శుభాకాంక్షలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శుభాకాంక్షలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, జనవరి 2012, బుధవారం

చా.సో స్ఫూర్తి కార్యక్రమ చిత్రావళి


విజయ నగరం లేడీస్ రిక్రియేషన్ క్లబ్ లో ఈ నెల పదిహేడవ తేదీన చా.సో స్ఫూర్తి అవార్డు సభ జరిగింది కదా.

ఆ ఫోటోలు చూడండి:

సభకు సాదరాహ్వానం పలుకుతున్న చా.సో స్ఫూర్తి ట్రస్ట్ అధ్యక్షురాలు చాగంటి తులసి ...




వేదికను అలంకరించిన అతిథులూ, వక్తలూ, అవార్డు గ్రహీత, నవ్య వార పత్రిక సంపాదకులు,పేగు కాలిన వాసన కథల రచయిత ఎ.ఎన్. జగన్నాథ శర్మ , ...


చా.సోచిత్రపటానికి పుష్పమాలాలంకరణ చేస్తున్న డా.కె.వి.రమణాచారి, తదితరులు ...


అథ్యక్షోపన్యాసం చేస్తున్న డా. కె.వి. రమణాచారి, ఐ.ఎ.ఎస్. .....


చా.సో కథల ఆంగ్లానువాద పుస్తకం Dolls Wedding and other Stories ( అనువాదకులు: వేల్చేరు నారాయణ రావు, Devid Shulman) ఆవిష్కరిస్తున్న సభాధ్యక్షులు కె.వి.రమణాచారి గారు ...




చా.సో కథల ఆంగ్లానువాద పుస్తకాన్ని పరిచయం చేస్తున్న సుమనస్ఫూర్తి ...



చా.సో కథా పఠనం చేస్తున్న చాగంటి కృష్ణకుమారి ...



చా.సో కథల గురించి ప్రసంగిస్తున్న శ్రీ కాకరాల ...


ఈ యేడాది చా.సో. స్ఫూర్తి అవార్డు గ్రహీత ఎ.ఎన్. జగన్నాథ శర్మను రూ. పదివేలు నగదు, ఙ్ఞాపిక, దుశ్శాలువాలతో సత్కరిస్తున్న దృశ్యం ....

అవార్డు గ్రహీత జగన్నాథ శర్మ గురించి ప్రసంగవ్యాసం సభకు సమర్పిస్తున్న పంతుల జోగారావు ....




జగన్నాథ శర్మ కృతఙ్ఞతా నివేదనం ....



మరి కొన్ని .... ఆసక్తిగా ప్రేక్షకులు ...



అంతకు ముందు ఆ రోజు ఉదయాన్నే అతిథులను, అవార్డు గ్రహీతను వారికిచ్చిన విడిదికి వచ్చి, సాదరంగా పలకరించిన తులసి గారు, ఆమె సోదరి కృష్ణ కుమారి ....



విడిదిలో వచ్చి అతిథులను ఆత్మీయంగా పలకరించిన స్థానిక కన్యా శుల్కం నాటక కళాకారులు ....



సభా కార్య క్రమం ముగిసాక, చా.సో స్ఫూర్తి ట్రస్టు వారు అతిథులకూ, ఆహ్వానితులకూ చక్కని విందు భోజనం అందించారు.
ఆ సందర్భంగా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారితో కులాసాగా కాస్సేపు ...




23, జనవరి 2012, సోమవారం

అ ఆలు దిద్ది నందుకు మీరూ తలో చెయ్యీ వెయ్యండి ...ఒక విఙ్ఞప్తి.





తెలుగు ప్రపంచానికో విఙ్ఞప్తి - మూడు యాభయిల

మన గురజాడ 1862 - 2012

విజయ నగరం జిల్లా కలెక్టరు శ్రీ ఎం. వీర బ్రహ్మయ్య గారి సౌజన్యంతో తే 21.09.2011 ది నాడు వెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ ప్రారంభించిన ‘‘ మూడు యాభయిల మన గురజాడ’’ వేడుకలలో భాగంగా విజయ నగరం ఆనంద గజపతి ఆడిటోరియంలో స్థానిక కళాకారుల బృందం సమర్పించిన కన్యా శుల్కంనాటక ప్రదర్శనకి విచ్చేసిన వేలాది ప్రేక్షకులకు అంత పెద్ద హాలూ చాలింది కాదు. అదీ గురజాడ అప్పారావు ( 1862 – 1915) సాధించిన విజయం.

చూస్తున్నాం కదా ! మనకిప్పుడు కన్యాశుల్కం సమస్య అయితే లేదు. అయినా కన్యా శుల్కం నాటకం నూరేళ్ళు దాటినా నిత్య నూతనంగా నేటికీ బతికే వుంది.

