సమస్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సమస్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, ఏప్రిల్ 2012, ఆదివారం

మరీ ఇంత అన్యాయమా, మీరైనా చెప్పండి ...



ఆదివారం 15 ఎప్రిల్ 2012

మరీ ఇంత అన్యాయమా, మీరైనా చెప్పండి ...

ఈ కథామంజరి నస బ్లాగు ఉంది చూసారూ ? దాని ఓనరు పరమ పిసినారి సుమండీ. ఏడాదిగా అతని దగ్గర ఎంతో వినయంగా పని చేస్తున్నాను. ఒళ్ళు దాచుకో కుండా పని చేస్తున్నాను. ఒళ్ళు హూనం చేసుకొని అతని ఇంటిని శుభ్రం చేసే చాకిరీ నాదే. రోజూ వాడి ఇంటిని శుభ్రం చేసే పని నాదే. చేసేది వాడే అయినా నన్నుఉపయోగించు కుంటున్నాడు కనుక నేనే ఆ చాకిరీ అంతా చేస్తున్నట్టు లెఖ్ఖ కదా ! ఇంత చాకిరీ వాడి కోసం చేసినా , వాడు నామీద రవంత ప్రేమ కూడా చూపించడు.

పనంతా అయ్యేక దులిపి ప్రక్కకి విసిరేస్తాడు. నన్నసలు మళ్ళీ వాడి అవసరం వచ్చే వరకూ తాకనయినా తాకడు.

సరే వాడి పాపాన వాడు పోతాడులే.

ఈ మధ్య జుత్తు బాగా పెరిగి పోయి ఒకటే చిరాగ్గా ఉంది. నన్ను చూస్తూనే‘‘ తలమాసిన వెధవా’’ అంటూ తిడుతున్నాడు. నాకు ఒళ్ళు మండి పోతోంది. వాడి బ్లాగును ఎవడూ చూడకుండు గాక ! చూసినా ఒక్క కామెంటూ పెట్టకుండు గాక ! వాడి తొక్కలో సిస్టం చీటికీమాటికీ మొరాయించు గాక ! అని వాడిని మనసులోనే శపించేను.

వాడి ఇల్లంతా శుభ్రం చేయడం కోసం నన్ను ఇంతగా హైరానా పెడతాడా ? నా ఒళ్ళంతా చీదరగా ఉంది. మురికి పట్టి పోయాను. సబ్బో గిబ్బో పెట్టి కొంచెం స్నానం చేయిస్తే వాడి సొమ్మేం పోయింది ? నా వొంటిని అంటిన దుమ్మూ ధూళిని వదిలించడానికట - నన్నుటేబిలు అంచుకేసి టపా టపా బాదేడు. ఊపిరాడింది కాదు. వాడి మీద ఏ మర్డరు కేసో పెట్టి బొక్కలో తోచించేస్తేనో అన్నంత కోపం వచ్చింది.

ఆ మధ్య వాడి ఫ్రెండొకడు వచ్చి , నన్ను చూసి పగలబడి ఒకటే నవ్వడం ! నా తల తీసేసి నట్టయింది.

ఎంత అవమానం !

‘‘ఈ తలమాసిన శాల్తీ ఎక్కడిదోయ్ ! ’’ అని వెక్కిరిస్తూ ఒకటే నవ్వేడు.

ఇహ నేను ఈ కథామంజరి ( ఏకైక నస బ్లాగు ) గాడి అథార్టీ భరించ లేను. కానీ ఏమీ చెయ్య లేను కదా. చేతిలో ఎర్ర ఏగానీ కూడా లేని వాడిని కదా ? అస్వతంత్రుడిని కదా !

అంచేత మనమే తగ్గాలి. ఒదిగి ఉండాలి. శాంతం భోషాణం పెట్టె అన్నారు పెద్దలు.

ఇలా ఉండగా , నాకో దివ్యమైన ఆలోచన వచ్చింది. పోనీ మనమే జుత్తు కటింగ్ చేయించుకుని కాస్త ట్రిమ్ గా తయారై కనిపిస్తేనో ? అప్పుడయినా ఈ వెటకారాలూ , వెక్కిరింతలూ తగ్గిస్తాడేమో?!

