గాక !     

ఇక, శ్లోకం లోని అర్ధాన్ని విష్ణు పరంగా చెప్పు కోవాలంటే, కవి శివుడికి వేసినట్టుగా చెప్పిన విశేషణ పదాలలోని తొలి అక్షరాలను తొలిగించి చదువు కోవాలి !


విశేషణాలలోని తొలి అక్షరాలు తొలిగిస్తే,  పదచ్ఛేదం ఇలా ఉంటుంది:

నగధారి, కరాగ్ర: ,  గో, మా లక్షిత: , గద: , అగ్ర భుజ:, శిఖండ శేఖర:,  మా, పరిగ్రహ: , అనాది: , ముహు:, త్వామ్ , అవతు.

అన్వయ క్రమం ఇలా ఉంటుంది:

కరాగ్ర:, నగధారి, గో,మా లక్షిత:, అగ్ర భుజ: గద:, శిఖండ శేఖర:, మా , పరిగ్రహ: , అనాది: , త్వామ్, ముహు:, అవతు.

కరాగ్ర: నగధారి            =       గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన వాడు
గో                           =      ఆవుల చేత,
మా                         =       లక్ష్మీదేవి చేత
లక్షిత:                      =       కోర బడిన వాడు ( అంటే, గోవులకు , లక్షీ దేవికి ప్రభువు
                                     అయిన వాడు )
గద: అగ్ర భుజ:            =       భుజం మీద కౌమోదకి అనే గదను ధరించిన వాడు
శిఖండ శేఖర:             =        శిరసున నెమలి పింఛం ధరించిన వాడు
మా                          =      లక్షీ దేవిని
పరిగ్రహ:                     =      భార్యగా స్వీకరించిన వాడు
అనాది:                      =      ( మొదటి అక్షరాలు తీసివేయగా మిగిలిన అర్ధమగు) విష్ణువు
                                     పుట్టుక లేని వాడు అయిన విష్ణువు
ముహు: , త్వామ్, అవతు =      సదా మిమ్ము కాపాడు గాక !

భావం:  గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన వాడూ,  గోవులకూ, లక్ష్మీ దేవికీ ప్రభువూ, భుజాన గదనూ, తల మీద నెమలి పింఛాన్నీ ధరించిన వాడూ, రమా పతీ అయిన వాడూ, పుట్టుక లేని వాడూ అయిన శ్రీ మహా విష్ణువు మిమ్ములను ఎల్లప్పుడూ కాపాడు గాక !
   


20, ఏప్రిల్ 2012, శుక్రవారం

పరాకేలనోయి ప్రభూ !


ఈ అందమయిన భావ చిత్రణ చూడండి:

రాధా పునాతు జగదచ్యుత దత్త చిత్తా మంధాన మా కలయతి దధి రిక్త భాండే

తస్యా: స్తనస్తబక చంచల లోల దృష్టి: దేవో2పి దోహన థియా వృషభం నిరుంధన్ !

భావం: రాథ మనసంతా శ్రీకృష్ణుని మీదే ఉంది. పరవశయై ఉంది. అలా శ్రీకృష్ణుని మీద లగ్న చిత్త అయిన రాథ ఖాళీ కుండలో కవ్వం ఉంచి చిలుకుతోంది !

కృష్ణుడికి అప్పుడు ఆవుల పాలు పితికే వేళయింది. అతని చూపంతా రాథ మీదే ఉంది. ఆమె వక్షోజ సౌందర్యాన్నే చూస్తూ పరవశించి పోయి ఉన్నాడేమో, పాలు పితకడానికి ఎద్దు కాళ్ళకి బంధనాలు వేస్తున్నాడు !

(చిత్రంలో కృష్ణుడి చేష్టలు సరిగానే ఉన్నాయి. మరక్కడ అప్పుడు రాథ లేదు కాబోలు..)

11, డిసెంబర్ 2011, ఆదివారం

కవి గారి రీజనింగు !


మన కవులు వాడే కవి సమయాలు బోలెడు.
స్త్రీలను వర్ణించేటప్పుడు ... అందమైన ముఖాన్ని చంద మామతోనూ, అరవిందం తోనూ పోలిక తెస్తారు.
వారి కురులు మేఘ మాలికలు
నేత్రాలు బేడిస చేపలు. చూపులు తూపులు. కనుబొమలు ధనుస్సులు . నడుము ఆకాశం. దంతాలు తారకలు. తొడలు అరటి బోదెలు. పాలిండ్లు పూర్ణ కుంభాలు. వేణి ఫణి. అధరాలు మధుశాలలు. పెదవులు దొండ పండ్లు. నాసిక సంపెంగ. ఇలా చాలా ఉన్నాయి లెండి. అంగాంగాలకూ ఎవరికి తోచిన పోలికలు వారు చెబుతారు.

ఆ సంగతి అలా ఉంచితే మనం కూడా నిత్య వ్యవహారంలో చాలా పోలికలను వింటూ ఉంటాం.
పొడుగ్గా ఉండే వారిని గెడ కర్రలా ఉన్నాడంటారు. తెలివి హీనుడిని మొద్దు రాచ్చిప్ప అంటారు. లంచాలడిగే వారిని జెలగలంటారు. కష్టపడి పని చేస్తే గాడిద చాకిరీ అంటారు. కష్టాలను కొండలంటారు. నీచులను పాములంటారు.
చక్కని జంటను రతీ మన్మథులంటారు. ముసలి ముత్తయిదవుల జంటను పార్వతీ పరమేశ్వరులాంటారు.
అతి వాగుడిని సుత్తి దెబ్బలంటారు. అందమైన భార్యకు అందవిహీనుడయిన భర్తను చూసి, కాకి ముక్కుకి దొండ పండు అంటూ ఎద్దేవా చేస్తారు. నచ్చని తిను బండారాన్ని ఒట్టి గడ్డి అంటారు. నాయకుల దృష్టిలో జనాలు గొర్రెలు.
చదువూ సంధ్యా లేని వారు అడ్డ గాడిదలు. గయ్యాళి పెళ్ళాలు చుప్పనాతి శూర్పణఖలు. చలి పులిలా మీద పడుతోందంటారు. ధారాపాత వర్షాన్ని కుంభపోత అంటారు. కదలని ఫైళ్ళవి నత్త నడకలంటారు. కొందరు ఆఫీసర్లని అగ్గి రాఁవుళ్ళంటారు అబద్ధాలాడే వారిని అబద్ధాల పుట్ట అంటారు. దీర్ఘ కోపిది పాము పగ అంటారు. పేరు గొప్పా ఊరు దిబ్బా అయితే నేతి బీర కాయ చందం అంటారు. ఎప్పుడూ తన లోకం తనదేలా ఉండే వాడిని నూతి లోని కప్ప అంటారు. నిరక్షర కుక్షిని పశువంటారు. వాచాలుని వస పిట్టతో పోలుస్తారు. మౌనంగా ఉండే వాడిని ముని అనో, ముంగి ముషాణమనో అంటారు.

ఇలా చెబుతూ పోతే, చాలా ఉంటుంది. చెప్పడానికి చేంతాడంత !