కారణం ?

గ్రామ గ్రామాన గిరీశాల ఇష్టారాజ్యం ఇంకా చెల్లుబాటుగానే వుందన్న మాట.

తనతో లేచిపోయి రావడానికి బుచ్చమ్మ అంగీకరించక పోతే, ఆనాటి గిరీశం తల కొట్టుకు ఛస్తానన్నాడు. మరిప్పుడో ! మదమెక్కిన గిరీశాలు కత్తులతో వీరనాట్యం చేస్తూ పదిమందీ చూస్తూ వుండగానే మిట్ట మధ్యాహ్నం, నట్ట నడిరోడ్డు మీద బుచ్చమ్మ గొంతులు ప్రేమను అంగీకరించక పోతే తెగ నరుకు తున్నారు

‘‘ Twinkle ! Twinkle ! Little Star ’’ అంటున్న వెంకటేశాలని చూస్తూ నేటికీ ఇంటింటా వెంకమ్మలు తెగ మురిసి పోతున్నారు.

ఏ కోర్టు వరండాలో చూసినా ‘‘ నేను రామప్పంతుల్నిరా అబ్బాయీ ’’ అంటూ పలకరిస్తున్నారు నేటి రామప్పంతుళ్ళు.

ఇలా సమాజం కనిపిస్తున్నంత కాలం ‘‘ కన్యాశుల్కం’’ ఎన్నాళ్ళయినా బతికే వుంటుంది. కన్యా శుల్కం పోయి వరకట్న దురాచారం రాచపుండు లా సమాజాన్ని కుళ్ళబొడుస్తోంది. దాన్ని రూపుమాపడానికి మరో మహానుభావుడు రావల్సే వుంది. తనకనువయిన రచయితని సమాజమే తయారు చేసుకుంటుంది. ‘‘సంభవామి యుగే యుగే’’ అన్నది అందుకే.

తన వ్యాసంగానికి తను వేసుకున్న ప్రణాళికలకూ సహకరించని ఆరోగ్యం అప్పారావు గారిది. తేది 31.03.1895 నాడు డా. బ్రౌనింగ్ , గురజాడ ఆరోగ్యాన్ని సమీక్షిస్తూ ఎండలో తిరగ కూడదనీ, సైకిలు తొక్క కూడదనీ, శారీరక సుఖానికి కూడా దూరంగా వుండాలని హెచ్చరించాడంటే, గురజాడ స్వరూపం అర్ధమవుతుంది. మహారాజా కాలేజీ లెక్చరర్ గా పని చేస్తున్న గురజాడను రాజావారి ఆంతరంగిక కార్యదర్శిగా కుదిర్చారంటే అప్పారావు గారి ఆరోగ్యం పట్ల డాక్టరు ఆందోళన అర్థం చేసుకో వచ్చు.

అంత బక్కజీవీ సంస్థానం పెద్దదావా (1899) భుజాన వేసుకుని వి.యపథాన నడిపించాడు. ఎదటి పక్షం రాజులు 40 వేల రూపాయలు ఇచ్చి, దావా పనులనుండి తప్పు కోవాలని ఆశ పెడితే,

‘‘ అజీర్తి వ్యాధితో పిడికెడు మెతుకులే అరిగించు కోలేని నాకు ఈ డబ్బు ఎలా జీర్ణమవుతుంది ? ’’ అని వారిని సగౌరవంగా సాగనంపాడంటే గురజాడ రుజు మార్గం మనకు సుళువుగానే తెలుస్తుంది. ఆ రోజుల్లో అమల్లో వున్న సంస్థానం పద్ధతి ప్రకారం తను అద్దెకుంటున్న సంస్థానం ఇంటిని కొనుక్కుని తన అవసరాలకు అనుగుణంగా బాగు చేసుకోడానికి తన వద్ద సరిపడా డబ్బు లేదనీ, అందుకని దయతో రెండు వేల రూపాయలు అప్పుగా ఇప్పించాలనీ దివాణం వారికి అర్జీ ( 7.2.1913) పెట్టు కున్నాడంటే 1899 నాటి 40 వేల విలువ సుళువుగానే వూహించు కోవచ్చును. అదీ గురజాడ ఔన్నత్యం.

‘‘ రామతీర్థం’’ అయ్యంగార్ల వారి చేరీకి చెందిన ఓ ఆచార్యుల వారు 15.3.1914 నాటి తన దినచర్యలో ‘‘ రూ.8-4-0 విజయనగరం ఖర్చులకు పట్టకుని వెళ్ళినాను. సాయంకాలమునకు విజయ నగరంలో ప్రవేశించినాను. వెంటనే అప్పారావు పంతులు గారిని చూచినాను. వారు రేపు మద్రాసు వెళుతున్నామనిన్ని, వచ్చిన పిమ్మట దర్శనం ప్రయత్నం చేస్తమని చెప్పి సర్కారులోకి వెళ్ళినారు’’ అని వ్రాసుకున్నారు. తరువాత ద్వారకా వారింటికీ, రంగమ్మ గారింటికీ, శంకర్రావు పంతులుగారింటికీ తిరిగి కోటలోకి వెళ్ళడానికి ఆయన చేసిన ప్రయత్నాలు చూస్తే రాజాస్థానంలో అప్పారావుగారి కున్న హోదా తెలుస్తుంది.