ఈ ఆలోచన వచ్చేక , మా కథా మంజరి గాడి మూడ్ బాగుందని అనుకుని నా మనసులో మాట వాడి ముందు బయట పెట్టాను

‘‘ పారూ, జుత్తు బాగా పెరిగి పోయింది. తల మాసి పోంది. చిరాగ్గా ఉంది. సెలూన్ కి వెళ్ళి క్షవరం చేయించుకు రావాలనుకుంటున్నాను. డబ్బులివ్వరూ ? ’’ అని దేబిరిస్తూ అడిగాను.

అంతే. వాడేమన్నాడో తెలుసునా ?

‘‘ ఓరి జుత్తుల పోలిగా ! నీకు క్షవరం కూడానా ? దండగ ఖర్చు ! అట్టే మాట్లాడితే పెంట మీద విసిరి పారెయ్య గలను జాగ్రత్త !’’

అని కసిరేడు. ఏడాదిగా నా చేత అరవచాకిరీ చేయించుకొని ఇంత మాటంటాడా ! మరీ ఇంత అన్యాయమా, మీరే చెప్పండి ?

నా తమ్ము డొకడు ఉన్నాడు. మా ఓనరు గాడి షేవింగు కిట్ లో ఉన్నాడు. వాడూ నాలాగే తలంతా మాసిపోయి, జుత్తుల పోలి గాడిలా ఉన్నాడు.

ఏదో ఒక రోజున మా కథామంజరి నస బ్లాగరు ఓనరు మహాశయుడు మా ఇద్దరినీ పెంట కుప్ప మీద విసిరి పారెయ్యక తప్పదనిపిస్తోంది. ఈ అన్యాయం ఖండించే వారే లేరా ? మము బ్రోచే వారే లేరా ! హే ! భగవాన్ !

గమనిక : ఈ టపాలో వాడిన‘‘ ఇల్లు ’’ అనే పదమునకు మానిటరూ, సీ.పీ.యూ, కీ బోర్డూ, మౌసూ, ప్రింటరు, స్కానరూ వగైరాలని అర్ధం చేసుకో గోరుతాను.

ఇట్లు,

తమ విశ్వాసపాత్రుడు,


7, జనవరి 2012, శనివారం

చెప్పండి చూద్దాం !-4.



ఈ సంస్కృత శ్లోకార్ధం సుబోధకం. సరళం. దీనికి ఒక చక్కని అనువాద పద్యం మన తెలుగు శతకాలలో ఒక దానిలో శతకకారుడు రచించేడు. ఆ పద్యం ఏమిటో చెబుదురూ !

అజగామ యదా లక్ష్మీ: నారికేళ ఫలాంబువత్,

నిర్జగామ యదా లక్ష్మీ: గజ భుక్త కపిత్థవత్

నిజానికీ సమస్య మన పెద్దల కోసం ఇచ్చినది కాదు. పిల్లలలో తెలుగు భాషాబిమానం పెంపొందించడానికి ఇలాంటి సమస్యలని మనమే తయారు చేసుకుందాం.

1. ముందుగా పిల్లలకి ఈ శ్లోకం లోని ముఖ్యమైన పదాలకు అర్ధాలు చెప్పాలి.

2. వాటికి తెలుగులో ఉన్న పర్యాయ పదాలు కూడా చెప్పాలి.

3. శ్లోక భావం మాత్రం చెప్ప కూడదు.

4.తరువాత తెలుగులో వచ్చిన ప్రసిద్ధమైన శతకాలు వారి ముందు ఉంచాలి. వీలైనంత వరకూ భావాలతో కూడిన శతకాలు ఇవ్వాలి ( అప్పుడు వారి పని కొంత సుళువవుతుంది )

5.వాటిలో ఈ శ్లోకానికి అనువాద పద్యం ఉన్న శతకాన్ని ఉంచడం మరిచి పోకూడదు.

6. ఇప్పుడు ఈ శ్లోకార్ధం ఇచ్చే పద్యం వారినే వెతికి చెప్ప మనాలి.

7. గెలిచిన పిల్లలకు బహుమానాలు ఇవ్వాలి.

8. చెప్ప లేక పోయిన వారికి మరో అవకాశం ఇవ్వాలి.