ఇంత వరకూ రాసిన టపాని ఎప్పటి లాగే నా వెనుక వంగుని చూస్తున్న మా తింగరి బుచ్చి‘ బాగుందిరా ! ’అని మెచ్చుకున్నాడు. మా యింట కాఫీ టిపిన్లు సేవించి కబుర్లు చెప్పే వాడి నోట మొదటి సారి మెచ్చుకోలు మాట విని నేను ఆనంద పరవశుడి నయ్యాను. ఇంత లోనే,‘‘ అవును ! మన వాళ్ళు భలే పోలికలు తెస్తార్లే. కవులను ఎద్దులతో పోలుస్తారు కదా ! ’’ అని తనవిఙ్ఞాన భాండారంలో నుండి ఒక అమూల్యమైన విషయాన్ని ప్రస్తావించేడు. నా తల తిరిగి పోయింది.

‘‘ ఏఁవిటీ, కవులను ఎద్దులంటారా! ’’ అన్నాను, కంగారుగా.

‘‘ మరే, కవి వృషభులనే మాట నువ్వు విన లేదా ! ’’ అని నా తెలివి తక్కువ తనం మీద జాలి చూపించాడు.

కథా మంజిరి (ఏకైక నస బ్లాగు) బ్లాగుని మూసెయ్యా లన్నంత విరక్తి కలిగింది నాకు !

మా తింగరి బుచ్చి గాడి గొడవ ఎప్పుడూ ఉండేదే కానీ, ఒక కవి గారు ఒక శ్లోకంలో ఎలాంటి రీజనింగు తీసారో చూడండి:

మనం లోకంలో మంచి వారి మనసు వెన్నతో సమానం అంటూ ఉంటాం కదూ. ఆ కవి కాదు పొమ్మంటున్నాడు.

కవి గారి రీజనింగు ఏమిటో మీరే చూడండి:


సజ్జనస్య హృదయం నవనీతం యద్వదంతి కవయ స్తదళీకమ్.

దీని అర్ధం : మంచి వారి మనస్సు వెన్న లాంటిదని కవులు చెబుతూ ఉంటారు. ఆ మాట అబద్ధం !
ఎందు కంటే, ఇతరుల మనో దుఃఖానికి మంచి వారి మనసు కరిగి పోతుంది. కానీ, కానీ, వెన్న కరుగదు కదా !

ఈ రీజనింగు చూసి ఈ కవి గారు మా తింగరి బుచ్చికి తమ్ముడనుకునేరు ! కాదు సుమా !

ఇది వినోక్త్యలంకార భేద మనుకుంటాను.



29, జులై 2011, శుక్రవారం

ఇంతకీ అసలు సమస్య ఏమిటయ్యా ?


ఈ క్రింది శ్లోకం చూడండి:

కా శంభు కాన్తా ? కిము చంద్ర కాంతం ?
కాన్తా ముఖం కిం కురతే భుజంగం
క: శ్రీపతి: కా విషమ సమస్యా ?
‘‘ గౌరీ ముఖం చుంబతి వాసు దేవ: ’’

ఇందులో మొత్తం నాలుగు ప్రశ్నలూ, నాలుగు సమాధానాలూ ఉన్నాయి. చూడండి:

కా శంభు కాన్తా ? = ఎవరు ఈశుని భార్య ? = గౌరి

కిము చంద్ర కాన్తం ? = ఏది చంద్ర బింబం ? = ముఖం

కాన్తా ముఖం కిం కురుతే = అమ్మాయి ముఖాన్ని ఏం చేస్తున్నాడు? = చుంబతి ( ముద్దు పెట్టు కుంటున్నాడు)

భుజంగం క: = పాము ఎవరు ? = వాసుకి.

ఈ విధంగా తొలి నాలుగు ప్రశ్నలకీ వరుసగా నాలుగో పాదం లోని ’’ గౌరీ ముఖం చుంబతి వాసు దేవ:’’ అని

కవి నాలుగు జవాబులూ తనే ఇచ్చేడు.

మరయితే అసలు సమస్య ఏమిటయ్యా ?

ఒక కవి ‘‘ గౌరీ ముఖం చుంబతి వాసు దేవ:’’ అని ఒక సంస్కృత సమస్య ఇచ్చాడు. శ్లోకం లోని మీద మూడు పాదాలూ పూరణ.

కా విషమ సమస్యా ? = ఏది జటిలమైన సమస్య ? దీనికి నాలుగో పాదం లోని ‘‘ గౌరీ ముఖం చుంబతి వాసు దేవ: ’’ అనేదే జవాబు.

గౌరీ దేవి ముఖాన్ని వాసు దేవుడు ముద్దు పెట్టు కోవడ మేమిటీ , ఓఘాయిత్యం కాక పోతేనూ !!

మరదే , అందుకే కవికి మండుతుంది. ఏ అనౌచిత్యమూ లేకుండా ఈ సమస్య లోని ప్రతి పదానికి అర్ధవంత మయిన జవాబు వచ్చేలా ముందే ప్రశ్నలు వేశాడు కదండీ.

ఇలాంటి కిత కితలంటే మన పూర్వ కవులకి చాలా సరదా సుమండీ . మనలా ఎప్పుడూ ఆందోళనలతో ఏడుపుగొట్టు ముఖాలతో ఉండకుండా గొప్ప కులాసాగా, కుంచెం శృంగారం ఒలికించే పద్యాలూ శ్లోకాలూ చెప్పుకుంటూ ఉండే వారు కాబోలు.

ఆ రోజుల్లో వాళ్ళకి ఏ నవ్వుల క్లబ్బులూ ఉండేవి కాదని , వాటి అవసరం వాళ్ళకి పడ లేదని మా కథా మంజరి దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది.




శలవ్.



22, జూన్ 2011, బుధవారం

నవ్వి పోదురు గాక !



కొంత మంది గలగలా ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. జాగ్రత్తగా వింటే కానీ వాళ్ళు చెబుతున్నదేమిటో అర్ధం కాదు !
ఆ వేగాన్ని అందుకోవడం మనతరం కాదు. ఇంతకీ వాళ్ళు మాట్లాడేది ఏ భాషో కూడా తెలియక జుట్టు పీక్కోవాలి.

ఒకాయన వేద పఠనం చేస్తున్నాడు. ఆహా ! ఏమి పాండిత్యమయ్యా ! క్రమాంతస్వాధ్యాయిలా ఉన్నాడు ! ఉదాత్తానుదాత్త స్వరిత స్వర భేదాలతో ఏమి గొప్పగా వేద పనసలు వల్లె వేస్తున్నాడయ్యా ! అనుకుంటూ మురిసి పోయేడొకాయన.
‘‘ నీముఖం ! ఆయన చదివేది వేదమూ కాదు. ఏమీ కాదు. నిదానించి విను .నీకే బోధ పడుతుంది.’’ అని హెచ్చరించేడు ప్రక్కనున్నాయన . సావధానంగా వింటే, ఆయన వేదంలా చదువుతన్నది వేదం కాదనీ, అవి తెలుగు పదాలేననీ అర్ధమై నవ్వి పోతాం.

అలాగే, కొన్ని శ్లోకాలు ఉంటాయి. తెలుగు సంస్కృత భాషా పదాలతో కూడిన మిశ్రమ భాషా రచన చేయడం కొందరికి సరదా. వాళ్ళ కదొక తుత్తి !

అలాంటివాటిని కొన్నింటిని చూదాం !