మొక్కలాంటి కన్యాశుల్కం (1892) నాటకాన్ని తిరగరాసి (1909) మహా వృక్షంగా తీర్చి దిద్ది తెలుగు నాటకాన్ని ప్రపంచ స్థాయి నాటకాల సరసన నిలబెట్టిన నేర్పు గొప్పది. దాన్ని ఎరుక పర్చడానికి డా. ఉపాధ్యాయుల అప్పల నరసింహ మూర్తిగారు 722 పేజీల తులనాత్మక పరిశోధనా గ్రంథమే రాయాల్సొచ్చింది.

గిడుగు రామ్మూర్తి పంతులు ( 1863 – 1940) గారితో కలిసి వ్యావహారిక భాషోద్యమం నడిపి తెలుగు భాషను పండిత వర్గంనుండి గుంజి, ప్రజలపరం చేసాడు. వారిద్దరు నడిపిన ఉద్యమమే లేకపోయి వుంటే నేటికీ మన విశ్వ విద్యాలయాల్లో కరటక శాస్త్రి శిష్యుడిలా ‘‘ ప్రియా ముఖం కింపురుషశ్చచుంబతి’’ లాంటి సంస్కృత శ్లోకాలు వల్లె వేసుకుని స్నాతకోత్సవాల ఫొటోలను చూసుకుంటూ మురిసి పోదుం.

అంతెందుకు, ఉత్తరాన హిమాలయాలు, తూర్పున బంగాళాఖాతం లాంటి ఎల్లలేం చెప్పకుండా

‘‘ దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’’ అంటూ మనిషికే పట్ట కట్టడం బహుశా ప్రపంచ సాహిత్యంలోనే అరుదైన ఆణిముత్యంలాంటి వాక్యం.

భావకవిత్వపు జలధారలొచ్చి, గురజాడ అందించిన జీవధారని పక్కకి నెట్టాయి. పుత్తడిబొమ్మ పూర్ణమ్మకీ (1910) చెల్లి చంద్రమ్మకీ (1971) మధ్యన దూరాన్ని కల్పించిన మిడతంభొట్లు, వెతగ్గలిగితే చిక్కక పోడు. గురజాడ మార్గాన్ని తొలితరం కవులు ఏసంకోచం లేకుండా అందుకొనుంటే మన సంస్కారం ఈ తీరునుండకపోను. తెలుగు భాష అంతరించి పోతుందన్న పీకుడూ లేకపోను.

‘‘ My cause is the cause of the people and I have cultured opinion at my back. I do not mind if those who are incapable of understanding the subject array themselves against me. Their conversion can do no good to the language. They are so hopelessly wedded to the old highly artificial literary dialect.’’

మహా మహోపాధ్యాయ వేదం వేంకటరాయ శాస్త్రి ( 1853 -1929) ఆంధ్రనాటక పితామహ శ్రీ ధర్మవరం రామకృష్ణమాచార్యులు ( 1853 – 1912) పండితులు, పరిశోధకులు శ్రీ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు (1877 – 1929) లాంటి అఖండ పండితుల నుద్దేశించి అన్న ఈ మాటలు చూస్తే, శ్రీ.శ్రీ కూడా ఇంత సాహసం ప్రదర్శించ లేదు. అయితే తొలితరం కథక చక్రవర్తులు శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు పంతులు ( 1865 – 1940) , చింతా దీక్షితులు ( 1891 -1960), శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ( 1891 – 1961 ), శ్రీ గుడిపాటి వెంకట చలం (1894 – 1879) లాంటి హేమా హేమీలు కవిత్వానికి పట్టిన గతి పట్టకుండా కథను ప్రజల పరం చేసారు. నాటకం సరే. నేటికీ ‘‘ కన్యాశుల్కం ’’ స్థాయిని అందుకోటానికి ప్రయత్నాలే మొదలవలేదు.