నేను హైస్కూల్లో తెలుగు పండితునిగా పని చేసే రోజులలో పిల్లలు ఈ రకమయిన సమస్యలతో ఇచ్చిన క్రీడలను ఎంతగానో ఇష్ట పడే వారు. చురుకుగా పాల్గొనే వారు.

టీ.వీ లకో, వార్తా పత్రికలకో అతుక్కు పోకుండా పిల్లలతో మమేక మవుదాం ! ఏమంటారు ?

14, మే 2011, శనివారం

రూపాయి ... పాయె ! ఏమై పోయింది చెప్మా ?


మా చిన్న తనంలో మా నరసింహం బాబాయి ఈ లెక్క చెప్పి, మమ్మల్ని జవాబు చెప్పమని అడిగాడు. మేం బిక్క ముఖాలు వేసేం.

ఈ వేసవిలో మీరు కూడా మీ పిల్లకాయలకి ఈ లెక్క చెప్పి, జవాబు చెప్పమని అడగండి.
ఏం చెబుతారో చూడండి:

ఇదిగో ఆ లెక్క:

రాముడు, భీముడు ఇద్దరూ మంచి స్నేహితులు. వాళ్ళు తమ బెస్ట్ ఫ్రెండ్ సోముడి పుట్టిన రోజు కానుకగా ఏదేనా మంచి కానుక కొని ఇద్దామని బజారుకి వెళ్ళారు.

షాపులో ఒక మంచి బొమ్మని చూసి అదెంత అని, అడిగారు. అప్పుడు షాపు యజమాని లేడు. పని కుర్రాడు ఏభై రూసాయలు అని చెప్పాడు.

సరే అని రాముడు , భీముడు చెరో పాతిక రూపాయలూ ఇచ్చి, బొమ్మను కొన్నారు. వాళ్ళు ఆ బొమ్మను కొని ఇంటికి వెళ్ళాక, ఆ షాపు పని కుర్రాడు వచ్చి, వారికి మూడు రూపాయలు తిరిగి ఇచ్చి వేస్తూ ఇలా అన్నాడు : ‘‘ ఈ బొమ్మ నేను మీకు ఏభై రూపాయలకు అమ్మేను కదా. కానీ, మా యజమాని వచ్చి, దీని ధర ఏభై కాదని, నలభై అయిదు రూపాయలే ననీ, తిరిగి అయిదు రూపాయలు మీకు ఇచ్చి రమ్మన్నాడనీ చెప్పాడు. అయితే వచ్చే దారిలో తను ఆ అయిదు రూపాయలలో రెండు రూపాయి ఎక్కడో పారేసానని, అందు వల్ల వారికి మూడు రూపాయలే ఇస్తున్నాననీ అన్నాడు. అంతే కాక, తాను రెండు రూపాయలు పారేసిన సంగతీ, మూడు రూపాయలు మాత్రమే వారికి ఇచ్చిన సంగతి యజమానికి చెప్ప వద్దని కూడా బ్రతిమాలు కొన్నాడు.

రాముడు, భీముడు భలే, భలే అనుకుంటూ, వచ్చిందే చాలుననుకుని ఆ మూడు రూపాయలూ తీసు కున్నారు. షాపులో బొమ్మ కొనడానికి చెరో పాతికా ఇచ్చేరు కనుక, తిరిగి ముదరాగా వచ్చిన మూడు రూపాయలని కూడా వారిద్దరూ సమానంగా చెరి రూపాయిన్నర చొప్పునా పంచు కున్నారు.

ఇదీ కథ. ఇప్పుడు అసలు ప్రశ్ప ఏమిటంటే,

రాముడు భీముడు కలిసి షాపు పని వాడికి ఇచ్చిన మొత్తం చెరొక పాతిక - అంటే ఏభై రూపాయలు.

బొమ్మ అసలు ఖరీదు నలభై అయిదు.

పని వాడు తెచ్చినది ఐదు రూపాయలు.

వాడు పారేసానని చెప్పినది రెండు రూపాయలు.

రాముడు , భీముడు పంచు కున్నది - చెరొక రూపాయన్నర. మొత్తం మూడు రూపాయలు.

ఇప్పుడు చెప్పండి:

బొమ్మ అసలు ధర నలభై అయిదు . పంచు కొన్నది మూడు. పని వాడు పోగొట్టు కున్నది రెండు . మొత్తం ఏభై.

లెక్క సరి పోయిందే !