వృత్తింకల్పయ శక్తి లేదు అయితే జీవేకథం త్వత్పురే ?
ఉంటే ఉండుమి కిం,నీల్లు బహుశ: పీత్వా సుఖాదత్రవై
పోతే పో బహువత్సరాదహమిహస్థాస్యామి హే సత్ప్రభో !
ఏతే యాచక రాజ భాషిత మిదం భాషాద్వయం పాతున:

ఓ బిచ్చగాడు రాజుని ఏదేనా పని చూపించమని కోరేడు. అప్పుడు రాజూ, ఆ బిచ్చగాడూ తెలుగూ సంస్కృత భాఫా పదాలతో మాట్లాడేసుకుంటున్నారు.

‘‘ ఏదేనా పని చూపించవయ్యా, రాజా !’’ ‘‘నా వల్ల కాదురా’’ ‘‘ మరెలా బతకడం ?’’ ‘‘ఉంటే ఉండు. పోతే పో !’’ ఇలా సాగింది వారి సంభాషణ.

మరొకటి -

కాచీ కాచి మునక్కాయ
కాయవే పొట్టి కాకరా
కాయానాం వంగ పిందానామ్
కూరానాం గుజ్జు పచ్చడీ !

మునక్కాయ ముక్కలూ, పొట్టి కాకరా, లేత వంకాయలూ వేసి చేసే గుజ్జు పచ్చడి ఉభయభాషా పదశోభితమై చవులూరిస్తోంది కదూ!

భామా కలాపంలో హాస్యగాడు చదివే ఈ తెలుగు సంస్కృత పదాలతో కూడిన శ్లోకం చూడండి:

ఆదౌ దొమ్మరి మంగి గర్భజననం దాసీ గృహేవందనం
మాయామంగలి పోతిగాడి మరణం ఏటొడ్డు రామాయణం
పశ్చాత్ చాకలి పోలి తోడి జగడం పాపౌఘ నిర్వాపణం
కాకచ్ఛేదన కల్మషాపహరణం ఏతన్హా భారతం.

ఇలాంటి ఉభయ భాషా విన్యాసంతోనే ఉన్న ఈ ప్రార్ధనా శ్లోకం చూడండి:

గణానాం గణనాథశ్చ గణపాత్రస్తథైవచ
కాట్రా కాశీ కొంకి నక్కా, గార్ధభాయ నమో నమ:

అక్కలమ్మా మహామారీ మాతంగీ పరమేశ్వరీ
ఎన్నెమ్మాయ నమస్తుభ్యం ఆశీరమ్మాయ నమోనమ:

కామినీ చైవ గాంధారీ లంఖిణీచైవ తాటకీ
భూతప్రేత నివాసించ బూర్లె గంపాయ తే నమ:

పగటి వేషగాళ్ళు వేదంలా స్వరయుక్తంగా వల్లించే ఉభయ భాషా పదాల గారడీ చూడండి:

అంబలి ముఖ్యంత్వలంకారం కంబలి ముఖ్యంతు భోజనం
రాట్టం ముఖ్యంతు నారీణాం దుక్కి ముఖ్చంతు బ్రాహ్మణ:
బాకీ సారా గ్లాసు మనసా సర్వాదాయం యథాక్రమం

తిన్నట్టే తిన్నకున్నట్టే ఉన్నవారికి మాడటం
మాట మాట ప్రసంగేన దబ్బుదిబ్బుస్తథైవచ
పాదరక్ష ప్రయోగన శరీరం పీడ వర్జయేత్ .


మరొకటి చూడండి:

తిండికైతే పదిమంది వసంతి
తండులాలు గృహమందు వసంతి
కుండ బొచ్చెలు పరం విలసంతి
రండ నా కొడుకులెల్ల హసంతి

కవిగారి ఇంట దరిద్రం ఇలా ఉంది మరి !

చివరగా ఇంకొకటి ...

క్షుధాతురాణాం నవుడిర్నవుడక:
అర్ధాతురాణాం నచెల్లిర్న చెల్లక:
నిద్రాతురాణాం నమెట్టర్న పల్లం
కామాతురాణాం న ముసిలిర్న పిల్ల:

ఇది కామాతురాణాం న రుచిర్న పక్వ: ... అనే శ్లోకానికి వికట కవి చేసిన వెటకారం. ఆకలితో ఉన్నవాడికి ఉడికిందో లేదో కూడా అక్కర లేదు. దరిద్రుడు తనకిచ్చిన రూక చెల్లినదో, చెల్లనిదో కూడా చూసుకోడు. కూరుకు ముంచు కొస్తున్నవాడు మెట్ట పల్లాలు చూసుకోడు. ఇక, కామాంధుడికి పడుచుదయినా, ముసలిదయినా ఒకటే.

లోగడ కథా మంజరిలో తెలుగు, ఇంగ్లీషు పదాలు కలగాపులగం చేస్తూ కవులు రాసిన కొన్ని పద్యాలను ఉంచాను.

చూడాలనిపిస్తే ఆ టపా ఇక్కడ నొక్కి చూడండి. ఓ పనైపోతుంది.





2, మే 2011, సోమవారం

సరస సల్లాపమ్





మొగుడూ పెళ్ళాలన్నాక, ఆ పాటి మాటా మాటా అనుకోరా యేమిటి ?

మీ వాళ్ళు ఇలాగంటే, మహ చెప్పొచ్చారు లెండి, మీ వాళ్ళు మాత్రం తక్కువ తిన్నారా ? అని ఒకరి నొకరు దెప్పి పొడుచు కోవడం, మూతులు ముడుచు కోవడం, అలకలు, ముక్కులు చీదు కోవడాలూ, మాటలు మానెయ్యడాలూ, కూరలు తగలెయ్యడాలూ, ఉపాహారం తిన కుండానే వీధిలోకో, ఆఫీసుకో వెళ్ళి పోవడాలూ. ఆ తరువాత అయ్యో అనుకోడాలూ, తప్పంతా నాదే, నేనే ఊరికే రెచ్చ గొట్టేను, పాపిష్ఠి దాన్ని ( లేదా ) మూర్ఖపు వెధవని అనుకోడాలూ, సాయంత్రానికి వేడి వేడి పకోడీలు చేయడాలూ, కమ్మని కాఫీలు పెట్టడాలూ, మూరల లెక్కన మల్లెలో, సన్నజాజులో బేరమాడడాలూ, క్షమాపణలూ వగైరాలయేక, కరిగి పోవడాలూ ... ఇదీ సాంసారిక మాధుర్యం.

ఆది దంపతుల సరస సల్లాపాలు గమనిస్తే, అమృతోపమానమైన సరస సంభాషణతో భార్యా భర్తలు తమ దాంపత్యాన్ని ఎంత ప్రఫుల్లంగా, మధుర కావ్యంలాగున, తేనె వాక లాగున, ఇంద్ర ధనుస్సుల్లాగ మలచు కో వచ్చునో అవగత మవుతుంది.

చూడండి మరి :

క్వతిష్ట తస్తే పితరౌ మమేతి
అపర్ణ యోక్తే పరిహాస పూర్వం
క్వవా మమేవ శ్వసురౌ తవేతి
తామీరయన్ సస్మిత మీశ్వరోవ్యాత్

( శ్రీ కృష్ణకర్ణామృతమ్ )

దీనికి తెలుగు సేత:
‘నాకున్న తల్లి దండ్రులు
మీ కేరీ ’ యని యపర్ణ మేలము లాడన్
‘నాకున్న యత్త మామలు
నీ కేరీ’ యనుచు నగు త్రి నేత్రుని గొలుతున్ !