గురజాడ స్థాయిని మనమేం తక్కువగా చూస్తున్నామా అంటే, అదేం లేదు. ఆయన ప్రపంచ స్థాయి సాహితీవేత్తల సరసనే నిలవాలని అంచనాలయితే వేస్తున్నాం కానీ, తెలుగేతర ప్రపంచం గురజాడను చూచి అబ్బురపడే స్థాయిలో ఇంతవరకూ ఏ కార్యక్రమం జరిపించుకో లేకపోయాం. మనకు గురజాడ అభిమానులకైతే కొదవేంలేదు. ‘‘ కన్యాశుల్కం నూరేళ్ళ పండగ’’ (1992) సాలు పొడుగునా అజేయంగా నిర్వహించుకొన్న ధైర్యంతో ‘‘ మూడు యాభయిల మన గురజాడ’’ కార్యక్రమం రవీంద్రుడికి, సుబ్రహ్మణ్య భారతికీ దక్కుతున్న స్థాయిలో జరుపుకోడానికి

డా. పూసపాటి ఆనందగజపతిరాజు గారు ముఖ్య పోషకులుగా కార్యక్రమాలు రూపకల్పన చేసుకున్నాం. అందుకు జాతీయ, అంతర్జాతీయ తెలుగువారైన మీరు గురజాడ ఆత్మీయులుగా ఈ కార్యక్రమానికి చేయూత అందించాలని వేడుకుంటూ శక్తిమేరకు మీ విరాళాలు ‘‘ వెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ – విజయ నగరం ’’ పేరున అందించాలని ప్రార్ధిస్తున్నాం.

21-09-2011 - 21 -09 2012 కార్యక్రమాలు.

· నెలనెలా కీలకోపన్యాసాలు.

· ప్రఖ్యాత నర్తకులచే పూర్ణమ్మ, కన్యక నృత్యరూపక ప్రదర్శనలు.

· మనిషి ప్రపంచ మానవుడిగా రపు దిద్దుకోడానికి దేశభక్తిగీతం చేసిన దిశానిర్దేశం వెలుగు పర్చడం.

· తెలుగేతర ప్రపంచానికి గురజాడని ఎరుక పర్చడం

· చివరి మూడు రోజుల మహా సభలు గురజాడ స్థాయికి తగ్గట్టు రూపకల్పన చేసుకోవడం.

· స్థానిక నటవర్గంచే ‘‘సంపూర్ణ కన్యాశుల్కం ’’ ప్రదర్శన.

· సమగ్ర ప్రత్యేక సంచిక

· బాపు గారి సచిత్ర కన్యాశుల్కం.

· విజయ నగరంలో సర్వాంగసుందరంగా సమస్త సదుపాయాలతో గురజాడ భారతి ఆడిటోరయం.

‘‘ ఏవిట్రా వీడి గోతాలు ! ’’ అనీకండేం.

ఇవన్నీ జరిగితేనే మన ఆబోరు దక్కేది.

*ఇతర వివరాలకు :

కన్వీనర్,

శాసపు రామినాయుడు,

పొనుగుటి వలస

రాజాం – 532127

శ్రీకాకుళం జిల్లా. ఆంధ్ర ప్రదేశ్, ఇండియా.

సెల్ 8985922183

28, సెప్టెంబర్ 2011, బుధవారం

కొన గోట మీటితే చాలు ... ( nail art )

నిజమే.

కొందరు కొన గోట మీటితే చాలు, అపురూప నాదాలు పలుకుతాయి. కొందరికయితే అద్భుతమైన నఖ చిత్రాలు రూపు దాల్చి అలరిస్తాయి.

రంగు ల్లేవు. కుంచెల్లేవు. ఏ ఇతర చిత్రకళా సాధన సంపత్తీ లేదు. కేవలం చేతి గోరు ఉపయోగించి 7 x 5 అంగుళాల దళసరి కాగితం మీద ఆయన ఎంతో అందమైన కళాఖండాలు చిత్రిస్తారు. ఒక తపస్సుగా సాధన చేసిన ఈ గోటి బొమ్మలు ( సంస్కృతీకరిస్తే, నఖ చిత్రాలు ) దేశ విదేశాల వారిని ఎంతగానో అలరించాయి. అలరిస్తూనే ఉన్నాయి.

ఈ నఖ చిత్రకారుని పేరు శిష్ట్లా రామ కృష్ణారావు. పార్వతీపురం స్వస్థలం. 12.4.1939 లో పుట్టారు. తల్లిదండ్రులు,సాంబశివరావు,సరస్వతమ్మ గారలు. విజయనగరం మహారాజా కళాశాలలో పట్టభద్రులు. విశాఖ పట్నం హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఉద్యోగం చేసి , నఖ చిత్ర కళ మీద ఉన్న ఎన లేని మక్కువ కొద్దీ ఆ కళలో పూర్తిస్థాయి సాధన నిమిత్తం స్వచ్ఛంద పదవీ విరమణ చేసారు.

హనుమద్యుపాసకులైన వీరు కొన్ని వేల నఖ చిత్రాలు గీసారు. గీస్తూనే ఉన్నారు.