ఇప్పుడు ఇదే లెక్కని ఇలా చూడండి:

బొమ్మ కోసం మొదట రాముడు తన వాటాగా ఇచ్చినది : 25 రూపాయలు.
భీముడు తన వాటాగా ఇచ్చినది: 25 రూపాయలు
మొత్తం: 50 రూపాయలు. అయితే వారికి తిరగి పని వాడు తెచ్చి ఇచ్చినది మూడు రూపాయలు.

పని వాడు తెచ్చి ఇచ్చిన దానిలో రాముడి వాటాగా వచ్చినది రూపాయిన్నర. అంటే, రాముడి జేబు లోనుండి తీసి ఖర్చు చేసిన మొత్తం ఎంతన్నమాట ? ఇరవై మూడు న్నర రూపాయలు. అంతే కదా !

అలాగే, భీముడికి తన వాటాగా వచ్చిన రూపాయిన్నర కలిపితే వాడి వాటాగా ఖర్చయినది ఎంతన్నమాటా ?

ఇరవై మూడున్నర రూపాయలు. అంతే కదా ?

ఇప్పుడు రాముడు, భీముడు తమ జేబుల లోనుండి ఖర్చు చేసిన డబ్బు మొత్తం కూడితే ఎంతవుతోందీ ?

ఇరవై మూడున్నర + ఇరవై మూడున్నర = 47 రూపాయలు. కదా !

పని వాడు పారేసినది ఎంతా ? రెండు రూపాయలు. అంతే కదా ?

ఇప్పుడు రాముడు, భీముడుల అసలు నిఖర ఖర్చు 47 రూపాయలు + పని వాడు పారేసిన 2 రూపాయలు = 49 రూపాయలు.

అరే ! ఒక రూపాయి తక్కుఃవ వస్తోందే ? ఏమయి పోయింది చెప్మా ?!

టాఠ్ ! రాముడు ; భీముడుల నిఖర ఖర్చు 47 , పని వాడు పారేసినది 2 మరి వాడు ఇచ్చినది మూడు రూపాయలు కదా. దానిని కలపొద్దూ అంటారా ? సరే, మీ ఇష్టం. నాదేం పోయింది ? అలాగే కలపండి. కానీ అప్పుడు మొత్తం 52 అయి పోవడం లేదూ ? అదనంగా ఈ రెండు రూపాయలూ ఎక్కడి నుండి వచ్చేయి చెప్మా ?




మన రూపాయి ఎక్కడికీ పోలేదు. ఎక్కువా కాలేదు. ఇక్కడే ఉంది. కదూ !

21, అక్టోబర్ 2010, గురువారం

ఛూ, మంత్ర కాళీ !!!


పేక ముక్కలతో రకరకాల గమ్మత్తులు చేయడం మనలో కొందరకి కొట్టిన పిండి.
మా చిన్నప్పుడు మా సింహం బాబాయి పేక ముక్కలతో ఒక మేజిక్కు తరుచుగా మా దగ్గర చేసి చూపెడుతూ ఉండే వాడు. నాకు సరిగా గుర్తు లేదు కానీ, పేక ముక్కలను మూడో, నాలుగో వరసలుగా పేర్చే వాడు. ఏదో ఒక ముక్కను మనసులో తలుచుకో మనే వాడు. తర్వాత, నువ్వు తలుచుకున్న ముక్క ఈ వరసలో ఉందా? అంటూ వరసల వారీగా అడిగే వాడు. మేం ఉందనో, లేదనో చెప్పాక, ఛూమ్ మంత్రకాళీ అంటూ ఒక వికటాట్టహాసం చేసి, మేం తలుచుకున్న ముక్క ఏదో కరెక్టుగా చెప్పీసే వాడు. మేం నిబిడాశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టీసే వాళ్ళం. తనకిలాంటి మంత్రాలూ, తంత్రాలూ చాలా చేతనవుననీ, సరిగా చదవక పోతే మమ్మల్ని పాషాణాలుగా ( అంటే, బండ రాళ్ళుగా నన్న మాట.ఆ అర్ధం కూడా మా సింహం బాబాయే చెప్పాడు) మార్చేస్తాననీ బెదిరించే వాడు.నిజమే కాబోలుననుకుని, మేం బెదరి పోయి బుద్ధిగా పుస్తకాలు తీసే వాళ్ళం. ఆ ట్రిక్కు కాస్త పెద్దయాక మాకూ తెలిసి పోయిందనుకోండి !