‘‘నాథా, నాకున్న మాతాపితరుల వంటి వారు నీకు లేరు. మా తలిదండ్రులు అంత గొప్ప వారు’’ అంటూ పార్వతి శివుడిని మేలమాడింది.

‘‘ పోదూ, మీ వాళ్ళ గొప్పలు నువ్వే చెప్పాలి. చాలు. చాలు. నాకున్న అత్త మామలు నీకు లేరులే !’’ అని బదులు చెప్పాడుట పరమ శివుడు. శివ పార్వతుల సల్లాపం ఎంత మనోహరంగా ఉన్నదో చూసారా ?

అర్ధనారీశ్వరత్వానికి అర్ధం, పరమార్ధం అదే.





స్వస్తి.

11, ఏప్రిల్ 2011, సోమవారం

దేవతలకు కూడా దారిద్ర్యమేనా ?



దేవతలకు కూడా దారిద్ర్యమేనా ? అవుననే అంటున్నారు మన కవులు. కేవలం చమత్కారం కోసమే నండోయ్.

చూడండి:

హలమట బలస్య, ఏకోనడ్వాన్ హరస్య, నలాంగలం
క్రమ పరిమితా భూమిర్విష్ణో: న గౌ ర్న చ లాంగలం
ప్లవహతి కృషి:నాద్యా ప్యేషాం ద్వితీయం గవం వినా
జగతి సకలే నే దృగ్దృష్టం దరిద్ర కుటుంబకమ్.

బలరాముడికి నాగలి ఉంది. కాని ఎద్దులు లేవు.
శివుడుకి ఎద్దు ఉంది. కాని నాగలి, భూమి లేవు.
హరికి మూడడుగుల నేల ( బలి ఇచ్చినది) ఉంది. కానీ, ఎడ్లు, నాగలి లేవు.
ఇంత దరిద్ర కుటుంబం ఎక్కడా చూడ లేదయ్యా ! అంటున్నాడు కవి ఈ శ్లోకంలో.

కేవలం చమత్కారం కోసమే సుమండీ. నాగలి, ఎద్దు, భూమి మొదలయినవి ఆయా దేవతలకి వరుసగా ఆయుధమూ, వాహనమూ, ధర్మ పత్ని గానూ శోభిల్లుతున్నాయి.

కాసుల పురుషోత్తమ కవి కూడా వ్యాజ నిందా రూపమైన తన ఆంధ్రనాయక శతకంలో హరి పరమ దరిద్రుడని వెటకారంగా అన లేదూ?
చూడండి:

ఆలు నిర్వాహకురాలు భూదేవియై
యఖిల భారకుడను నాఖ్యఁదెచ్చె

ఇష్ట సంపన్నురాలిందిర భార్యయై
కామితార్ధదుడన్న ఘనతఁదెచ్చె

కమలఘర్భుడు సృష్టికర్త తనూజుడై
బహు కుటుంబికుడన్న బలిమిఁదెచ్చె

కలుష విధ్వంసిని గంగ కుమార్తెయై
పతిత పావనుడన్న ప్రతిభఁదెచ్చె

ఆండ్రు బిడ్డలుఁదెచ్చు ప్రఖ్యాతి కాని
మొదటి నుండియు నీవు దామోదరుడవె !
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్య భావ !
హత విమత జీవ ! శ్రీకాకుళాంధ్ర దేవ !

శ్రీహరికి అఖిల భారకుడు ( సమస్త లోక భారాన్ని వహించేవాడు), కామితార్ధదుడు ( కోరిన కోరికలు ఇచ్చే వాడు), బహు కుటుంబికుడు ( జగమంత కుటుంబంకలవాడు), పతిత పావనుడు
( పతితులను వారి పాపాలు పోగొట్టి, పుణ్యాత్ములుగా చేసే వాడు) అనే పేర్లు ఉన్నాయి.

అయితే , మన కవి హరికి ఈ పేర్లన్నీ రావడానికివరుసగా అతని భార్యలు భూదేవి, శ్రీ లక్ష్మి, అతని కుమారుడు బ్రహ్మ, కుమార్తె గంగ కారణం తప్ప అతని గొప్పేమీ లేదని వ్యాజ నిందా రూపంలో చెబుతున్నాడు. హరి మొదటి నుండీ (దరిద్ర) దామోదరుడేనుట !

దామోదరుడు అంటే, దామము (పద్మము) ఉదరము నందు కలవాడని అర్ధం. శ్రీహరి నాభిలో కల పద్మం నుండే కదా బ్రహ్మ జనించినది.

ఇది నిందా రూప స్తుతి. అట్టి మహనీయులను పత్నులుగాను, కుమారునిగాను, కుమార్తె గాను కలిగిన హరి మరింత ఘనత వహించిన వాడు కదా. వ్యాజ నిందా రూపంలో హరిని నుతించడానికి కవి అతనికి లేని పోని దారిద్ర్యాన్ని ఆపాదించి చెబుతున్నాడు.

దేవతల దారిద్ర్యాన్ని గురించిన మరొక చాటువు కూడా చూదాం

శివుడద్రిని శయనించుట
రవి చంద్రులు మింట నుంట, రా
జీవాక్షుండ విరళముగ శేషునిపై
బవళించుట నల్లి బాధ పడ లేక సుమీ !

కవి తమాషాగా శివుడు హిమవత్పర్వతం మీద నివాసం ఏర్పరచు కోవడం, సూర్య చంద్రులు ఆకాశంలో ఉండడం, శ్రీహరి నిరంతరం పాలకడలిలో ఆది శేషుని మీద పవళించడం కేవలం నల్లి బాధ పడ లేకనే అని చెబుతున్నాడు.నల్లులూ, దోమలతో వేగాల్సిన దరిద్రం ఆ దేవతలకీ తప్పడం లేదని చమత్కారంగా చెబుతున్నాడు.

పరమేశుడు కాశీ నగరం విడిచి రావడానికి కూడా ఈ దరిద్రమే కారణం కదా.

దేవతల దారిద్ర్యం గురించిన ఈ చమత్కారాలకు ఇక స్వస్తి. మరో టపాలో మళ్ళీ కలుద్దాం.

9, ఏప్రిల్ 2011, శనివారం

కిచిడి శ్లోకమ్


ఒక చమత్కార శ్లోకం చూడండి ...

అంబలి ద్వేషిణం వందే
చింతకాయ శుభ ప్రదమ్
కూరగాయ కృత త్రాసం
పాలనేతి గవాం ప్రియమ్


తెలుగూ, సంస్కృతమూ కలగూరగంపలా కలగలిసి పోయిన ఈ శ్లోకం చూసేరా ? కవిగారి అభావ చేష్ఠ అని పోనీ లెమ్మని సరి పెట్టుకుందామంటే అర్ధం కూడా అదోలా లేదూ?

అంబలిని ద్వేషించే వాడికి వందనమట. చింతకాయ చాలా శుభ దాయకమట. కూరగాయ భయోత్పాతకమట. ఆవు పాల నేయి ప్రియమైనదట. ఏమిటీ కారు కూతలూ అనుకుంటున్నారా ?

అం , బలి = బలిని అణచి వేసిన వాడు

చింతక , ఆయ = నామ స్మరణ చేసే వారికి సకల శుభాలు ఇచ్చేటి వాడు

కు , ఉరగాయ = దుష్ట సర్పమును ( కాళీయుని) అణచి వేసిన వాడు

పాలన , ఇతి = గోవులను కాచునట్టి వాడు (అయినట్టి) ( శ్రీ కృష్ణునికి )

వందే = నమస్కరించుచున్నాను.