వాల్మీకి రామాయణ గాథను దాదాపు 800 నఖ చిత్రాలలో వేసి తరించారు. 200 పైగా నఖచిత్రాలలో హనుమాన్ చాలీసాను చిత్రించి పరవశించారు.

ఇవి కాక బైబిల్, భగవద్గీత లను కూడా నఖ చిత్రాలతో అలరించి ధన్యులయ్యారు

వీరి నఖచిత్రాలు కొన్నింటిని మీ కోసం ...







వీరు తన కొనగోటితో ఎందరో మహనీయుల చిత్రాలు వేసారు. ఇవే కాక, కేవలం కొన గోటితో జంతువులు , పక్షులూ, చెట్లూ చేమలూ, నదీ నదాలూ, సముద్రాలూ ... ప్రకృతిలోని సమస్తమైన అందాలనూ చిత్రించారు.

వీరిని వరించిన బిరుదులకూ, వీరు పొందిన పురస్కారాలకూ అంతే లేదు.

నఖచిత్ర కళా బ్రహ్మ, నఖచిత్ర కళా ప్రపూర్ణ, నఖచిత్ర శిల్పి, వినూత్న కళా స్రష్ఠ, నఖ చిత్ర వాల్మీకి , విశ్వ నఖచిత్ర కళా సామ్రాట్, నఖచిత్ర కళా ధుని, చిత్ర నఖామారుతి, నఖచిత్ర కళా తపస్వి, నటచిత్ర కళా సార్వభౌమ, విశ్వ నఖ చక్రవర్తి, నఖ చిత్ర కళా విధాత .... ఇవీ వీరి బిరుదులలో కొన్ని.

The Limca Book Of Records లో చోటు చేసుకున్న నఖ చిత్రకారులు వీరు.

జవహర్లాల్ నేహ్రూ, డా. సర్వేపల్లి రాధా కృష్ణ, పి.వి.జి. రాజు, కుముద్బెన్ జోషి, ఢిల్లీ తెలుగు అకాడమీ, జి.యమ్.సి. బాలయోగి, యునెస్కో, నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబు నాయుడు, మొదలైన ప్రముఖుల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. కడప ఆర్యవైశ్య సంఘం వారు స్వర్ణ సింహ తలాటాలు, గండపెండేరం, తొడిగి గజారోహణం చేయించి అపూర్వమైన రీతిలో వీరిని సత్కరించారు. భారతప్రథాని నుండే కాక, నెల్సన్ మండేలా, బిల్ క్లింటన్ ల ప్రశంసలు అందుకున్నారు ... దేశ విదేశాలలో వీరి నఖచిత్ర కళా ప్రదర్శనలు విజయవంతంగా జరిగాయి.

ఈ గోటి బొమ్మల మేటి గొప్ప తనాన్ని సంగోరు కాదు కదా, శతాంశమైనా చెప్ప లేక పోయాను.

శలవ్.


15, డిసెంబర్ 2009, మంగళవారం

కొంటె బొమ్మల బాపు




బాపూ గారికి జన్మ దిన శుభాకాంక్షలు !!


తెలుగు రచయితలలో చాలా మందికి తమ కథలు పత్రికలలో ప్రచురించ బడేటప్పుడు దానికి శ్రీ బాపు గారు బొమ్మ వేస్తే బావుణ్ణని మహా ఉబలాటంగా ఉంటుంది.
నాకూ అలాంటి ఉబలాటమే. శ్రీరాముని దయ చేతను ఈ క్రింది కథల విషయంలో నా కోరిక తీరింది.

1. గోవు మా లచ్చిమికి కోటి దండాలు ... ఆంధ్ర జ్యోతి వార పత్రిక
2. అనాధలు కావలెను ... స్వాతి వార పత్రిక
3. గెలుపు ... ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక


కొంటె బొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలనూపు
ఓ కూనలమ్మా !
అన్న ఆరుద్ర గారి మాటలు తలుచుకుంటూ, మీకివే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.

11, డిసెంబర్ 2009, శుక్రవారం

అమ్మాయి పెళ్ళి చేయ బోతున్నారా ? ఏయే సామాన్లు సమకూర్చు కోవాలో అని సతమత మవుతున్నారా? నో టెన్షన్ ...




శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
వివాహ సమయంలో వరుసగా జరిపించే కార్యక్రమాలు, వాటికి సమకూర్చుకో వలసిన సామగ్రి
1. ఎదురుకోలు సన్నాహం : ఇది మగ పెళ్ళి వారు  కళ్యాణ మండపానికి తరలి వచ్చినప్పుడు జరిపించే విధి.
మగ పెళ్ళి వారు రాగానే ఒక కొత్త స్టీలు పళ్ళెంలో క్రింది సామగ్రి ఉంచి యిస్తారు:
పసుపు,కుంకుమ,బ్రష్. పేష్టు,అద్దం,దువ్వెన, పౌడరు,సబ్బు,సెంటు, కాటుక,తిలకం,(మేకప్ బాక్స్) నేప్కిన్.
(అక్షతలు,గంధం, హారతి కర్పూరం , పసుపు సున్నం కలిపిన నీళ్ళు సిద్ధం చేసుకోవాలి.)
2.స్నాతక వ్రతం : కావలసిన సామగ్రి: పసుపు, కుంకుమ,అగరు వత్తులు,కర్పూరం,తమలపాకులు100, చెక్కలు,50గ్రా. కొబ్బరి బొండాలు2,
కొబ్బరు కాయలు2, ధాన్యం 1 కేజీ, బియ్యం 3 కేజీలు, వరిపిండి పావు కేజీ, ఆవు నెయ్యి పావు కేజీ,వత్తులు, ప్రమిదలు8 (చిన్నవి) , గంధం, పన్నీరు, గావంచాలు2,అరటి పళ్ళు 3 డజన్లు, వరునికి చెప్పుల జత, గొడుగు, చేతి కర్ర, అద్దం, దువ్వెన, కాటుక భరిణె, నలుగు పిండి పావు కిలో. పువ్వులు, చిన్న పువ్వుల దండ, 1 పెళ్ళి పీట, 2 పీటలు, ఒక బేసినుతో యిసుక, హోమం పుల్లలు 2 కట్టలు, కర్ర పేళ్ళు, విసనకర్ర, అగ్గి పెట్టె, 3 స్టీలు గ్లాసులు, 2 పళ్ళేలు, 2 చిన్న యిత్తడి గిన్నెలు మామిడి కొమ్మలు
పెండ్లి కుమారుని బట్టలు
3.తోట ఉత్సవం : పసువు పావు కిలో, కుంకుమ పావు కిలో, అగరు వత్తులు, కర్పూరం, తమలపాకులు100, గ్రా. చెక్కలు100 గ్రా . బుక్కా,భర్గుండ, పటుక బెల్లం, 2 పెద్ద కర్పూర హారాలు, తగినన్ని చిన్న కర్పూర హారాలు, సెంటు, లవండరు, గంధం, అక్షతలు, గంధం గిన్న, పన్నీరు బుడ్డి,
2 పానకం బిందెలు, 2 కొత్త గ్లాసులు, 1కిలో పంచదార పానకం,అరటి పళ్ళ గెల, వివాహ పత్రిక, పువ్వులు,మామిడి కొమ్మలు, అగ్గి పెట్టె.
తోట ఉత్సవంలో పెట్ట వలసిన బట్టలు.
4.అంకురార్పణ : పసుపు, కుంకుమ, అగరుబత్తులు, కర్పూరం తమలపాకులు,25, చెక్కలు 25 గ్రా. బియ్యం 2 కిలోలు,
పాలికలు 6, ప్రమిదలు 10, పుట్టమన్ను, నవధాన్యాలు, కొత్త దారపు రీలు, గంధం, దీపం, ఒత్తులు, ఆవు నెయ్యి,పావు కిలో, అరటి పళ్ళు ఒక డజను, కొబ్బరి కాయ, కొబ్బరి బొండాం, పెసర పప్పు పావు కిలో, అప్పడాలు2 ఒడియాలు2 మామిడి కొమ్మలు, కొబ్బరి కురిడీలు2, సన్నికల్లు, పొత్రం, ఒత్తుల పేకెట్టు, ఇంట్లోవి 3 గ్లాసులు, 3 చెంబులు, దేవుని ఫోటో, దీపం కుందెలు, 2 , చిల్లర పైసలు, పీట మీద వెయ్యడానికి గావంచా. అగ్గి పెట్టె. మామిడి కొమ్మలు.
5. గౌరీపూజ : గౌరీ గంప, బియ్యం 5 పావులు, పసుపు కొమ్ములు, కొబ్బరు బొండాం, దీపం, కుంకుమ భరిణె, గంధం చెక్క, గుమ్మడి పండు, అగరు బత్తులు, మామిడి కొమ్మలు, తమలపాకులు25 చెక్కలు
6. లగ్నము : పసుపు పావు కిలో, కుంకుమ పావు కిలో, పసుపు కొమ్ములు పావు కిలో, అగరు వత్తులు, కర్పూరం, తమలపాకులు, 100, చెక్కలు 100 గ్రా. తలంబ్రాల బియ్యం 1 కిలో,