అలాంటి ట్రిక్కునే ఉపయోగిస్తూ అక్షర ప్రశ్న పేరిట మన వాళ్ళు ఒక పద్యం చెప్పారు.ఆ సీస పద్యంలో ఏ అక్షరాన్ని తలుచుకున్నా మనం కనిపెట్టెయ్య వచ్చును. ఈ అక్షర ప్రశ్న ట్రిక్కు కోసం ఆ కవిగారు మన కోసం ఒక సీస పద్యాన్నీ, ఒక కీ బోర్డునీ (అదీ పద్య రూపం లోనే) తయారు చేసి సిద్ధంగా ఉంచేరండోయ్ ! ఆ వైనాన్ని చూడండి మరి:

(1)
అరి భయంకర చక్ర కరి రక్ష సాగర
శాయి శ్రీ కర్పుర సాటి యుగళ
(2)
నాళీక సన్నిభ నయన యండజవాహ
వాణీశ జనక వైభవబిడౌజ
(4)
రాజీవమందిరా రమణ బుధా భీష్ట
వరజటిస్తుత శైరి వాసు దేవ
(8)
భూరి కృపాకర బొబ్బిలి పురపాల
పాప భుజంగమ పరమగరుడ
(16)
దోష శైలేశ శచి దక్ష ద్రుహిణ హేళి.

ఈ పద్యంలో మీరు ఏదో ఒక అక్షరాన్ని కోరుకోవచ్చును.
అయితే, ఆ కోరు కోవడంలో మాత్రం కొన్ని నిబంధనలు పాటించి తీరాలి.
అవేమిటంటే,
1.అచ్చులలో అకారం మాత్రమే తలుచు కోవాలి.
2.హల్లులలో అనునాసికాక్షరాలయిన క వర్గ, చవర్గ పంచమాక్షరాలు తలుచుకో కూడదు.
తలుచుకోకూడదు.
3. గుణింతంతో పని లేదు.
4.న,ణ లకూ ర,ఱ లకూ అభేదం పాటించాలి.

ఈ నిబంధనలకు లోబడి మీరు మీది పద్య పాదాలలో ఏదో ఒక అక్షరాన్ని తలుచుకో వచ్చును.

ఉదాహరణకి మీరు ళ అనే అక్షరం తలుచుకున్నారనుకోండి( కాసేపు మీరు తలచుకున్న అక్షరం ళ అని నాకు చెప్పలేదు అని కూడా అనుకోండి. అబ్బ ! కాసేపు అనుకుందురూ !) ఇప్పుడు నేనడిగే ప్రశ్నలకి మీరు జవాబులు చెప్పాలి. నా ప్రశ్పలూ, మీ జవాబులూ ఇలా ఉంటాయి:
నేను: మీరు తలుచుకున్న అక్షరం (1) వ నంబరు వేసి ఉన్న పాదంలో ఉందా?
మీరు: ఉంది.
నేను: రెండవ పాదంలో ఉందా?
మీరు: ఉంది.
నేను: మరి, మూడవ పాదంలో ఉందా?
మీరు: లేదండీ బాబూ !
నేను: నాలుగవ పాదం లోనో?
మీరు: అబ్బ ! గొప్ప నసగాడిలా ఉన్నావే? నేను తలుచుకున్న అక్షరం అందులో కూడా లేదయ్యా, మగడా అంటే వినవేం!
నేను: కోప్పడకు. శపించీ గల్ను. పోనీ, చివరి ప్రశ్న. అయిదో పాదంలో ఉందా? కాస్త చెబుదూ !
మీరు: ఆ! ఉంది. ఉంది ...

మన అడగడాలూ, చెప్పడాలూ పూర్తయాయి. నేను ఆ అక్షరం ఏదో చెప్పడమే మిగిలి ఉంది.