ఇది శ్రీ కృష్ణ నామ స్మరణ చేసే శ్లోకం.


3, ఫిబ్రవరి 2011, గురువారం

మాయ మైపోయానోచ్ !


ఎవరయినా సంపదలనిచ్చే లక్ష్మీ దేవిని నుతిస్తారే తప్ప, దరిద్ర దేవతను పొగడరు కదా ?

కాని, ఈ శ్లోకంలో కవి దరిద్ర దేవతను ఎలా నుతిస్తున్నాడో చూడండి:

దరిద్రాయ నమస్తుభ్యం, సిద్ధో2హం త్వత్ప్రసాదత:
సర్వం పశ్యామి దేవేశ, న మాం పశ్యతి కశ్చన.

దీని అర్ధం ఏమిటంటే,

ఓ దరిద్ర దేవతా ! నీకు వందనాలు. ఎందువల్లనంటే, నీ అనుగ్రహం వల్లనే కదా, నేను సిద్ధుడనైనాను. నాకు మహిమాన్వితమైన గొప్ప సిద్ధులు చేకూరాయి.

ఎలా అంటావా?

నేను అన్నింటినీ చూడ గలుగు తున్నాను. కాని ఒక్కరు కూడా నన్ను చూడ లేక పోతున్నారు.

ఈ కామరూప విద్య నాకు ప్రసాదించింది నువ్వే కదా, తల్లీ !

ఇదీ కవిగారు దరిద్ర దేవతను నుతించిన వైనం.

ఇందులో చమత్కారం సులభ గ్రాహ్యమే. అష్ట దరిద్రుడైన వాడికి అందరూ కనిపిస్తారు. కానీ వాడి మీద ఒక్కరి చూపు కూడా పడదు. దరిద్రుడిని ఎవరు మాత్రం చూస్తారు చెప్పండి? వాడి ఉనికిని ఎవరు మాత్రం గుర్తిస్తారు చెప్పండి?

‘దరిద్రుడనయినందు వలన నన్ను ఎవరూ పట్టించు కోవడం లేదు’ అని వాపోతున్నాడన్నమాట.

29, డిసెంబర్ 2010, బుధవారం

టిక్కెట్టు డబ్బులు వాపసు చెయ్యరూ ?


ఈ శ్లోకంలోని చమత్కారాన్ని గమనించండి:

ప్రాయో ధనవతా మేవ, ధన తృష్ణా గరీయసీ
పశ్య కోటి ద్వయాసక్తం, లక్షాయ ప్రవణం ధను:

డబ్బు మీద వ్యామోహం అందరకీ సర్వ సాధారణమే అయినా, బాగా ధనవంతులయిన వారికి ధనం మీద ఆశ మరీ ఎక్కువగా ఉంటుందిట. కోట్లు కల వారు కూడ లక్ష కోసం ఎదురు చూస్తూ ఉంటారుట. ఇదీ ఈ శ్లోక భావం.

శ్లోకంలోని రెండవ పాదం గమనించండి.

కోటి అనే పదానికి వంద లక్షలు అనే అర్ధమే కాక, వింటి కొప్పు ( ధనుస్సు చివర ) అనే అర్ధం కూడా ఉంది. అందు వల్ల ధనుస్సునకు రెండు కోట్లు ( రెండు చివరలు) ఉన్నాయన్నమాట !

ధనుస్సు ఎప్పుడూ ఛేదించ వలసిన లక్ష్యం వేపే గురిపెట్టి చూస్తూ ఉంటుంది.

లక్ష అనే పదానికి కూడ వంద వేలు అనే అర్ధమే కాక, గుఱి అనే అర్ధం కూడా ఉంది.

కనుక, రెండు కోట్లు గల ధనుస్సు ఎప్పుడూ లక్ష కోసం ( ఛేదించ వలసిన లక్ష్యం కోసం ) ఎదురు చూస్తూ ఉంటుందన్న మాట.

అలాగే, రెండు కోట్లు కల వాడు కూడా (మరో) లక్ష కోసం చూస్తూ ఉంటాడు. ఆశాపాశము కడున్నిడుపు, లేదంతంబు ....

ఎప్పుడో చదివిన ఒక జోక్ గుర్తుకు వస్తోంది. వెనుకటికి, ఓ ఊళ్ళో ప్రదర్శన జరుగుతూ ఉండగా సినిమా హాలు ఒక్క సారిగా కుప్ప కూలి పోయింది. చాలా మంది గాయ పడ్డారు.హాలు యాజమాన్యం వారు వచ్చి, అందరినీ బ్రతిమాలుకుని అందరకీ వైద్యం చేయించుకొమ్మని తలాయింతా ఇచ్చి, ఇళ్ళకు పంపి వేసారుట.

ఒక ప్రేక్షకుడు మాత్రం డబ్బు అందుకుని కూడా సీటు లోనుండి కదల్లేదు.

హాలు యజమాని సవినయంగా అడిగేడు: ‘‘ తమకి మరేమయినా కావాలా ?’’

ప్రేక్షకుడు నసుగుతూ : ‘‘ మరే, సినిమా పూర్తిగా చూడనే లేదు, టిక్కెట్టు డబ్బులు వాపసు యిప్పిస్తే ...’’





26, అక్టోబర్ 2010, మంగళవారం

నూక్రా స్యాత్ అంటే, ఏమిటండీ బాబూ ?!


దువ్వూరి వేంకటరమణ శాస్త్రి గారు ప్రముఖ సంస్కృత పండితులు. వారొకసారి విజయ వాడ నుండి బందరు రైల్లో ప్రయాణం చేస్తున్నారు. ఏమీ తోచక రైలాగితే పక్కన కూర్చున్న ఆయన్ని స్టేషను పేరేమిటండీ అనడిగారు.

దానికాయన తరిగొప్పుల అని జవాబిచ్చేరు. మళ్ళీ రైలు వెడుతూ ఉంటే, తర్వాతి స్టేషనేమిటని శాస్త్రి గారు అడిగారు. ఇందుపల్లి అని జవాబిచ్చేరాయన. ఇలా పదే పదే అడుగుతూ ఉంటే, మీకు సంస్కృతం వచ్చునాండీ అని ఆ వ్యక్తి అడిగారుట. శాస్త్రి గారు తెల్ల బోయి వచ్చునని తలూపేరుట. అప్పుడాయన ఈ క్రింది శ్లోకం చెప్పారు:

బెరానిఉత ఇందోగు నూకవప్పె చిమా: క్రమాత్
స్టేషన్సు బెజం శాఖాయాం నూక్రాస్యాదితి నిర్ణయ:

ఆ పెద్ద మనిఫి ఇందులో బెజవాడ నుండి బందరు వెళ్ళే దారిలో ఉన్న స్టేషన్ పేర్ల మొదటి అక్షరాలన్నీ వరుసగా కూర్చి చెప్పాడు.
బె = బెజవాడ
రా = రామవరప్పాడు
ని = నిడమానూరు
ఉ = ఉప్పులూరు
త = తరిగొప్పుల
ఇం = ఇందుపల్లి
దో = దోసపాడు
గు = గుడివాడ
నూ = నూజెళ్ళ
క = కవుతరం
వ = వడ్లమన్నాడు
పె = పెడన
చి = చిలకలపూడి
మ = మచిలీపట్నం (బందరు)

ఈ చమత్కారానికి శాస్త్రి గారు సంతోషించేరు. అయితే, ఆయన చెప్పిన దాంట్లో రెండో పాదంలో నూక్రాస్యాత్ అంటే ఏమిటో మాత్రం శాస్త్రి గారికి అర్ధం కాలేదు. అదే , అడిగారు ఆ పెద్ద మనిషిని.