కాళ్ళు కడుగు పళ్ళెం, చెంబు, తెర సెల్లా దుప్పటి, మధు పర్కాలు, గుమ్మడి పండు, 5 కాయలుండే కొబ్బరి కాయల గుత్తి, అరటి పళ్ళ గెల, బెల్లం దిమ్మ (చిన్నది),
సిద్ధం చేసుకోవలసిన ఇతర సామగ్రి: జీల కర్రబెల్లం నూరిన ముద్ద, వెండి జంద్యం, నల్ల పూసలు, మంగళ సూత్రాలు, వెంటి మట్టెలు, దారపు రీలు,
చుట్టు ఉంగరం, పువ్వులు, పెద్ద సైజు పువ్వుల దండలు2, పాలు,
చిన్న ప్రమిదలు6, జ్యోతి దీపాలకు నలుగు పిండి పావు కిలో, ఆవు నెయ్యి పావు కిలో, గౌరీ గంప, గంధం చెక్క, పేలాలు, హోమం పుల్లల కట్టలు2 కర్ర పేళ్ళు, వరిపిండి 100 గ్రా,
సన్నికల్లు, పూజు, పెళ్ళి పీట, కర్పూర హారాలు, హారతికి కర్పూరం,
ఒడి కట్టు చీర,వెండి గిన్నె, కంద దుంప, గంధపు చెక్క, ఉయ్యాల చీర, బొమ్మ, ఆభరణం చీర(నగ చీర),
అప్పగింతల బట్టలు, తెరసెల్లా, అలక పానుపు దుప్పటి, బకెట్ (స్టీలుది), తాడు, దొంగవిల్లి గిన్నె (వెండిది),
దంపతుల తాంబూలాలకి 10 కొబ్బరి బొండాలు
స్థాలీపాకం గిన్నె (చిన్న యిత్తడి గిన్నె), చిల్లర డబ్బులు, మామిడి కొమ్మలు, అగ్గి పెట్టె. పీటల మీద గావంచా.
తగువు : తగువులో యిచ్చే స్వీట్లు. అప్పడాలు, ఒడియాలు, అరిసెలు, అటుకులు
హోమం : చిన్న ఇత్తడి గిన్నెలు4 హోమం పుల్లలు, ఆవు నెయ్యి
పై వస్తువులన్నీ కార్యక్రమాల వారీగా Packets కట్టుకుంటే గాభరా ఉండదు.కొన్ని common వస్తువులు ex. పెళ్ళి పీట, పూజు. సన్నకల్లు, పూల దండలు లాంటివి Packets లో కట్టలేం కనుక వేరే సిద్ధం చేసుకోవాలి.
వీటిలో సన్నికల్లు, పెళ్ళి పీట, పూజు లాంటివి కేటరర్ తెస్తాడేమో అడగాలి.ఐతే, కేటరర్ పై వాటిలో తాను సమకూరుస్తానని చెప్పిన వస్తువుల గురించి అడిగి, అతని చేతనే భోజనాల మెనూ రాసుకునేటప్పుడే అతను తెస్తానన్న వస్తువుల జాబితా కూడా ఖాయం చేసుకుని Note చేయించాలి.
పెండ్లి రాట వేసేటప్పుడు కాపెంవలసిన సామగ్రి.
పసుపు, కుంకుమ, అగరు బత్తి కట్ట, అరటి పళ్ళు 2 డజన్లు, తమలపాకులు 50, చెక్కలు 50గ్రా. కర్పూరం 2తు. పసుపులో ముంచిన తెల్లని వస్ర్తం, పెద్ద దారపు రీలు, నవధాన్యాలు, పాలు అర లీటరు, పంచ లోహాలు (మంచి ముత్యం, పగడం,బంగారం, వెండి, రాగి కానీ) , విచ్చు రూపాయలు, చిల్లర పైసలు తగినన్ని,
పందిరి రాటకు : నేరేడు కొమ్మ, పాల కొమ్మ, భరిణి కొమ్మ,
మామిడాకులు, కొబ్బరి కాయ1
0 0 0
పై విధంగా ఆయా సందర్భాలలకి గాను సమకూర్చుకో వలసిన మరియు packets కట్టడానికి కావలసిన మొత్తం వస్తువుల జాబితా యిది :
ABSTRACT
పసుపు
కుంకుమ
కొబ్బరి బొండాలు 15
కొబ్బరి కాయలు 5
5కొబ్బరి బొండాల గుత్తి ఒకటి.
ఆవు నెయ్యి
అరటి పళ్ళ గెలలు 2 (లగ్నానికి, ఇతరాలకు)
చిన్న బెల్లం దిమ్మ
మొత్తం అన్ని కార్యక్రమాలకి గాను బియ్యం 16 కిలోలు
తగువు సామాను (మీద రాసిన విధంగా) గుమ్మడి పండు పసుపు కొమ్ములు