దానికి నేను అవలంబించే పద్ధతి చూడండి:

మీరు తలచిన అక్షరం తొలి రెండు పాదాలలోనూ, ఐదవ పాదంలోనూ ఉందని అన్నారు. కదూ?
ఆ పాదాల ముందు వేసి ఉన్న అంకెలు చూడండి. 1 , 2, 16 ఈ మూడు అంకెలనీ కలపండి.
19 వచ్చింది. కదా ! ఈ మొత్తం 19 రాగానే ఈ క్రింది కీ సాయంతో మీరు తలుచుకున్న అక్షరం ళ అని నాకు సులభంగా తెలిసి పోతుంది.

కీ చూడండి:

అన్నయ్యతోటి విస్సాప్రగడ కామ
రాజు భాషించు హేళి దాక్షిణ్య శాలి.

ఇదీ కీ పద్యచరణాలు. మొదటి చరణంలో 12 అక్షరాలు, రెండవ చరణంలో 12 అక్షరాలు ఉండడం గమనించండి.

ఒక్కో అక్షరానికీ ఒక్కో విలువ ఉందని గుర్తుంచు కోండి. తొలి చరణంలోని 12 అక్షరాలకీ వరుసగా 1,2,3,4,5,6,7,8,9,10,11,12

అలాగే రెండవ చరణంలోని అక్షరాలకి వరుసగా 13,14,15,16,17,18,19,20,21,22,23,24 విలువలు అని గుర్తుంచుకోండి.

(ఉదాహరణకి: బ అనే అక్షరానికి విలువ 15, అలాగే ద అనే అక్షరానికి విలువ 20)

సరే, ఇందాక మీరు ళ అనే అక్షరాన్ని తలుచుకున్నారు. నాకు మీరు తలుచుకున్న అక్షరం ఏదో చెప్ప లేదు కదా?. నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నల ప్రకారం మీరు తలుచుకున్న అక్షరం తొలి రెండు పాదాలలోనూ, చివరి అయిదో పాదం లోనూ మాత్రమే ఉంది అని మీరు కించిదసహనంగా చెప్పగా, నేను గ్రహించాను కదా? ఆ రెండు పాదాల ముందూ నేను వేసుకున్న అంకెలను కూడితే 19 వచ్చింది కదూ?

ఇప్పుడు ఈ పంతొమ్మిది (19) విలువ కలిగిన అక్షరం ఏదో కీ వాక్యంలో చూడండి.

కీ వాక్యంలో 19 వ అక్షరం ళ. కనుక మీరు తలచిన అక్షరం ళ అండోచ్ !

అదీ తమాషా ! ఈ గణితం పద్య రూపంలో ఉండడమే దీని ప్రత్యేకత! ఈ తమాషా పద్యం చెప్పిన కవి విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రామ వాస్తవ్యుడని పద్యంలో ఉండే ఆకరం బట్టే తెలుస్తోంది.

11, జూన్ 2010, శుక్రవారం

అక్షరాస్యులు కూడ అడుక్కోవడం తప్పదా ?

ఇవాళ సాక్షి దిన పత్రికలో వచ్చిన ఈ ఫొటో చూసేరా ? మీకేమనిపిస్తోంది ? నాకుమాత్రం ఇది బాధ్యతారాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా తోస్తోంది.

ప్రజా సేవకు వినియోగ పడ వలసిన పోలీస్ సబ్ కంట్రోల్ రూం నానా చెత్త ప్రకటనలతో దిక్కుమాలి పోయి ఉంది. ఇంత నిర్లిప్తత క్షంతవ్యమా ?

మన మహా నగరంలో మనం పడుతున్న ఒక ముఖ్యమైన యిబ్బందిని మీ దృష్టికి తెస్తున్నాను ...

మనం బస్సులోనో , లేదా , సొంత వాహనంలోనో , టూ వీలర్ మీదనో , కాదంటే కాలి నడకనో మన మహా నగరంలో వెళ్తున్నామనుకోండి. మనం ఏ ప్రాంతంలో ఉన్నామో ఛస్తే తెలియదు. ఎవరినయినా అడగాల్సిందే. పాత వారికీ, ఆ ప్రాంతం పరిచయం ఉన్న వారికీ అయితే ఫరవా లేదు. ఈ మహా నగరం లోనే ఉంటున్నా, ఆ ప్రాంతం తెలియని వారి గతేమిటి ? ఇక, నగరానికి బొత్తిగా కొత్త వారయితే యిక చెప్పే పని లేదు. నగర పాలక సంస్థ వారు ప్రాంతాలని సూచిస్తూ పెట్టే బోర్డులు ఎక్కడో ఉంటాయి. కిక్కిరిసిన జన సమ్మర్ధంలో కనిపించవు.అంతా అయో మయం. గాభరా. అది ఏ ప్రాంతమో తెలుసు కోవాలంటే చచ్చినట్టు ఎవరినయినా అడగక తప్పదు. అక్షరాస్యులమై ఉండి కూడా ఈ అడుక్కోడం తప్పదంటారా ?