అదా, మరేం లేదండీ, నూ = నూజెళ్ళలో, క్రా = క్రాసింగు, స్యాత్ = అవుతుంది ! అని చెప్పి, శాస్త్రి గారు ఆశ్చర్యం నుండి తేరుకునే లోపలే ఆ పెద్ద మనిషి రైలాగేక, చక్కా దిగి వెళ్ళి పోయాడుట !

( సురభి - సమాహారం నుండి)

ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా పార్వతీ పురం దాటేక లడ్డ అనే ఊరొకటి ఉంది. అక్కడ నుండి ఒరిస్తా రాష్ట్రం మొదలవుతుంది. అక్కడే, లంజ అనే ఊరు కూడా ఉందండోయ్ ! మీరు నమ్మినా , నమ్మక పోయినా ఇది ముమ్మాటికీ నిజం !

లడ్డ దాటగానే , వచ్చేది ఏ వూరని అడిగిందిట ఒకామె. రైలు చేసే చప్డుడులో ఆమెకి వినబడదో, ఏమో అని , ఆ పెద్దాయన పెద్ద గొంతుకతో , లంజ అన్నాడుట . దాంతో వాళ్ళిద్దరకీ పెద్ద తగువయి పోయిందిట ! ఈ ముచ్చట మా ప్రాంతంలో చెప్పుకుని నవ్వుకునే వారు.

తమాషాగా అనిపించే ఊరి పేర్లు చాలా కనిపిస్తాయి. అలాంటిదే, మా వేపు మల్లడుగు అనే ఊరి పేరు. ఒకాయన ప్రక్కనున్న వ్యక్తిని మీదే ఊరండీ అనడిగేడు. మల్లడుగు అని ఈయన బదులిచ్చేడు. ఎన్నిసార్లడిగినా, ఆయన నోటంట అదే జవాబు. అడిగినాయనకి కోపం తన్నుకొచ్చింది. మీకేం చెవుడా? అని కసిరాడు. మల్లడుగు ఊరికి చెందిన ఆసామీ నోరు వెళ్ళ బెట్టాడుట.

ఇవన్నీ ఇలా ఉంచితే, ఇలా తొలి అక్షరాల సాయంతో మన 18 పురాణాలు పేర్లూ గుర్తుంచుకునే వీలు కలిపించారు. పెద్దలు . ఈ శ్లోకం చాలా మందికి తెలిసే ఉండొచ్చు. తొలి అక్షరాల ముచ్చట కనుక. సందర్భం వచ్చింది కదా అని తెలియని వారి కోసం ఇక్కడ ఆ శ్లోకాన్ని పొందుపరుస్తున్నాను.
చూడండి:

వ్యాస ప్రోక్త పురాణాలు మొత్తం 18. వీటి పేర్లు వరుసగా గుర్తు పెట్టు కోవడండ కోసం ఒక శ్లోకం కంఠోపాఠం చేస్తే సరి !
చూడండి:

మద్వయం,భద్వయం చైవ, బ్రత్రయం, వ చతుష్టయమ్
అ,నా,ప,లిం,గ,కూ,స్కాని పురాణాని పృథక్ పృథక్

వివరణ:
మద్వయం - మ అనే అక్షరంతో మొదలయ్యే రెండు పురాణాల పేర్లు:

మత్స్య పురాణం , మార్కండేయ పురాణం

భద్వయం - భ అనే అక్షరంతో మొదలయ్యే రెండు పురాణాల పేర్లు:

భాగవత పురాణం , భవిష్య పురాణం

బ్ర త్రయమ్ - బ్ర అనే అక్షరాలతో మొదలయ్యే పురాణాలు 3.

బ్రహ్మాండ పురాణం , బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం,

వ చతుష్టయమ్ - వ అనే అక్షరంతో మొదలయ్యే 4 పురాణాల పేర్లు:

వామన పురాణం, వాయవ్య పురాణం, వైష్ణవ పురాణం, వరాహ పురాణం

ఇక రెండో పాదంలోని అక్షరాలతో మొదలయ్యే పురాణాల పేర్లు చూడండి:

అ - అగ్ని పురాణం
నా - నారద పురాణ:
ప - పద్మ పురాణం
లిం - లింగ పురాణం
గ - గరుడ పురాణం
కూ - కూర్మ పురాణం
స్కా - స్కాంద పురాణం

స్వస్తి.











18, జులై 2010, ఆదివారం

కుక్క , యువకుడు , ఇంద్రుడు


కాచం మణిం కాంచన మేకసూత్రే , గ్రధ్నాతి ముగ్ధేతి కిమత్ర చిత్రంఅశేషవిత్ పాణిని రేకసూత్రే , శ్వానం యువానం మఘవాన మూచే
ఒక ముద్దరాలు దండ గుచ్చుతోంది. అది చూసి , ఒక పెద్ద మనిషి ఇలా అడిగాడు : ‘‘ ఓ అమాయకురాలా ! అదేం అలా చేస్తున్నావు ? గాజు పూసను , మణిని , బంగారాన్ని ఒకే దారంలో గ్రుచ్చుతున్నావు . వింతగా ఉంది. ఇది తెలివి తక్కువ పని కాదూ ? ..’’
అందుకా ముద్దరాలు వినయంగా ఇలా జవాబు చెప్పింది: ‘‘ అయ్యా, మహా పండితుడు పాణిని మహా శయుడు సంస్ఝ్జృత భాషలో వ్యాకరణ గ్రంధం కౌముది ( పాణినీయం) వ్రాస్తూ , తద్ధిత ప్రకరణంలో, కుక్కను , యువకుని, ఇంద్రుని ఏక సూత్రంలో చెప్ప లేదూ ? శ్వయువమఘోనామ తద్ధితే అని కదా ఆ సూత్రం ! ... అఖండ మేధావి పాణిని అలా చేసినప్పుడు మా బోంట్ల సంగతి అడగడం ఎందుకులే ...’’ అంది.
పాణిని కుక్క , యువకుడు , ఇంద్రుడు - ఈ పదాల తద్ధిత ప్రత్యయాలు ఏర్పడే విధం గురించి చెప్పిన వ్యాకరణ సూత్రం ఉటంకిస్తూ ఆ కడు ముద్దరాలు చమత్కారంగా చెప్పిన సమాధానం ఇది.
మేం విజయ నగరం ప్రాచ్య కళాశాలలో చదువుకునే రోజులలో పాణిని సూత్రాలను మా వ్యవహారాలకు అనుగుణంగా సరదాగా చెప్పుకునే వాళ్ళం. ఉదాహరణకి, అజాద్యతష్టాప్ అనే పాణిని సూత్రం ఎవరయినా అప్పడగ బోతూ ఉంటే ఈ సూత్రాన్ని నవ్వుతూ వల్లె వేసే వాళ్ళం. ఇది అప్పడగడానికి మేం పెట్టుకున్న సంకేతం అన్న మాట !