పెండ్లి పీట, సన్ని కల్లు, పూజు, పొత్రం ,చిన్న పీటలు2
కొత్త స్టీలు పళ్ళెం (పైన రాసిన విధంగా ఎదురుకోలు సామగ్రి)
కాళ్ళు కడుగు పళ్ళెం. చెంబు,
గ్లాసులు2 పానకం బిందెలు2 పానకం
హామానికి ఇత్తడి గిన్నెలు2
స్టీలు బకెట్, తాడు, వెండి దొంగ విల్లి గిన్నె, వడి కట్టు గిన్నె,బొమ్మ, గంధం చెక్క, హోమం పుల్లలు, పుట్ట మన్ను, వరిపిండి, పేలాలు, ప్రమిదలు, పాలికలు , ఉత్తర జంద్యం,ఒత్తులు,కుందులు , కుంకుమ భరిణె, ఎదురుకోలు సామాను, నలుగు పిండి, గౌరీ గంప, పువ్వులు, పూల దండలు (పెద్దవి2 లగ్న సమయానికి) చిన్న పూల దండ (స్నాతకానికి)
కర్సూర హారాలు 4 (పెద్దవి) చిన్న కర్పూర హారాలు తగినన్ని,
కంద దుంప, హామానికి పుల్లలు, బేసినుతో ఇసుక,విసన కర్ర, దేవుని ఫొటో, అద్దాలు 2 దారపు రీళ్ళు పెద్దవి2
జీలకర్ర,బెల్లం నూరిన ముద్ద. మంగళ సూత్రాలు, నల్ల పూసలు.
పన్నీరు బుడ్డి, లవండరు, సెంటు, బుక్కా భర్గుండ, చిన్న కర్పూర హారాలు, వివాహ పత్రిక, పటిక బెల్లం ధాన్యం, స్నాతకం సమయంలో అవసరమయితే, ( యివ్వాల్సి వస్తే) ఓ పాత లుంగీ
గొడుగు. చెప్పుల జత, చేతి కర్ర, వెండి జంద్యం, మట్టెలు, మంగళ సూత్రాలు, నవ ధాన్యాలు, కుందులు, ఇంట్లోవి గ్లాసులు, చెంబులు, చిల్లర పైసలు, పంచ లోహాలు, మామిడాకులు. పాలు, పెండ్లిరాట సామాను, పెండ్లి రాట కొమ్మలు. తమలపాకులు, చెక్కలు, అగరబత్తులు వగైరా పూజ సామాను ...
మొత్తం స్నాతకం,అంకురార్పణ,గౌరీ పూజ, లగ్నం, తలంబ్రాలు, స్థాలీ పాకం కార్యక్రమాలకి గాను బియ్యం సుమారుగా 16 కిలోలు.
అక్షతలు అన్ని వేడుకలకూ తగినన్ని.
సమకూర్చు కోవలసిన బట్టల వివరాలు :
వీటిలో మగ పెళ్ళి వారు, ఆడ పెళ్ళి వారు ముందు అనుకున్న విధంగా బట్టలని సమకూర్చు కోవాల్సి ఉంటుంది.
పెళ్ళి కుమార్తెకి పట్టు చీరలు
తోట లాంఛనం బట్టలు
అప్పగింతల బట్టలు
ఇవి కాక - ఆడ పెళ్ళి వారు సిద్ధం చేయాల్సినవి:
పెండ్లి పీటల మీదకి గావంచాలు
మధుపర్కాలు
తెర సెల్లా దుప్పటి
అలక పానుపు దుప్పటి
ఒడికట్టు చీర
ఉయ్యాల చీర
పురోహితునికి చీర, పంచెల చాపు.
N.B పెండ్లి చేయించే పురోహితుని చేత పెండ్లికి కావలసిన జాబితా రాయించి, పై వాటితో సరిచూసుకోవాలి.
మన తాహతు బట్టి, వేడుకను బట్టి, అవసరాన్ని బట్టి , ఆచారాన్నిబట్టి పై జాబితాలో మరి కొన్ని వస్తువులు చేరనూ వచ్చు, తగ్గనూవచ్చు, మార్పు చెందనూ వచ్చు... ఎలాగంటే ... వెండి వస్తువులబదులు బంగారం వస్తువులు పెట్టుకో వచ్చు కదా ? ... అలాగే, మనసాంప్రదాయాలను అనుసరించి కూడా మారే అవకాశం లేకపోలేదు...ఏమయినా ... పురోహితుని అడిగి , దీనితో చెక్చేసుకోమని సూచన ...బ్రాహ్మణ శాఖలలో ఇది చాలా మందికిసుపరిచితమైన జాబితాయే ... ఏతావాతా , ఇది బ్లాగులో పెట్టడంకేవలం నా సరదా కొద్దీ మాత్రమేనండోయ్ ...
మంగళం మహత్
శ్రీ శ్రీశ్రీ