దయ గల ప్రభువులు, మనలను ఏలే మహానుభావులు ఒక చిన్న నిబంధనని ఖచ్చితంగా అమలు పరిస్తే ఈ బెడద తప్పి పోతుంది. దీనికి అదనంగా ఎర్ర ఏగానీ ఖర్చు కూడా ఏలిన వారికి ఉండదు.

కొద్దిపాటి నిబంధనలతో నగర వాసులకీ, నగరానికి వచ్చే కొత్త వారికీ కొండంత మేలు జరుగుతుంది ...

అదేమిటో వివరిస్తాను ...

నగరంలో బజార్లమ్మట ఏ ప్రాంతానికి వెళ్ళండి ... ఆకర్షణీయమయిన పెద్ద పెద్ద సైన్ బోర్డులూ, హోర్డింగులూ కనిపిస్తూనే ఉంటాయి. కూడళ్ళలో ట్రాఫిక్ ఐలెండులు ఎలానూ ఉంటాయి.

ఎక్కడో, మన పూర్వజన్మ పుణ్య పరిపాక ఫలితం వల్ల కొద్ది పాటి సైన్ బోర్డుల మీద అది ఏ ప్రాంతమో రాసి ఉంటుంది. తక్కిన లక్షలాది పెద్దా చిన్నా బోర్డులన్నీ ఆయా షాపుల పేర్లతోనూ, తక్కిన వాణిజ్య ప్రకటనలతోనూ నిండి పోయి ఉంటాయి. ఎక్కడా అదే ప్రాంతమో మచ్చుకయినా కనిపించదు.

ఏలిన వారికి నా సూచన ఏమిటంటే .....

వ్యాపార ప్రకటనల కోసం మీరు ఎన్ని బోర్డులు పెట్టు కోండి, ఎలాంటి రాతలు రాసుకోండి. కానీ ...

ఆ బోర్డుల మీద ఖచ్చితంగా ఆ ప్రాంతం పేరు ఇంగ్లీషులోనూ , తెలుగు లోనూ, వీలయితే జాతీయ భాష లోనూ రాసి తీరాలి. లేని వాటికి అనుమతి రద్దు చేస్తూ వాటిని తొలిగించాలి.

నిర్ణీత గడువు యిచ్చి, మన మహా నగరంలో గల్లీ గల్లీ లోనూ, ప్రధాన రహదార్ల మీదా, ఎక్కడవనీయండి ...ఆ ప్రాంతాన్ని సూచించని బోర్డులను ఎంత మాత్రం ఇక మీదట అనుమతించ కూడదు.

ప్రజోపయోగకరమయిన ఇలాంటి చిన్న చిన్న ఏర్పాట్లు చేయడానికి కూడా అంతగా ఆసక్తి కనబరచని ఏలిన వారికి ఓ దండం పెట్టి, ఆ పనేదో ప్రజా సంఘాలు చేపట్ట వచ్చును. ధరల పెరుగుదల మీద మండి పడుతూ ప్రదర్శనలు చేసే రాజ కీయ పక్షాల వారూ, యితర ప్రజా సంఘాల వారూ యిందుకు నడుం కట్టాలి.

నా సూచన నచ్చితే మీ కామెంట్లతో స్పందించండి. ఇది పరిగణించాల్సిన విషయంగా తోస్తే, మీరిచ్చే సలహాలు కూడ నలుగురితో పంచుకోండి.

లేదూ, యిలాగే ఉందాం, అనుకుంటే సరే.

ఎన్ని యిబ్బందులని, ఎన్ని నరకాలని, ఎన్ని అసౌకర్యాలని , ఎన్ని అవమానాలను , ఎన్ని అనుచితాలను నిత్యం భరిస్తూ నగర జీవితం గడిపేయడం లేదు కనుక ?