17, జులై 2010, శనివారం

ఒక పీడ కల









































కింవాససైవం న విచారణీయం ,
వాస: ప్రధానం ఖలు యోగ్యతాయా:
పీతాంబరం వీక్ష్య దదౌ తనూజాం
దిగంబరం వీక్ష్య విషం సముద్ర:

‘నాకు బట్టల మీద అంత శ్రద్ధ లేదండీ, అయామ్ వెరీ సింపుల్. ’ అంటారు కొందరు కించిద్గర్వంగా. మేచింగుల కోసం , బట్టల సెలక్షన్ కోసం ఆడవాళ్ళు వెచ్చించే సమయం అంతా యింతా కాదు. గణితం వేస్తే గుండె

తరుక్కు పోతుంది. కొందరు మగవాళ్ళూ దీనికి మినహాయింపు కాదు. ఈ శ్లోకం గురించి చెప్పుకునే ముందు ఆ మధ్య నా కొచ్చిన గమ్మత్తయిన కల గురించి చెబుతాను వినండి. ఆ కల రావడం నిఝ్ఝంగా నిఝం సుమండీ ...
ఏదో ఓ మహా పట్టణంలో రోడ్డు మీద నడుస్తున్నాను. ఓ బట్టల షాపు ముందు పేద్ధ బోర్డొకటి కనిపించింది. దానిమీద ఏం రాసుందో నాకు మెళకువ వచ్చేక కూడా అక్షరం పొల్లు పోకుండా గుర్తుంది. చూడండి ...

రండి ! రండి !

దయ చేయండి. మా వద్ద చిరిగినవీ, లెక్క లేనన్ని మాసికలు వేసినవీ, అట్ట కట్టి అలుగ్గుడ్డలా ఉన్నవీ, వెలిసి పోయినవీ, చీకి పోయినవీ, మీరే లెక్క పెట్టడానికి విసుక్కునేటన్ని జేబులు కలవీ అయిన రక రకాల కొత్త జీన్ ఫేంట్లు సరి కొత్త స్టాక్ వచ్చింది. త్వర పడండి. జీబురు గడ్డం వాళ్ళకీ, తల మాసిన వాళ్ళకీ , నిక్క బొడుచుకున్న తల వెండ్రుకలు కలవారికీ ప్రత్యేక డిస్కౌంటు కలదు. ఆలసించిన ఆశా భంగం

మరో క్షణంలో అక్కడ చేరిన వేలాది మంది కుర్రాళ్ళని కంట్రోలు చేయ లేక పోలీసులు లాఠీ చార్జి చేయడం, వింత చూస్తున్న నా నుదుటి మీద కూడా ఓ దెబ్బపడడంతో మెళకువ వచ్చింది.

ఇది సరదాకి రాసింది కాదు. నమ్మక పోతే నేనేం చేయను ? త్వరలో ఇలాంటి (పీడ) కలలు
మీకూ రావాలని ఉడుకుమోతుతనంతో శపించడం తప్ప ?

ఇక, శ్లోకం చూదాం ...

ఎలాంటి బట్టలు కట్టుకుంటేనేం అని అనుకోడం తగదు సుమా అని కవి హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే, లోకం లో ఒక మనిషి యోగ్యతను అతను వేసుకున్న బట్టలను బట్టే నిర్ణయించడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది.

క్షీర సాగర మథనం జరిగేటప్పుడు శ్రీ మహా లక్ప్మితో పాటు, కాలకూట విషం కూడా పుట్టిందని తెలిసిన విషయమే కదా ? అయితే, సముద్రుడేం చేసాడో చూడండి ...
పీతాంబరధారికి ( మహా విష్ణువుకి ) తన కూతురు రమని ఇచ్చేడు. దిగంబరుని (శివుడిని ) చూసి ఈ మొఖానికిది చాలునులే అన్నట్టుగా కాలకూట విషాన్ని ఇచ్చేడు.

లోకం ఇలా ఉందండీ బాబూ , ఏం చేస్తాం !

మహాత్మా గాంధీ ఓ సారి రౌండ్ టేబిలు సమావేశానికి గావంచా కట్టుకుని పై మీది కండువాతో వెళ్తే అక్కడ వాళ్ళతనిని పోల్చుకో లేక లోపలకి పోనివ్వకుండా తరిమేసారుట.
అప్పుడు గాంధీజీ మంచి సూటు బూటు వేసుకుని వస్తే ఆదరంగా లోపలికి పంపించేరుట. సరే, లోపలికి వెళ్ళాక, విందు మొదలయితే, గాంధీజీ ఆహార పదార్ధాలను తినడం మానేసి తొడుక్కున్న ఖరీదయిన కోటు మీద వేసుకోడం మొదలెట్టారుట. ఇదేం పిచ్చి పని అని అందరూ విస్తుపోతే ఇక్కడికి రమ్మని ఆహ్వానం పంపింది నా కోటుకే కాని, నాకు కాదు కదా ! దాని విందు నేనెలా తింటాను ? అనడిగారట. అక్కడి అధికారులకి కొంచెం ఆలస్యంగా ట్యూబు లైటు వెలిగి, మహాత్ముని క్షమాపణలు వేడుకున్నారుట. ఈ కథ నిజమో కాదో కాని, చిన్నప్పుడు మా డ్రిల్లు మాష్టరు (ఆటలాడించడం మానీసి మరీ ) కథలు కాకరకాయలు చెప్పేటప్పుడు దీనిని మాకు చెప్పారు. శ్లోక సందర్భానికి సరి పోతుందనిపించి చెప్పానంతే ...



16, జులై 2010, శుక్రవారం

తిరగ బడు ! ( విప్లవం కాదు).

ఈ శ్లోకంలో చమత్కారాన్ని చూడండి ...

సాక్షరా విపరీతాశ్చేత్ , రాక్షసా ఏవ కేవలం
సరసో విపరీతో2పి , సరసత్వం న ముంచతి.

అక్షరాస్యులు విపరీతులయితే , అంటే దుర్మార్గపు వర్తనులయితే , రాక్షసులవుతారు. వారి చదువు చట్టుబండలై , మహా దూకుడుకుగా తయారవుతారు.

అంతే కదా, సాక్షరులు అంటే అక్షరాస్యులు. శ్లోకంలో సాక్షరా అనే పదాన్ని తిరగేసి చదవండి రాక్షసా
( రాక్షసులు) అని రావడం లేదూ !

అయితే, సరసుల (పండితులు ) తలక్రిందులయినా , అంటే , ఎట్టి పరిస్థితిలోను కూడా , తమ సరసత్వాన్ని వీడరు.

శ్లోకంలో రెండో పాదం మొదటి పదం చూడండి. దానిని సరస: , విపరీత: అపి అని చదువుకోవాలి.

ఇప్పుడు చూడండి ... సరస అనే పదం వెనుక నుండి చదివినా మారడం లేదు. కదూ ?

చదవేస్తే ఉన్న మతి పోతుంది కొందరికి. చదువుకున్న మూర్ఖులుగా తయారవుతారు. కొందరు మాత్రం ఎదిగిన కొద్దీ ఒదిగే లక్షణాన్ని కలిగి ఉంటారు. అదన్న మాట సంగతి.

16, జనవరి 2010, శనివారం

చలి పులిని తరిమి వేయునట్టి విధంబెట్టిదనిన ....


















గాథా
సప్త శతి లోని రమణీయమైన ఈ ప్రాకృత గాథని చూడండి ...


విక్రీణీతే మాఘ మాసే పామర: ప్రావరణం బలీవర్దేన
నిర్ధూమం ముర్ముర నిభేశ్యామల్యా: స్తనౌ పశ్యన్.



మాఘ మాసపు చలి వణికిస్తున్నది. చలి పులిలా మీద పడింది ...ఎద్దులు కొనుక్కోవాలని ఓ రైతు తన కంబళీని అమ్ముకున్నాడుట ! ఓ వెర్రి బాగులోడా ! ఎద్దుల కోసం ఈ చలి కాలంలో నీ దగ్గరున్న కంబళీ అమ్ముకుంటావూ ? మరి చలికి ఏం చేస్తావయ్యా ?! అని ఎవరో అడిగేరు. ఏముందీ, నా భార్య కౌగిలిలో పొగ రాని పొయ్యలున్నాయి కదా ! అని, జవాబిచ్చేడుట, ఆ సరసుడు ...

ఈ ప్రాకృత గాథకు శ్రీనాధుని చాటు పద్యం అందాలు కూడా చూడండి మరి ...


మాఘ మాసంబు పులి వలె మలయుచుండ
పచ్చడంబమ్ముకున్నాడుసరమునకు
ముదిత చన్నులు పొగ లేని ముర్మురములు
చలికి నొర గోయకేలుండు సైరికుండు.

14, జనవరి 2010, గురువారం

తగునా యిది మీకూ ?!


రాచరికపు రోజులలో కవులు రాజాశ్రయాన్ని పొంది, తమ కవిత్వంతో రాజు గారిని మెప్పించి వారిచ్చిన తృణమో, పణమో ప్వీకరిస్తూ ఉండే వారు.
అప్పుడు కూడ ఆశించిన దానికన్నా అధికంగా యిచ్చి అబ్బుర పరిచే వారూ, యిస్తారనుకున్నది యివ్వకుండా యిబ్బంది పెట్టే వారూ, యిచ్చిందే చాలు పొమ్మనే వారూ, చాలదని నసిగితే కించ పడకుండా మరి కొంచెం యిచ్చే వారూ ... యిలా అన్ని రకాల వారూ ఉండే వారు ...
ఐతే, కవి చమత్కారానికి సంతోషించి. వారడిగినంతా యిచ్చి, తమ ఔదార్యాన్నీ, వితరణ గుణాన్నీ చాటుకున్న మహా రాజులూ ఉండే వారు. ఈ శ్లోకం చూడండి ...

అనవేల మహీపాల ! స్వస్త్యస్తు తవ బాహవే
ఆహవే రిపురోర్దండ చంద్రమండల బాహవే.


అనవేలు వేమా రెడ్డి ప్రభువుల వద్దకు ఒక కవి వచ్చి ఆశీర్వదిస్తూ ఈ శ్లోకం చెప్పాడు. రాజు గారి శౌర్య సంపదను కీర్తిస్తూ చెప్పిన శ్లోకమిది.
ఓ సారి శ్లోకాన్ని చూస్తే అందులో ‘ వే’ అనే అక్షరాలు మొత్తం నాలుగు ఉన్నట్టు గమనిస్తాం కదూ. అసలు కథ యిక్కడే మొదలయింది ..
కవి గారి కవిత్వాన్ని మెచ్చుకుని, రాజు గారు రెండు వేల వరహాలు యివ్వ బోయేడు.
కవి గారికి కొంటె తనం, లౌక్యం జాస్తి . అందుకే వాటిని తీసుకోకుండా తనకింకా ఎక్కువ కావాలనే విషయాన్ని చమత్కారంగా తెలియ జేసాడు ...వారి మధ్య జరిగిన సంభాషణని చిత్తగించండి.
కవి : ‘‘ అయ్యా, నేను తమకి నాలుగు వేలు యిచ్చాను. తాము నాకు రెండు వేలు యివ్వడం భావ్యమా చెప్పండి ? ( శ్లోకంలో వే అనే అక్షరాలు నాలుగు ఉండడం చూసాం కదా !)
సరేలెమ్మని రాజు మొత్తం అయిదు వేలు యివ్వ బోయాడు
కవి : ‘‘ రాజా ! మేము ఆరువేల నియ్యోగి బ్రాహ్మణులము. మా గౌరవం నిలుప రాదా ?’’
రాజు మరో వరహా కలిపి, మొత్తం ఆరు వరహాలివ్వబోయేడు.
కవి : ‘‘ మాది మాకిచ్చుట న్యాయమా ప్రభూ ! ’’ ( ఆరువేల నియోగి అన్నది బ్రాహ్మణులలో ఒక శాఖ. తమ శాఖ పేరు లోనే ఆరు ‘వే ’ లుండగా రాజు ఆరింటినే యివ్వడం తగదని చమత్కారం

రాజు నవ్వుకుని, మరొకటి కలిపి, మొత్తం ఏడు వరహాలు యిచ్చాడు. దానికీ కవిగారు తలాడించ లేదు.
కవి : ‘‘ ఏడు రోదన సంఖ్య కదా రాజా !’’ అని గునిసాడు. ( ఏడు ఏడుపు గొట్టు సంఖ్య అని చమత్కారం)
కవి చమత్కార భాషణకి రాజు ఎంతగానో సంతోషించి, మొత్తం ఎనిమిది వరహాలిచ్చి కవిని గౌరవించి పంపించేడు !

ఇందులో మరో చిన్న చమత్కారం కూడా యిమిడి ఉందండీ ... రాజు గారి పేరు చూడండి ... అనవేలు వేమా రెడ్డి. ఇందులోనూ రెండు ‘వే’లున్నాయి ! అసలందుకే ప్రభువుల వారు తమ పేరుకి తగ్గట్టుగా మొదట రెండు వేల వరహాలిచ్చాడు !

6, జనవరి 2010, బుధవారం

లెక్క తేలడం లేదు !



పయస్వినీనాం ధేనూనాం
బ్రాహ్మణ: ప్రాప్య వింశతిమ్
తాభ్యోష్టాదశ విక్రీయ
గృహేత్వైకాం గృహం గత:



శ్లోకంలో కవి - ఒక బ్రాహ్మణుడు ఇరవై ఆవులను దానంగా తీసుకుని, అందులో పద్ధెనిమిది ఆవులను విపణి వీధిలోతన జీవిక కోసం అమ్మేసాడని చెబుతున్నాడు. పోనీ లెండి అన్ని ఆవులని అతడేం చేసుకుంటాడు చెప్పండి ? సరే, అలా ఆవులని విక్రయించి, యింటికి కేవలం ఒక్క ఆవుతో చేరాడుట! లెక్క ఎక్కడో తప్పలేదూ? 20 ఆవులని దానంగాతీసుకుని, 18 ఆవులని అమ్మేస్తే యింటికి రెండు (2) ఆవులతో తిరిగి రావాలి కదూ.?
మరేం లేదు ...
బాపడు దానం పట్టిన ఆవులు 20 కాదండీ ... 19 (పందొమ్మిది మాత్రమే) !
శ్లోకంలో ధేనూనామ్ అనే పదాన్ని ... ధేను: , ఊనామ్ అని చదువుకుంటే సరి ! అంటే, ఒకటి తక్కువ ఇరవై అని అర్ధం ! ఊనామ్ అంటే తక్కువ అని అర్ధం కదా?
ఇప్పుడు లెక్క సరి పోయిందోచ్ !